అది ఉన్నతస్థాయి విద్యా అధ్యయన సంస్థ

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణం

హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కీ.శే. ప్రొఫెసర్ రామరాజు వెంకటేశ్వర రావు ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా పని చేసి అంచెలంచెలుగా ఎదిగిన విద్యా కుసుమం. వారు నీతి, నియమం, నిజాయితీ, నిబద్ధతతో క్రమశిక్షణకు గీటురాయిగా నిలిచి పెరిగిన ఉపన్యాసకులు. కీ.శే. ప్రొఫెసర్ మల్లారెడ్డి మామిడి గారు శాఖాధిపతిగా ఉన్నప్పుడు వారు ఉపన్యాసకులుగా పని చేశారు. వారు ప్రొఫెసర్ పదవిని చేపట్టాలంటే కనీసం ఒక పిహెచ్.డి విద్యార్థికైనా పర్యవేక్షకులుగా పని చేయవలసిన అవసరం ఏర్పడింది. అలాంటి సమయంలో నేను మొదటి పిహెచ్.డి విద్యార్థిగా 38 సంవత్సరాల క్రితం 1988లో వారి దగ్గరకు వెళ్ళడం జరిగింది . అంతకు ముందే నేను యస్.సి.ఇ.ఆర్.టి. లో ఎన్నో కార్యక్రమాలకు ఢిల్లీ వెళ్లడం జరిగింది. స్త్రీ విద్య, బాలికల విద్య, అనియత విద్య, మూల్యాంకన విభాగాలలో యస్.సి.ఇ.ఆర్.టి.లో పని చేసిన విస్తృత అనుభవం ఉన్నందున యం.ఫిల్. అవసరం నాకు కలుగలేదు. 1980లో ప్రభుత్వ ఉన్నత స్థాయి విద్య అధ్యయన సంస్థలో నేను మహబూబియా హైస్కూలు నుంచి పదోన్నతి పొంది సమగ్ర విద్యా తత్వ కళాశాలకు వెళ్లాను. అప్పటి నా శాఖాధిపతులు కీ.శే. భాష్యం గారు. ఏవో తాను పాఠశాలల్లో మ్యాగజైనులల్లో రాసిన వ్యాసాలను చూపి పి.హెచ్.డి. లో స్థానం సంపాదించుకున్నారు. కాని వారు పిహెచ్.డి పూర్తి చేయలేకపోయారు. మల్లారెడ్డి గారు ముందు భాష్యం గారి పదవీ విరమణ దగ్గరగా ఉన్నందున ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. “అమ్మా! భాష్యం గారి తరువాత నేను తప్పకుండ నీటు ఇస్తాను. నీవు పిహెచ్.డి.కి కావలసిన సామాగ్రిని అంతా తయారు చేసుకొమ్మని” అనునయంగా చెప్పారు. వారి మాటను నేను శిరోధార్యంగా భావించాను. సరేనని చెప్పాను.

