వందేమాతరం!

వందేమాతర గీతం… అవమాన గాయంలోంచి పుట్టుకొచ్చిన గేయం. దేశాన్ని మాతగా వర్ణిస్తూ ప్రేమ, భక్తి రంగరించి రాసిన సంక్షిప్త కావ్యం, ఉద్యమకారులు ‘పోరాట స్ఫూర్తి కేంద్రం’, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ సమస్త జాతినీ ఒక్కటి చేసిన ఆ సమర నినాదానికి సరిగ్గా 150 ఏళ్లు!

భారత దేశానికి నవలా ప్రక్రియను పరిచయం చేసిన బంకిం చంద్ర చటోపాధ్యాయ 1875, నవంబరు 7న క్రింది పాదాలు రాశాడు.

వందేమాతరం గీత రచయిత బంకించంద్ర ఛటర్జీ

వందేమాతరం
సుజలాం సుఫలాం
మలయజ శీతలాం..
సస్యశ్యామలాం మాతరం.

శుభ్రజ్యోత్స్న పులకిత యామినీం
పుల్లకుసుమిత ధ్రుమదళ శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం.
వందేమాతరం……

1905 అక్టోబర్ 16 న బ్రిటీషు వారి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఐక్య భారతాన్ని స్మరించుకునేలా తొలి సారిగా ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించారు ఠాగూర్.

బిపిన్ చంద్రపాల్ వందేమాతర గీతాన్ని దేశానికంతా పరిచయం చేశాడు.
వందేమాతరం నినాదాన్నీ వివిధ భాషల్లో కరపత్రాలుగా ముద్రించి పంచారు. అదే పేరుతో పత్రికలూ నడిపారు. సాయుధ దళాల ముఖ్యనేత అరవింద్ ఘోష్ మొదటగా వందేమాతర గీతాన్ని ఇంగ్లిషులోకి అనువదించాడు. ఆ ప్రతి దక్షిణాది భాషలలోకీ కూడా తర్జుమా అయ్యింది. 1906లో పాథేఫోన్స్ కంపెనీ దాన్ని గ్రామఫోన్ రికార్డుగా తీసుకొచ్చింది.

భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో 1905-11 మధ్య కాలాన్ని ‘వందేమాతర యుగం’ అనవచ్చు. వందేమాతర గీతం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చింది. సామాన్యులనూ సమరయోధులుగా మార్చింది. గ్రామాల్లోనూ ‘వందేమాతరం సంఘాలు’ వెలిశాయి కొద్దిమందికే పరిమితమైన ఉద్యమంలోకి విద్యార్థిలోకమంతా ఉత్సాహంగా దూకింది.

తెలంగాణలోనూ 1938 నవంబర్ 28న బి హాస్టల్ కమ్యూనిటీ హాలులో సమావేశమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు వందేమాతరం గేయాన్ని గళమెత్తి పాడారు. వందేమాతరం విద్యార్థి ఉద్యమంగా రాజుకునీ హైదరాబాద్లో మొదలై నిజాం రాజ్యం మొత్తం పాకింది.

1947 ఆగస్టు 15 భారత దేశానికి స్వాతంత్య్ర్యం సిద్ధించిన రోజున ప్రఖ్యాత సంగీతకారుడు ఓమ్ ప్రకాశ్ వందేమాతర గీతాన్ని పార్లమెంటులో ఆలపించారు. ఏ వాద్య సంగీతమూ లేకుండా అచ్చమైన గాత్రాన్ని వినిపించారు.
అదే పర్వదినాన వందేమాతరాన్నే తొలి విజయ గీతంగా ఆల్ ఇండియా రేడియో లో ప్రసారం చేశారు!

1950 రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం ‘వందేమాతరం గేయాన్ని… రవీంద్రుడి జనగణమన జాతీయగీత సమానంగా గౌరవించాలి… అదే స్థాయి హోదాని కల్పించాలి’ అంటూ తీర్మానించింది.

రెండింటికీ సమాన హోదాయే ఉన్నా ‘జనగణమన’ పాడటానికి చాలా కట్టుబాట్లు ఉన్నాయి. ఆ బాణీని ఎవరూ మార్చకూడదు, పాడే సమయమూ (52 సెకన్లు) మారకూడదు.

వందేమాతరానికి ఆ పరిమితులు లేవు. కాబట్టే వేలాది వెర్షన్లు వచ్చాయి.

దూరదర్శన్లో ప్రతిరోజూ సుప్రభాత గీతంగా వినిపించే వందేమాతరానికి నేపథ్య సంగీతం ఉండదు.

బీబీసీ వరల్డ్ సర్వీస్ నిర్వహించిన అంతర్జాతీయ పోల్లో … ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాల్లో రెండో స్థానం అందుకుంది వందేమాతరం.

Written by Rupa devi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కాటుక కంటి నీరు

గాన కోకిల