విప్లవమాత భికాజీ రుస్తుం కామా

భారత స్వతంత్ర పోరాటంలో దేశంమొత్తంగా సత్యాగ్రహాలు, నిరసనలు, ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు కూడా చేసారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ మొదలైనవారు 1931 లో ఉరికొయ్యలు ఎక్కారు. విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ పోరాటంలో చంపబడ్డాడు. ఆంగ్లేయులు అరాచకంగా లాటీచార్జ్ చేయటం వల్ల లాలా లజ్ పత్ రాయ్ తీవ్రంగా గాయాలై చనిపోయాడు.

1928లో సైమన్ కమిషన్‌కి వ్యతిరేకంగా లాహోర్‌లో జరిగిన నిరసనల్లో లాలా లజ్‌పత్ రాయ్ పాల్గొన్నారు. అప్పటి బ్రిటిష్ పోలీస్ సూపరింటెండెంట్ జేమ్స్ ఏ. స్కాట్ ఆదేశాలపైభారీ లాఠీచార్జ్జరిగింది.ఆ లాఠీచార్జ్‌లో లజ్‌పత్ రాయ్తీవ్ర గాయాలపాలయ్యారు.“ఇవాళ పోలీసులు నాపై కొట్టిన ప్రతి దెబ్బ, ఆంగ్లేయుల పాలనపై కొట్టిన దెబ్బే.”అని ఆయన అన్నారు. లాఠీచార్జ్‌లో వచ్చిన తీవ్రమైన గాయాల వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించింది.కొద్ది వారాల తరువాత,గుండె సమస్యలు తీవ్రమై, ఆ గాయాల ప్రభావంతోనే ఆయన మరణించినట్లు ఆ కాలం నాటి వైద్యులు, చరిత్రకారులు పేర్కొంటారు.

బ్రిటిష్ పంజాబ్ గవర్నర్ మైఖేల్ ఓ డైయర్ జలియన్ వాలా బాగ్ మారణకాండకి వ్యతిరేకంగా అతన్ని మట్టుపెట్టి జైల్లో మగ్గాడు ఉద్దమ్ సింగ్. జనవరి 21, 1943 నాడు క్విట్ ఇండియా మూమెంట్ నాయకుడినిహోము కలానిని ఉరితీసారు. రాణి లక్ష్మీబాయి, మంగల్ పాండే, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ లాంటి ఎంతోమంది త్యాగధనుల కష్టమే ఈనాడు మనమనుభవిస్తున్న స్వతంత్ర భారతం.

ఈపోరాటపు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాయబడి ఘనతకెక్కినవారు కొందరైతే, ప్రపంచానికి తెలియని, మనవరకు చేరని త్యాగధనులు లెక్కలేనంత మంది ఉన్నారు. భారత దేశపు మూలమూలలనుండి పౌరులు ఈ ఉద్యమాల్లో పాలు పంచుకున్నవారే. చాలా మంది స్వాతంత్ర్యం పోరాటయోధులు చరిత్రమరుగున అనామకంగా జారిపోయారు. అందరూ మనదేశంలో ఉండి పోరాడిన వారు. కాని మన దేశపు వనిత, పరాయి దేశం అందునా మనదేశాన్ని పట్టి పీడిస్తున్నబ్రిటన్ లో ఉండి భారతదేశం కోసం పోరాటం చేసిన యోధురాలు. బ్రిటిష్ అరాచకపు పాలన గురించి ప్రపంచ దేశాలకు తెలియజెప్పిన, గళమెత్తిన వీర వనిత మరెవరో కాదు “భికాజీ రుస్తుం కామా”. కాని మనలో చాలా మందికి తెలియదు ఆమె సేవా నిరతి, పోరాట ధీరత్వం.

భికాజీ రుస్తుం కామా, “మేడమ్ కామా”గా కూడా పిలువబడేవారు, భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆమె భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్సీ వనిత.భికాజీ కామా సెప్టెంబరు 24 1861న ధనవంతుడైన పార్సీ కుటుంబంలో జన్మించింది. తండ్రి, సొరాబ్జీ ఫ్రాంజీ పటేల్, బొంబాయి ( ముంబై ) నగరంలో వ్యాపారస్తుడు. దానం చేయడంలో, సహాయ పడడంలో అగ్రగామిగా ఉన్న ప్రముఖ వ్యాపారి. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రభావితమైన భికాజీ బాల్యం నుండే రాజకీయ సమస్యల వైపు ఆకర్షితురాలైంది. ఆమెకు భాషల పట్ల ఉన్న తేలివితేటలతో దేశంలో ఉన్న ఇతర వర్గాలతో వాదించడంలో ప్రావీణ్యం పొందింది. ఆ సమయంలో దేశంలోనే అత్యుత్తమ మహిళల విద్యాలయంగా భావించే అలెగ్జాండ్రా సంస్థ నుంచి ఆమె చిన్నతనంలోనే పలుభాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. మంచి విద్య, ఆంగ్లం మీద పట్టు వచ్చింది.