ఈ మధ్య కాలంలో పాఠశాల విద్య గుమాస్తా ఒకరు నన్ను కలువుమని చెప్పి సమాచార మందించారు. నేను ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించి యం.ఇడి. చదివాను కాబట్టి వారిని ఎందుకు కలవాలి? అని ఊర్కున్నాను. అదే కథ అడ్డం తిరిగింది. నాతో పాటుగా ఇద్దరు ఉపన్యాసకులు కళాశాలలో చేరారు. వారిద్దరూ ఏం చేశారో నాకు తెలియదు. నేను అమాయకురాలిని. లంచం ఎలా ఇవ్వాలో నాకు తెలియదు. పల్లెటూరి బైతును. ఎంతసేపు “ప్రతిభ” ఆధారంగానే ఆశిస్తాను, ఆలోచిస్తాను. రెండు మూడు నెలలు నేను పచ్చ కామెర్లతో బాధపడ్డాను. కాబట్టి నేను పాఠశాల విద్యాశాఖలో పని చేస్తున్న గుమాస్తా దగ్గరకు పోలేదు. “మే” నెల అంతా కళాశాలకు సెలవులు. “జూన్”లో కళాశాల ప్రారంభమయింది. అలిఘడ్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. రాజకీయ శాస్త్రం, హిందీ ప్రవీణ మొదలైన పరీక్షలు రాసిన ఇంకో ఉపన్యాసకుడు ఇద్దరికి 1981 జూన్ లో ప్రమోషన్ ఇచ్చారు. ఒకరికి ‘తెలుగు పండిట్’ కోర్సులో, ఇంకొకరికి ‘హిందీ పండిట్’ కోర్సులో. ఎం.ఏ. తెలుగు, యం.ఇడి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలనైన నన్ను ప్రమోషన్ నుంచి తప్పించారు. 1980లో యస్.సి. కోటాలో, 1981లో యస్.టి. కోటాల నన్ను మాత్రం “చాదర్ ఘాట్ బాలికల పాఠశాల” కమాల్ టాకీస్ కు పంపారు. ఇది నా జీవితంలో ఎదుర్కొన్న మొదటి వివక్ష, అన్యాయం నాకంటే ముందుగా నాంపల్లిలో పని చేసే ఒక ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేస్తున్న అగ్రకులస్తురాలైన ఉపాధ్యాయునికి ప్రమోషన్ ఇచ్చారు. అది “ప్రజాభీష్టం” కోసమట. “Public Interest”. “వడ్డించేవాడు మనవాడైతే ఏ పంక్తిలో కూచుంటే ఏమిటి?” అన్న సామెత పాఠశాల విద్యకు సరిపోతుంది. జరిగిన అన్యాయానికి ఎదురొడ్డి నిలిచి వెనువెంటనే కోర్టులో దావా వేశాను.

పాఠశాల విద్యలో జరిగే ఈ అన్యాయాన్ని ఉటంకిస్తూ అప్పటి ముఖ్యమంత్రి కీ.శే. నందమూరి తారక రామారావు గారికి ఒక కథనం రాని అర్జీ పెట్టుకున్నాను. ఒక శుభోదయం అబిడ్స్ లోని వారింటికి వెళ్లి వారి ఉచిత దర్శనం వేళల్లో వారికి అందజేశాను. విచారణ మొదలయ్యింది. ముఖ్యమంత్రి గారు ప్రాథమ్య క్రమంలో ‘సరోజన’కు ప్రమోషన్ ఇవ్వాలని అర్జీ పత్రంపై రాశారు. విద్యాశాఖలో గందరగోళం మొదలయ్యింది. కోర్టు కేసును విరమించుకుంటే ప్రమోషన్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ వారు నాకు రాయబారం పంపారు. మీరు ప్రమోషన్ ఇచ్చిన వెంటనే యాంత్రికంగా నా అర్జీ రద్దవుతుందని నేను చెప్పాను. పాఠశాల విద్యా డైరెక్టర్ కీ.శే. వెంకారెడ్డి గారు ఏదో ఒక శాఖలో నాకు ప్రమోషన్ ఇవ్వాలని శతవిధాల ప్రయత్నం చేశారు. తుదకు దృశ్య శ్రవణ విభాగంలో నన్ను సర్దడానికి ప్రయత్నించారు. కాని గుమాస్తా గారు, సూపర్నిడెంటు గారు వారి తెలివితేటల్ని ప్రదర్శించి అది కూడా చెల్లకుండా చేశారు. Audio visual A.V. Education ను A.V. Aducation Andhra University Education మన వద్ద ఎవరు లేరని బుకాయించారు.

