కొత్త కొత్తగా ఉగాదిలోకి …

ఉదయం లేవగానే మంచి మాట వింటే ఎలా ఉంటుంది? నచ్చిన వాళ్ళ పిలుపు , హృదయానికి హత్తుకునే సంగీతం లా ఉంటుంది కదా! అందుకే మనకిష్టమైన పండుగ శుభాకాంక్షలు అందరికీ చెబుతామూ, కోరుకుంటాము. పండుగల రోజు దేవుడిని , ప్రకృతి మాత నూ పలకరించి, పులకరిస్తాం!! ధన్యవాదాలు కూడా తెలుపుతాం .
మరి ఇప్పుడు ఆ పండుగ ఏంటి దాని పరమార్థం ఏమిటో పునశ్చరణ చేసుకుందాం . అంటే రివైజ్ చేసుకుందాం.. రివ్యూ చేసుకుందాం….

తెలుగు నూతన సంవత్సరాది ఉగాది. యుగాది అని కూడా అంటారు యుగ అనగా కాలమని ఆది అంటే ఆరంభం అని, ఉ -అంటే నక్షత్రం, గ- అంటే గమనం, నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజును ఉగాదిగా జరుపుకుంటాము అని కూడా చెబుతారు. ఇంకొక కథనం ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను దొంగలించాడు అప్పుడు విష్ణుమూర్తి మత్స్యవతార రూపంలో వెళ్లి సోమకారుణ్ణి వధించి వేదాలను బ్రహ్మకు అప్పచెప్పాడట. బ్రహ్మదేవుడు ఈ రోజే సృష్టికార్యం ప్రారంభించినాడని పురాణ వాక్యం. తెలుగు వారు ఎక్కువగా చంద్రమానం అనుసరించి మొదటి నెల చైత్రమాసం కనుక ఈ మాసం మొదటి రోజైన చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఉగాది జరుపుకుంటారు. ఇంగ్లీష్ నెలలు ప్రకారం మార్చి నెల అవుతుంది .
కొత్త సంవత్సరం అనేది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మారుతుంది. అమెరికా న్యూ ఇయర్ జనవరి 1, అలాగే చైనా ఫిబ్రవరి న్యూ ఇయర్. నోవరేజ్ మార్చ్ లో, ఇథోపియా సెప్టెంబర్ లో న్యూ ఇయర్ జరుపుకుంటుంది ( వీరి క్యాలెండర్లో 13 నెలలు ఉండడం విశేషం ).
మనదేశంలో గుజరాత్ అక్టోబర్, నవంబర్లో, బెంగాలీ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ ఇంచుమించు మార్చి ఏప్రిల్ నెలల్లోనే వివిధ రకాల పేర్లతో కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు.
మన కొత్త సంవత్సరాదిలో మన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలలో భాగంగా అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపేటప్పుడు సారే పెట్టి పంపుతారు మళ్ళీ అలాగే ఇంచుమించు అంతే ఘనంగా ఉగాది సారే పెట్టి అత్తవారింటి నుండి అమ్మాయిని అల్లుడిని సంవత్సరాది పండుగకు తీసుకువస్తారు.
సూర్యోదయానికి ముందే లేచి వాకిళ్లలో ముగ్గులు వేసి, గడపలకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెడతారు. మామిడి తోరణాలతో అలంకరిస్తారుఏ పండుగకైనా ఇది ఆరంభం, ఆనవాయితీ. పండుగ అంటేనే మలినాన్ని తొలగించే పవిత్రత,శుభ్రత. మన ఇల్లు వాకిళ్లలోకి భగవంతుని ఆహ్వానించడమే గాక మనందరి గుండె గుడిలో కొలువై ఉన్న దైవాన్ని మనం పలకరించుకోవడమే పండుగల పరమార్థమని మన పెద్దలు నేర్పుతూ వచ్చిన మన సంస్కృతి. పదిమందితో కలిసి పండుగ సంబరాన్ని పంచుకోవడమే పండుగల ఉద్దేశ్యం కూడా.
వసంత ఋతువు రాకతో ప్రకృతి అంతా పచ్చదనాన్ని నింపుకుంటుంది. మావిచిగుళ్ళు తింటూ మత్తెక్కిన కోయిల రాగాలు మనసును ఉల్లాస పరిస్తే, రుచులు కోరుకునే నాలుక షడ్రుచుల,నా స్వాదిస్తూ, శరీరానికి కావలసిన నూతన శక్తి నిస్తుంది.
వసంత ఋతువు వెంట రాబోయే కాలం గ్రీష్మ ఋతువు కాబట్టి, ఉష్ణం ఎక్కువయ్యి శరీర వ్యాధులు పెరుగుతాయి. వందలఏళ్ళ క్రితం మనుషులు తయారు చేసే కృత్రిమ మందులు లేవు. ప్రకృతి ప్రసాదించిన వృక్ష సంపదపైనే మనుషులు ఆధారపడ్డారు. అందుకే వృక్షాలను ఓషధులు అని కూడా అంటారు. వేపకు శరీరానికి వేడి తగ్గించే రోగ నిరోధక శక్తి ఉన్నట్లే, బెల్లo నుండి రక్తపుష్టి, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. పెద్దమ్మ, ఆటలమ్మలకు వేపతోనే వైద్యం చేసే వాళ్ళు. ఏ సమయంలో ఏ ఉపద్రవం వస్తుందోనని మన అవసరాలకు ప్రకృతి ముందే అన్నీ ఏర్పాట్లు చేసి మనల్ని కాపాడుతుంది. అందుకే ప్రకృతిని మనం నిర్వీర్యం చేస్తే మన అమ్మను మనం చంపుకున్నట్టే, అంతకంటే నీచం లేదు.
లోకంలో ఉన్నవి ఆరు రుచులే, వేప -చేదు గుణాన్ని కలిగి శరీరానికి చలువనిస్తుంది. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలనుండి మంచిని గ్రహించమంటుంది. అలాగే ఉప్పు- రుచిని ఉత్సాహాన్నిస్తుంది., చింతపండు -నేర్పరి తనాన్ని, మామిడి- సవాళ్లను ఎదుర్కొనే శక్తిని, కారం -సహనాన్ని నేర్పుతాయి.
ఉగాది మనకు ప్రకృతి జ్ఞానం ఇస్తుంది,శారీరక జ్ఞానం, ఒక ప్రతీకాత్మక జ్ఞానం ఇస్తుంది, భావోద్వేగ జ్ఞానాన్ని ఇస్తుంది, ఇన్ని మర్మాలు ఒక్క ఉగాది పచ్చడి ద్వారా మనకు తెలుస్తున్నాయి. అందుకే ముఖ్యంగా పిల్లలు భవిష్యత్తులో మెచ్చుకోలుకు పొంగిపోక, విమర్శలకు కృంగిపోక, అయోమయ స్థితిలో పడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు నడవాలని, షడ్రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడి సందేశాన్ని, సాధనంగా పెద్దలు పిల్లలకు అందించాలి. నిజమైన విద్య స్కూలు, కాలేజీల్లో కాదు మన ఇంటి సంప్రదాయంలో ఉన్నది, ఈ తత్వం తెలుసుకోవడంలో ఉన్నది.