భికాజీ 1885లో రుస్తుం కామా అనే ప్రసిద్ధ న్యాయవాదిని వివాహం చేసుకుంది, కానీ సామాజిక రాజకీయ సమస్యలతో ఆమెకు విభేదాలకు దారితీసింది. భర్తతో పాటు అత్తవారింట అంతా ఆంగ్లేయ సర్కారుకు మద్దతుదారులే. రుస్తుం కామా బ్రిటిష్ వారి వ్యామోహం, సంస్కృతి పట్ల మోజుతో, బ్రిటిష్ పాలకులు భారతదేశానికి ఎంతో మేలు చేసారనే భావనతో ఉన్నవాడు. జాతీయవాది, దేశ భక్తి ఉన్న భికాజీ, బ్రిటిష్ వారు తమ సొంత లాభం కోసం భారతదేశాన్ని నిర్దాక్షిణ్యంగా దోపిడీ చేశారని నమ్మిన వ్యక్తి. ఇద్దరూ భిన్నధ్రువాలయ్యారు. చివరకు బ్రిటిష్‌పై పోరాటం కోసం ఆమె భర్తకు దూరమయ్యారు.

భికాజీ తన సమయాన్ని, దాతృత్వ కార్యకలాపాలు చేయడం, సామాజిక సేవలాంటి వాటితోగడుపుతూ ఉండేది. 1896లో బాంబే ప్రెసిడెన్సీలో ‘బుబోనిక్ ప్లేగు’ వ్యాధి రావడం, ఎంతో మంది చనిపోవడం, దానితో ప్లేగు బాధితులను కాపాడటానికి పనిచేస్తున్న బృందానికి సహాయం చేయడానికి భికాజీ స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. ప్రజలు భయంతో ఇళ్లలో తలదాచుకున్నారు. కానీ భికాజీ మాత్రం తన ప్రాణాల్ని పణంగా పెట్టి, రోగులకు సేవ చేసింది. ఆమెకి కూడా ఈ ప్రాణాంతక వ్యాధిరావడంసంక్రమించింది. కోలుకున్నప్పటికీ, విశ్రాంతి కోసం యూరప్ వెళ్ళమని డాక్టర్ల సలహా మేరకు 1902 లో, భికాజీ భారతదేశం నుండి లండన్ కు వెళ్ళింది. ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత , భారతదేశపు బ్రిటిష్ వారు భికాజీకి ఒక సందేశం పంపుతూ,”ఒక వేళ భారతదేశం వెళ్లాలంటే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనకూడదు” అనే షరతు విధించారు. దీనితో భికాజీ లండన్ లోనే ఉండవలసి వచ్చింది.చికిత్స కోసం వెళ్లిన ఆమెని, ఆ యూరప్‌ భికాజీ జీవితాన్నే మార్చేసింది. యూరప్‌లో కొత్త దీపం వెలిగింది. ఆరోగ్యం మెరుగయ్యాక భారత్‌కు తిరిగి రావటానికి ఆంగ్లేయ సర్కారు షరతులు విధించడం,భారత స్వాతంత్య్రోద్యమానికి,బ్రిటన్ వ్యతిరేక చర్యలు చేయనని హామీ ఇస్తే గాని, ఇండియాకు వెళ్ళనీయనని ప్రభుత్వం ఆంక్షలు విధించటం వల్ల, ఆమె ఇక యూరప్‌లోనే ఉండాలని నిశ్చయించు కున్నారు. వారి మాటలు విని భికాజీ హృదయం మంటలతో రగిలింది. “మన దేశం బానిసగా ఉంటే నేను ఎలా నిశ్చింతగా జీవిస్తాను?”అని.భారత స్వాతంత్ర్య పోరాటానికై తన చర్యలను తీవ్రతరం చేసింది. గళం ఎత్తి గర్జించింది. పత్రికలు, పాంఫ్లెట్లు ముద్రించి, భారతదేశంలో జరుగుతున్న దౌర్జన్యాలను ప్రపంచానికి తెలియజేసింది.