-నా పదోన్నతికి ఈ నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉంది. రాజకీయ సంక్షోభం కారణంగా ముఖ్యమంత్రి యన్.టి. రామారావు గారు పదవీచ్యుతులై కీ.శే. నాదెండ్ల భాస్కరరావు గారు ముఖ్యమంత్రి హోదాలో నియమితులయ్యారు. వారు అతి కొద్ది కాలం ఆ పదవిలో కొనసాగారు. పదవీ విరమణ కాలం 55 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలయింది. ఈ సంధి కాలంలో పదవీ విరమణ పొందిన శ్రీ భాష్యం గారు తన పదవిని మూడేండ్లు కొనసాగించాలని అర్జీ పెట్టుకున్నారు. నన్ను తన స్థానంలో సర్దుబాటు చేయడానికి విద్యాశాఖ అప్పటికే సన్నద్ధమయ్యింది. ఈ యాంత్రిక అభ్యంతరం తొలగిపోతే మీ ప్రమోషన్ కు దారి సుగమమవుతుందని విద్యాశాఖ వారు మాకు తెలిపారు. ఈ మధ్య కాలంలో వెంకారెడ్డి డైరెక్టర్ గారు పదవీ విరమణ చేశారు. కేరళకు చెందిన సతీనయ్యర్ ఐ.ఏ.యస్. గారు కమీషనరుగా విద్యాశాఖకు వచ్చారు. కీ.శే. ఆలె నరేంద్ర పాతబస్తీ టైగర్ సతీనయ్యర్తో సంప్రదింపులు జరిపారు. 3 సంవత్సరాల జీతభత్యాలు శ్రీభాష్యం గారికి చెల్లించి వారి అడ్డును తొలగించినారు. తేది 22 డిసెంబర్ 1983 రోజున ప్రమోషన్ ఇచ్చి సంతకం చేసి సతీనయ్యర్ ఐ.ఏ.యస్. తబాదిలా రీత్యా ఢిల్లీ విమానం ఎక్కారు. 23 డిసెంబరున నేను కళాశాలలో ప్రవేశించకపోతే నాకు 5 రోజులు ప్రభుత్వ సెలవులు వస్తాయి. 28 డిసెంబరు నెల నుంచి నా సర్వీసు మొదలవుతుంది. కాబట్టి చాదర్ ఘాట్ హెడ్మాస్టరు గారు సెలవుపై వెళ్లినందున ఒక సీనియర్ అధ్యాపకురాలు ప్రేమలతగారికి చార్జీ ఇచ్చారు. వారు కూడా ఊరు మీద తిరుగడానికి వెళ్లారు. దిక్కుతోచని పరిస్థితులల్లో వారిని పాఠశాలకు పిలిపించి నేను డ్యూటీ నుంచి విడుదలై విద్యా కళాశాలలో ప్రవేశించాను. (నాటి నుంచి 23 డిసెంబరు 1983) నా రెండవ దశ సర్వీసు మొదలయ్యింది. నేను యస్.సి. ప్రణాళికలో పని చేసిన 14 నెలల సర్వీసును కూడ నాకు కలిపారు. ఇంచుమించు 1 సంవత్సరం 9 నెలల సర్వీసు పోయింది. ఈ విధంగా ప్రభుత్వ రంగంలో కూడ “లంచగొండితనం” విశృంఖలంగా స్వైర విహారం చేస్తుంది. ‘బడిత ఉన్నోడితే బర్రె, నోరు ఉన్న వాడికే మోక్షం” అన్న సామెత ఋజువయ్యింది.

1985లో నాకు గెజిటెడ్ ప్రమోషన్ వచ్చింది. అప్పటినుంచి బాధ్యతాయుతమైన అన్ని పనులను డైరెక్టర్లు నాకు అప్పజెప్పడం మొదలయింది. అనేక రకాల పరీక్షా పత్రాలను తయారు చేయడం, జాతీయ స్థాయి కార్యక్రమ నిర్వహణ, కొత్త విద్యా ప్రణాళికను చేపట్టడం (1986) అనువాద కార్యక్రమాలు. విద్యా సంబంధమైన రాష్ట్ర స్థాయి పర్యవేక్షణలో, మధ్య మధ్య ఆకాశవాణి హైద్రాబాదు కార్యక్రమాలు, పుస్తక రచన, పుస్తకాలను సమీక్షించి గ్రంథాలయాలను సూచించడం, అవసరాన్ని బట్టి ఇతర శాఖలకు సహకారాన్ని అందించడం లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఒక డైరెక్టర్, 11 మంది ప్రొఫెసర్లు, 11 శాఖలు, 34 మంది ఉపన్యాసకులు, నాన్ టీచింగ్ స్టాఫు, ఆ కాలంలో S.C.E.R.T. స్వర్ణ యుగాన్ని తలపించేది. దినమంతా ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నమై ఉండేది. వీలునుబట్టి సాహిత్య కార్యక్రమాలకు, సమావేశాలకు, డైటు సంస్థల పర్యవేక్షణకు హాజరయ్యేది.