కొత్త బెల్లం,కొత్త చింతపండు, వేప పువ్వు, మామిడికాయలు ఉప్పు, కారం ( మిరియాలు). ఇవన్నీ కొత్త పంటలుగా ఉగాది నాటికి వస్తాయి. షడ్రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడి జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులకు, చిడిముడులకు ప్రతీ కగా సమభావంతో స్వీకరించాలన్న భావంతో ఉగాది పచ్చడి భగవంతునికి నివేదించి అందరూ తప్పక తింటారు. భగవంతునికి పూజ నైవేద్యాలు అనంతరం దేవాలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని పంచాంగ శ్రవణం చేస్తారు. వారి వారి జన్మ నక్షత్రాలను బట్టి రాసులు ఉంటాయి. ఏ ఏ రాశి వారికి ఆ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎంత ఉంటాయి, గ్రహదోషాలు, దేశ పరిస్థితులు ఇవన్నీ పంచాంగ శ్రవణంలో వివరిస్తారు. ఇంగ్లీష్ నెలలు అందరికీ అనుకూలంగా, ప్రభుత్వ కార్యాలయాలు, మిగిలిన వ్యవహారాలలో మన నిత్య విధులలో కూడా అలవాటైనప్పటికీ, మన పండుగలు, వివాహాది శుభకార్యాలు, ప్రయాణాలు, అవి ఇవి అని ఏమిటి ? సకల శుభకార్యాల ముహూర్తాలు తిధి వార నక్షత్రాలను అనుసరించే మనం జరుపుకుంటాము. ఆ సంవత్సరం ఏ పంటలకు అనుకూలము అనేది కూడా పల్లెల్లో చూస్తారు. ఆ పంటలే ప్రముఖంగా వేస్తారు కూడా, కొత్త పనులకు ఈరోజు శుభారంభంగా తలుస్తారు. ఊర్లలో సాయంత్రాలు తప్పనిసరిగా దేవుడి ఊరేగింపు ఉంటుంది. ఆరోజు స్వామి దేవాలయం నుండి బయటకు వచ్చి రాని వారిని,రాలేని వారిని కూడా అనుగ్రహించి దీవిస్తాడు. చల్లని చూపుల స్వామి పాడిపంటలతో పల్లె సుఖశాంతులతో ఉండాలని, పర్యవేక్షణకు వస్తాడని అందరి నమ్మకం.

Written by Shyama Dasi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అరుణ కాంతులు

రైతు – నేల తల్లి సైనికుడు