అక్కడున్న భారత స్వాతంత్ర్యోద్యమ కర్త శాంయజీ కృష్ణవర్మ గారి చేత ప్రభావితమై, 1905 లో దాదాభాయ్ నౌరోజీ కి సహాయకురాలిగా ఇండియన్ హోం రూల్ సొసైటీని స్థాపించింది.
భికాజీ ఇంగ్లండ్ వదలి పారిస్ నగరంలో నివాసం ఏర్పరచుకుంది. 1907 ఆగస్టు 22.. జర్మనీలోని స్టుట్‌గాట్‌లో అంతర్జాతీయ సామ్యవాద సదస్సు జరిగింది. కమ్యూనిస్టు యోధుడు లెనిన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. భారత్‌ నుంచి దాదాబాయి నౌరోజీ వచ్చారు. అలాంటి సదస్సులో.. నిండు చీరతో.. తలపై ఒకవైపు కొంగు కప్పుకొని కూర్చుంది ఓ యువతి.

భారత్‌ తరఫున బ్రిటిష్‌ యూనియన్‌ జెండాను ఎగరవేయటానికి సిద్ధమవుతుంటే.. వ్యతిరేకించిన ఆ యువతి తన సంచిలోంచి చిన్న త్రివర్ణ పతాకాన్ని తీసి ఎగరేశారు. అంతర్జాతీయ సోషలిస్టు సమావేశంలో వేదికపైకి భారతీయురాలు భికాజీ కామా అడుగుపెట్టింది. ఆమె చేతిలో ఒక జెండా ఉంది. త్రివర్ణ పతాకం. ఆమె గళం మార్మోగింది:

“ఇది బానిసత్వంలో ఉన్న భారతదేశపు జెండా. ఒక రోజు ఇది స్వతంత్ర భారత జెండా అవుతుంది!”అక్కడున్నవారంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ క్షణం భారత చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది.ఆ పతాకాన్ని, అప్పటి 8 రాష్ట్రాలకు ప్రతీకగా ఎనిమిది పువ్వులు, హిందూ ముస్లింల ప్రాతినిధ్యంగా కాషాయం, ఆకుపచ్చ రంగులు, స్వాతంత్య్రం కోసం అమరులవుతున్నవారి చిహ్నంగా ఎరుపు రంగులతో, మధ్యలో వందేమాతరం నినాదంతో.. రూపొందించారు.

మనదేశానికొక పతాకం ఉండాలని, దామోదర్ వినాయక్ సావర్కర్ తో కలసి ఒక త్రివర్ణ పతాకాన్ని తయారుచేసి ఆ సమావేశంలో ప్రదర్శించింది. భారత స్వాతంత్య్ర పోరాటానికి మద్దతివ్వాల్సిందిగా సదస్సులోని ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. భారత్‌లో బ్రిటిష్‌ అకృత్యాలను, భారత స్వాతంత్య్ర ఆవశ్యకతను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకొచ్చారు. ఆమే బికాజీ కామా. అంతా ఆమెను మేడమ్‌ కామా అని పిలవటం మొదలెట్టారు. భారత్‌లో ఇంకా స్వాతంత్య్ర డిమాండ్లే గట్టిగా వినిపించని కాలంలో.. త్రివర్ణ పతాకాన్ని విదేశీగడ్డపై ఎగరేసిన ధీశాలి మేడమ్‌ కామా.

ఆమె జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశంలో భారత స్వాతంత్ర్య జెండాను ఎగురవేసిన ఘనత పొందారు. కలకత్తా జెండా ఆధారంగా ఆమె ఈ జెండాను రూపొందించారు, ప్రస్తుత మన జాతీయ పతాకానికి ప్రథమ రూపం భికాజీ కృషే.

లండన్ లో ఆమెకు విప్లవ వాదులు శ్యాంజీ కృష్ణ వర్మ, లాలా హర్ దయాళ్, ఎస్ఎస్ రాణా, వీర సావర్కర్, సేనాపతి బాపత్ లతో పరిచయం ఏర్పడింది. దాదాభాయ్ నౌరోజీలతో కలిపి విదేశాల్లో భారతదేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేయటం మొదలుపెట్టారు. మొదటి ప్రపంచ యుద్ద సమయంలో లండన్ లో ఆమెపై కట్టడి పెరగ్గా, పారిస్ కి మకాం మార్చి, పారిస్ ఇండియన్ సొసైటీ స్థాపించారు. ఐర్లాండ్‌, ఈజిప్టు, సోవియట్‌ విప్లవవాదులతో పాటు ఫ్రాన్స్‌ సోషలిస్టులతో ఆమెకు సత్సంబంధాలుండేవి. లెనిన్‌, మాక్సిమ్‌ గోర్కీలాంటి ప్రముఖులు ఆమెను అభిమానించే వారు. భారత విప్లవవాదులకు ఆర్థికంగా కూడా ఆమె సాయం చేసేవారు. సావర్కర్‌ జైల్లో ఉండగా ఆయన కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే.. మేడమ్‌ కామానే వారిని ఆదుకున్నారు.

ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌ తరఫున పాల్గొనటానికి ఐరోపా వచ్చిన భారతీయ సైనికులను ఆమె కలుసుకొని వారిని ఆంగ్లేయులపై తిరుగుబాటుకు ప్రోత్సహించారు. దీంతోబ్రిటన్‌ ఒత్తిడితో పారిస్‌లోనూ ఆమెపై ఆంక్షలు మొదలయ్యాయి.భికాజీ ఫ్రాన్స్లో నిర్భంధించబడింది. యుద్ధానంతరం ఫ్రాన్స్ లోనే యుండి, మన స్వాతంత్ర్యం కోసం వ్యాసాలు వ్రాస్తూ, ప్రసంగాలు చేస్తుండేది.

సోవియట్‌ యూనియన్‌కు వచ్చి ఉండాలని లెనిన్‌ ఆహ్వానించారు. కానీ ఆమె అమెరికా పయనమై.. అక్కడి ప్రజలకు భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని వివరించారు. భికాజీ కామా ధైర్యాన్ని చూసి బ్రిటిష్ ప్రభుత్వం ఆగ్రహించింది. ఆమెను భారత్‌లోకి రానివ్వలేదు. సుమారు 35 సంవత్సరాలు ఆమె విదేశాల్లోనే గడిపింది – స్వదేశం కోసం పోరాడుతూ, కలలు కంటూ. చివరికి, వృద్ధాప్యంలో ఉన్న భికాజీకి భారత్ తిరిగి వచ్చే అనుమతి లభించింది. 1935 వరకు అలా ప్రవాసంలోనే గడిపిన కామా ఆరోగ్యం దెబ్బతిని పక్షవాతానికి గురయ్యారు. ఇక ఆమెతో ఎలాంటి ప్రమాదం లేదని గుర్తించిన బ్రిటిష్‌ ప్రభుత్వం భారత్‌లో అడుగుపెట్టడానికి అనుమతించింది. 1935 లో జన్మభూమికి తిరిగి వచ్చిన 9నెలల తర్వాత, తన 74వ ఏట ఆ విప్లవమాత కన్నుమూసారు. తీవ్రమైన అస్వస్థతకు గురై, 1936 ఆగస్టు 13న మరణించింది. తన యావదాస్తిని ఆవాబాయి పెటిట్ అనాథ శరణాలయానికి దానం చేసింది. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అనుకుంటే అష్టైశ్వర్యాలను అనుభవించే అవకాశం. కానీ ఆమె వాటన్నింటినీ కాదనుకుంది. భర్తను సైతం వదులుకుంది. ఆంగ్లేయులకు లొంగకుండా భారతావని బానిస సంకెళ్ళు తెంచటంకోసం పరితపించింది. భారత్ లో ఇంకా స్వరాజ్య కాంక్ష మొదలు కాక ముందే 1907 లోనే బోల్ష్ విక్ వీరుడు లెనిన్ తదితరుల సమక్షంలో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసిన విప్లవ మాత భికాజీ రుస్తుం కామా.

భారతదేశంలో ఒక ప్రాంతానికి – Bhikaji Cama Place (భికాజీ కామా ప్లేస్) అని ఆమె పేరు పెట్టినట్టుగా తెలుస్తుంది.ఇంతటి గొప్ప దేశ భక్తురాలి స్మృత్యర్థం ఆమె జన్మ శతాబ్ది సందర్భంగా 1962 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్లను విడుదల చేసింది. 1997 సంవత్సరంలో మన కోస్ట్ గార్డ్ లోని అతివేగపు గస్తీ నౌకను ఆమె పేరు పెట్టారు.

భికాజీ కామా పేరు నేటికీ గర్వంగా పలుకుతారు.ఆమెను“భారత విప్లవ తల్లి”అని పిలుస్తారు.

భారత జాతీయ జెండా రూపకల్పనలో ఆమె పాత్రను ఎవరూ మరువలేరు.ఈ విధంగా భికాజీ కామా గారి జీవితం – ఒక త్యాగం, ఒక కల, ఒక జెండా కథ.

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

యోధ 

వైజ్ఞానికం వందే జగద్గురుం