ఒకనాడు నిజామాబాదు ఉపాధ్యాయ శిక్షణా సంస్థ ఉపన్యాసకులు డాక్టర్. సూర్య ప్రకాశ్ రెడ్డి గారు రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థకు వచ్చారు. వారి చేతిలో ఏవో పేపర్లు ఉన్నాయి. రెడ్డీ! అని ఏమి పేపర్లని అడిగాను. పిహెచ్.డి. అప్లికేషన్ అని చెప్పారు. అవి నాకు ఇచ్చి నీవు వేరే తీసుకొమ్మని చెప్పాను. వారు మీరు అడగడం నేను ఇవ్వకపోవడమా? అని నాకు ఆ అప్లికేషను ఇచ్చి వెంటనే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లారు. నేను ఆ రాత్రి పిహెచ్.డి.కి కావలసిన అర్హత పత్రాలు, అప్లికేషన్ని నింపడం వంటి కార్యక్రమాలను పూర్తి చేసుకొని తెల్లవారి ఉస్మానియా విశ్వవిద్యాలయం, బోధనా కళాశాలకు వెళ్లి అప్లికేషన్ ఇచ్చి వచ్చాను. నా ప్రవేశం పిహెచ్.డి.లో ఖాయమయ్యింది. ఉపశీర్షికల పట్టిక తయారు చేసి ఇచ్చాను. ఇక గైడును నిర్ధారించుకోవడమే మిగిలింది. ముందుగా డాక్టర్ శ్రీధరస్వామి ప్రొఫెసర్ ను పెట్టుకోవాలనుకున్నాను. శ్రీధర స్వామి గారు నా భర్త కీ.శే. కనకయ్య గారికి ఆప్తమిత్రులు. వారి దగ్గర పిహెచ్.డి. అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో తెలియదు. కాని కనకయ్యా! నేను నీ ముఖం చూసి సరోజనకు గైడెన్సు ఇస్తున్నానని అన్నారు. నాకు ఆత్మాభిమానం ఎక్కువ. ఒక విధంగా రోషం కూడా ఎక్కువే! నేను చాలా బాధ పడ్డాను. నా భర్తతో సారూ! మీ ముఖం చూసి శ్రీధర స్వామి గారు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తున్నానని అన్నారు. వారు నా ప్రతిభను లెక్కించాలి కాని అదేమి మాట అని నొచ్చుకున్నాను. వారు ఆ మాటను గ్రహించారు. అయితే అక్కడే డాక్టర్ ఆర్. వెంకటేశ్వరరావని ఇంకొకరు ఉన్నారు. వారు కూడా నాకు ఆత్మీయులే. వారి దగ్గర పిహెచ్.డి. అభ్యర్థిగా చేరమన్నారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను.

నేను అంతకుముందే పాఠ్యపుస్తకాల్లో స్త్రీ హోదా, చిత్రణ, స్త్రీ సమానత్వం, సాధికారత, వివక్షత ఏ విధంగా ఉందో? ఎన్నో సదస్సులకు, సమావేశాలకు హాజరయ్యాను. కూలంకషంగా అధ్యయనం చేశాను. స్త్రీ విద్య, బాలికల విద్య గురించి ఆపోషం పట్టాను. ఒక నిర్ధారిత భావం నాకుంది. 1986 విద్యా ప్రణాళికలో ప్రత్యేకంగా ఒక అధ్యాయంలో ఉటంకించబడింది. మూల్యాంకన పత్రం కూడ ఇవ్వబడింది. ఇతిహాసం – పాఠ్యాంశం ఎంపిక, ప్రదర్శన, భాష, భావం, సామెతలు, జాతీయాలు, నానుడులు మొదలైన వాటి వివరణలు, వర్ణన, చిత్రీకరణ, ధనాత్మక, ఋణాత్మక భావాలు మొదలైన వాటి విస్తృత అధ్యయనం చేయడం జరిగింది. దానిలో స్వామికత్వం పొండం జరిగింది. చిత్రాలు, బొమ్మలను కూడ పరిశీలించడం, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, విద్య, వైద్యం, శాస్త్ర విజ్ఞానం, సృజనాత్మకత, సాంకేతిక, పశువైద్యం, కుటుంబం, పిల్లల పోషణ, శారీరక, మానసిక, బౌద్ధిక, మత సంబంధమైన అంశాలు, పాఠ్య పుస్తక రచన, సంపాదకత్వం, అన్నిట్లో కూడ స్త్రీల పాత్ర ఋణాత్మకమే. ఆడ మగ కూలి, ఆరోగ్యం, తిండి, పుట్టుక, వివాహం, విద్య, ఉద్యోగం, పోషణ అన్నిట్లో వివక్షతే. వీటన్నిటి సమూల అధ్యయనం వల్ల నాకు పిహెచ్.డి. సులభమైంది. క్రితంలో నేను రెండవ భాషగా తెలుగు బోధనాభ్యసన సమస్యలు, కారణాలు, నివారం ఉపాయాలు సమస్యగా తీసుకొని పిహెచ్.డి. చేయాలనుకున్నాను. కాని మనసు మార్చుకున్నాను.

ఒకరోజు మామిడి మల్లారెడ్డి శాఖాధిపతుల దగ్గరకు వెళ్లి, సార్! నా పిహెచ్.డి. పర్యవేక్షకులను నిర్ణయించండి. నా శీర్షికను గైడును మార్చుకోవడానికి నాకు అనుమతి నివ్వండి అని కోరాను. వారు డాక్టర్ ఆర్. వెంకటేశ్వరరావు గారి గదికి నన్ను తీసుకెళ్లి సరోజనకు పర్యవేక్షకులుగా వ్యవహరించమని కోరారు. వెంకటేశ్వరరావు గారు సార్ నాకు ఆ సమస్య చాలా కొత్త అని చెప్పారు. అప్పుడు మల్లారెడ్డి గారు ఏముందిలే సరోజన “నీకు అంతా చెప్పుతుంది” అన్నారు. తరువాత నేను వారికి సంక్షిప్తంగా అన్ని విషయాల గురించి చెప్పాను. వారు సుముఖత వ్యక్తపరిచారు. ఒక ముఖ్యమైన ఘట్టం ముగిసింది.

రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థకు సాధారణ సెలవు దినాలున్నప్పుడు, రెండవ శనివారం, ఆదివారం సెలవు దినాలల్లో అలకాపురిలోని వెంకటేశ్వరరావు గారి ఇంటికి నేను వెళ్లేదాన్ని, వారి సూచనలు, సలహాలు, గమనికలు తీసుకునేదాన్ని, ఉస్మానియా విశ్వవిద్యాలయం, గ్రంథాలయానికి వెళ్లి పరిశీలనా గ్రంథాలు తీసుకొని నోట్సు తయారు చేసుకోవడం, ప్రశ్నావళిని రూపొందించుకోవడం, ముఖాముఖి కోసం ప్రశ్నలు తయారు చేసుకోవడం, గవర్నర్ సదనానికి వెళ్లి సంబంధిత సాహిత్యాన్ని తీసుకోవడం, ఆకాశవాణి హైద్రాబాదు కేంద్రం కీ.శే. తరుగా జానకి రాణి దగ్గర నుంచి కీ.శే. మల్లాది సుబ్బమ్మ వరకు స్త్రీల సమస్యలపై పోరాడే వాళ్లను సంప్రదించి వివిధాంశాలను సేకరించేదాన్ని. అప్పట్లో మహిళా సాధికారత, చైతన్యం కోసం ఆకాశవాణి హైద్రాబాదులో అనేక వ్యాసాలను రాసి ప్రసారం చేసేదాన్ని. ఒకసారి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థలో గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను తీసి పరిశీలించాను. అందులో నుంచి దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆధ్వర్యంలో 1958లో వెలువడిన “National committee on Women Education” అనే పుస్తకం దొరికింది. వీటన్నిటితో నా పీహెచ్.డి. గ్రంథానికి పరిణతి లభించింది. మొత్తం 247 పాఠశాల పుస్తకాలను పరిశీలించాను. ధనాత్మక, ఋణాత్మక విషయాలను క్రోడీకరించాను. వివిధ రంగాలలో మహిళల స్థాయిని, హోదాను పరిగణలోకి తీసుకున్నాను. 14 మంది పాఠశాల విద్యకు సంబంధించిన అత్యున్నత స్థాయిలో ఉన్న ఆఫీసర్ల డైరెక్టర్ల ముఖాముఖి తీసుకొని విషయ వివరణ చేశాను. మూల్యాంకన విభాగానికి చెందిన మా ‘అధిపతి’ని సంప్రదించాను. మొత్తం మీద ఆర్. వెంకటేశ్వరరావు పర్యవేక్షకులుగా నా విహెచ్.డి. 1992లో ముగిసింది. అది ఫిబ్రవరి నెల. ఈ తతంగంలో నాకు అండగా నిలబడి ‘స్టాటిటిన్స్’ చేయించిన శ్రీధరస్వామి ప్రొఫెసర్ గారికి నా కృతజ్ఞతాభివందనాలు. ఎండనక, వాననక కష్టపడి ఒక నిజమైన విహెచ్.డి. చేసినందుకు విద్యాశాఖ నుంచి నాకు పొగడ్తలు అందాయి. ఏడవ తరగతి నుంచి ఒక పిహెచ్.డి. స్థాయికి ఎదిగినందుకు నేను నన్ను అభ్యుదయ పథంలో నడిపించిన ఆ “అజ్ఞాత శక్తి”కి ఎల్లవేళలా ఋణపడి ఉంటాను. ప్రొఫెసర్ మల్లారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, నా పర్యవేక్షకులు ఆర్.వెంకటేశ్వరరావు, శ్రీధరస్వామి, సాందీప్, అడుగడుగున నన్ను నడిపించారు. ప్రొఫెసర్ నాయుడు, రాధాకృష్ణ, రుక్మారావు, ఫరీదాభాతూన్, అన్వర్ జహాన్, బృందావనం, శ్రీరామమూర్తి, డా. సుబ్రహ్మణ్యం బోధనతో తరించిన ఆ రోజులు స్వర్ణయుగాన్ని తలపిస్తాయి. ప్రొఫెసర్ వేదాంతాచారి గారి బోధన నన్ను ముగ్దురాలిని చేసేది.

ప్రొఫెసర్ ఆర్.వెంకటేశ్వరరావు గారు నల్లగొండ జిల్లా జాజిరెడ్డి గూడెంలో జన్మించారు. తండ్రి రాఘవరావు, తల్లి లక్ష్మీదేవమ్మ. వారు ఎం.ఏ. తెలుగు. యం.ఇడి. విహెచ్.డి. చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం, విద్యా కళాశాలలో ఉపన్యాసకులుగా చేరారు. వారి జీవిత భాగస్వామి కీ.శే. సుజాతమ్మ, హైద్రాబాదులోని అలకాపురి వారి స్థిర నివాసం. వారి సంతానం ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్దవాడు కుమారుడు రాం మోహన్ రావు, కూతుళ్లు రాధ, రేఖ.

వద్దిరాజు సీతారామచంద్రరావు, వద్దిరాజు రాఘవ రంగారావు ఈ ఇద్దరు అన్నదమ్ములు వద్దిరాజు సోదరులుగా చరిత్ర ప్రసిద్ధి నందిన వారు. చిన్నవాడు వద్దిరాజు రాఘవ రంగారావు కూతురు రంగరాజు పద్మజ కవయిత్రి, రచయిత్రి. వారు అనేక ఉత్తమ రచనలు చేసిన యశఃకాములు. పద్మజ భర్త కీ.శే. రంగరాజు వెంకటేశ్వరరావు గారు, జనగామ నివాసి. ప్రసిద్ధ న్యాయవాది. రామమోహనరావు గారి అర్ధాంగి రంగరాజు పద్మజ కూతురు, పద్మజ ఆడపడుచు కీ.శే. రంగరాజు సుశీల ప్రముఖ రేడియో కళాకారిణి. వీరి కుటుంబ సభ్యులంతా విద్యాధురీణులు, విజ్ఞాన విభవులు, విశేష సాహితీ సంపన్నులు.

కీ.శే. పెండ్యాల రాఘవరావు స్వాతంత్య్ర సమరయోధులు. ఆ కాలంలో లబ్దప్రతిష్ఠులైన కమ్యూనిస్టు నాయకులు. ముచ్చటగా మూడు సార్లు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన ప్రజారంజకులుగా పేరు గాంచిన రాజకీయ నాయకుడు.

తమ ఊరు పెండ్యాల గ్రామాన్ని ఇంటి పేరుగా మలచుకొన్న జాతీయ నాయకుడు. వారి కుమార్తె డా.కొండపల్లి నీహారిణి. ప్రముఖ కవయిత్రి, మేటి రచయిత్రి, సాహిత్య విదుషీమణి, సారస్వత రంగంలో అందెవేసిన చేయి. వారి భర్త వేణుగోపాల్ గారు ప్రముఖ ఇంజనీరు. నీటిపారుదల శాఖలో ముఖ్య ఇంజనీరుగా పదవీ విరమణ చేశారు. నా సోదరుడు కీ.శే. బండ రామయ్య గారికి చిరపరిచితులు. డా. కొండపల్లి నీహారిణి తరుణి, మయూఖ లాంటి పత్రికలకు అధినేత్రి. (అవి ఆన్ లైను పత్రికలు).

రంగరాజు పద్మజ, అరుణ ధూళిపాల ఎంతోమంది లబ్దప్రతిష్టులైన వారి ముఖాముఖిని నిర్వహించి నెల్లుట్ల రమాదేవి ఆంధ్ర బ్యాంకు విశ్రాంత ప్రజాసంబంధాల శాఖతో పాటు కీర్తి ప్రతిష్టల నందారు. కొండపల్లి నీహారిణి వద్దిరాజు సోదరులపై విహెచ్.డి. చేసి కృతకృత్యులయ్యారు. వీరి కుటుంబంలోని వారందరు విద్యాగంధంతో విలసిల్లిన వారే. సాహితీ క్షేత్రం, సారస్వత రంగ పారంగతులే. ప్రజాసేవకులుగా పరిణతినందిన వారే. కొండపల్లి నీహారిణి మామగారు కీ.శే. కొండపల్లి శేషగిరి ఆవు గారు ప్రసిద్ధ చిత్రకారులు. వైవిధ్యభరితమైన బొమ్మలతో, ఎన్నో కులాల వారి సమ్మేళనంలో రూపుదిద్దుకున్న వారి కళాభిరతి, కళాభిమానం, తెలంగాణ తేజోకిరణాలుగా నలువైపులా ప్రసరించాయి. వారు పుణ్యజీవులు. ధన్యాత్ములు. కళామూర్తులు.

నా పిహెచ్.డి. పర్యవేక్షకులు డా.ఆర్. వెంకటేశ్వరరావు తమ్ముడు కీ.శే.ఆర్. విద్యాసాగర రావు గారు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారి వద్ద నీటిపారుదల శాఖ సలహాదారుగా పని చేశారు. రంగరాజు వెంకటేశ్వరరావు న్యాయవాది, మా అన్నయ్య కీ.శే. బండ శ్రీహరి న్యాయవాదికి జనగామలో ఆత్మీయ మిత్రుడిగా పేరెన్నిక గన్నవారు. ఈ విధంగా మేమంతా స్నేహ సంబంధ బాంధవ్య, ఆత్మీయులుగా కలిసి ఉండడానికి కారణభూతమయ్యాయి

నా భర్త కడారి కనకయ్య గారిక శ్రీధరస్వామి, వెంకటేశ్వరరావు గారు ఆత్మీయ మిత్రులు. కీ.శే. ప్రొఫెసర్ జయశంకర్ గారు, కీ.శే. డాక్టర్ వేణుమాధవ్ గారు బాల్యమిత్రులు. శిశు తరగతి నుంచి వారు ఒకే తరగతిలో చదువుకున్నారు. కోవెల సుప్రసన్నాచార్య, సంపత్కుమారాచార్య వారి సహబోధకులు. వీరి గ్రంథ సమీక్షలు చేయడం వల్ల అరుణ ధూళిపాల కూడ నాకు ఆత్మీయులైనారు. అరుణ ధూళిపాల మంచి భాషా నిష్ణాతులు, భాషా ప్రేమికులు, భాషా విన్యాసకులు.

కనకయ్య గారి స్నేహితుల కూటమి 22 మంది. సంతుల వారీగా వీరంతా విందు భోజనాలు ఆరగించేవారు. వారి కాలం, వారి స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు అనుబంధాలు కూడ మనం ముందు తరాలలో చూడలేము. వారు జీవించిన కాలం చరిత్రకో నిదర్శనం.

“వయసులో చిన్న అయినా జ్ఞానంలో మిన్న” అయిన డా. కొండపల్లి నీహారిణి, రంగరాజు పద్మజ, ధూళిపాళ అరుణ, నెల్లుట్ల రమాదేవి స్నేహ సాంగత్యాలు లభించినందుకు నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను.

Written by Banda Sarojana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదాయ కేదారాలు మన దేవాలయాలు

ఋగ్వేదపు స్త్రీస్వరం అపాలఆత్రేయ