ఎన్నికలు – స్త్రీల పాత్ర

( మే నెల తరుణి సంపాదకీయం)

రాజకీయాల  రణరంగం అనే మాట తరచూ వింటూ ఉంటాము.  ఎందుకంత ప్రాముఖ్యత? ఎందుకంటే మన ఓటు విలువ ఎంత గొప్పదో ఎన్నుకోబడి పరిపాలిస్తున్న నాయకులను చూస్తే తెలుస్తుంది. అందుకే మన ఓటును ఒక అస్త్రం సరిగ్గా సంధించాలి. స్త్రీలు సర్వశక్తిమంతులు. కాని  వాళ్లలోని శక్తిని వాళ్ళు గుర్తించుకోరు. పైగా నిజం ఏంటో అబద్ధం ఏంటో అస్సలే  ఆలోచించరు. సమాజంలో మన స్థానం ఏమిటి? సంఘం ఎలా ఉంది? అని అసలే పట్టించుకోరు. ఇందులో భాగంగానే చెప్పాల్సింది ఎన్నికల విషయం.  తాము వేసే ఓటు రాజకీయ నాయకుల జీవితాలను శాసిస్తుందని చాలామందికి తెలియదు. ఓటు అనేది కూడా  మన సామాజిక  బాధ్యత లలో  ఒక ప్రముఖమైన భాగం అని అస్సలు అంటే అసలే గుర్తించరు.

ఈ రోజుల్లో రాజకీయ నాయకులు గెలవాలని డబ్బు గుప్పిస్తున్నారు. వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న తాయిలాలకు ఆశపడుతున్నారు . వాళ్లిచ్చే  చీరలకు,  కుక్కర్లకూ,  డబ్బుల కూ  వెలకట్టలేని  ఓటును  ఇచ్చివేస్తూ  వాళ్ల కు అధికారాన్ని అప్పజెప్తున్నారు.  దీనివల్ల  5 సంవత్సరాల కాలం  వాళ్ల  చేతుల్లో మరబొమ్మలవుతున్నారు . దీనివల్ల ఏం కోల్పోతున్నారో కూడా అర్థం కావడం లేదు.

రాజకీయాలు అత్యంత విలువైనవి. దేశ ఆర్థిక, స్వాతంత్ర్య, సామాజిక విలువలను పరిరక్షించుకోవడానికి, మనదైన పార్లమెంటరీ విధానం ఏర్పరచుకున్న దేశం మనది. ఒక ఇంటికి కుటుంబ పెద్ద రక్షణ ఎలాగో, ఒక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు ఎలాగో, ఒక కళాశాలకు ఒక విశ్వవిద్యాలయానికి ప్రముఖులు ఎలాగో అట్లా దేశ పాలన విధానానికి ప్రధానమంత్రి అవసరం. ప్రధాని ఎవరు అని చర్చించుకోవడానికి ప్రజలు తప్పకుండా ముందుంటారు. అట్లాగే వాళ్ళ వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రులను నిర్ణయించుకోవడానికి కూడా ప్రజలు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తుంటారు.

    ప్రజలు తెలియని తనంతో ఉంటారనుకోవడం ఒక భ్రమ. వాళ్ళ పరిశీలన అనుభవం చాలా గొప్పది. దీనికి ఉదాహరణగా ఆనాటి స్వాతంత్ర్య పోరాటాలను కూడా తీసుకోవచ్చు. అప్పటినుంచి తెలుసు వాళ్ళకి రాజకీయాలు ఎలా ఉంటాయని! ఇవన్నీ అనుభవాలు నేర్పిన పాఠాలు! ప్రజలను, ప్రత్యేకంగా యువతరాన్ని ఎప్పుడు విస్మరించవద్దు. యువతరం భావి భారత పౌరులు, కాబోయే నేతలు . ఎందరో తెలివైన వారే ఉంటారు కాబట్టి యువత గొప్ప పరిశీలనతో ఓట్లు వేస్తారు. ఇవాళ ఓటును వినియోగించుకునేప్పుడు వాళ్ళకన్నా ముందు తరం పెద్దలను ప్రభుత్వాలు ఎలా చూస్తున్నాయి? రైతుల కోసం ఏ సహకారం అందిస్తోంది? బడుగు బలహీన వర్గాల కోసం ఏ ఏ పథకాలను వేసి ఎట్ల నిర్వహణ చేస్తుంది? స్త్రీ ఉన్నతికి గవర్నమెంట్ ఎలాంటి  రూపకల్పన లు చేస్తున్నది అనేవి యువకులు చూడరు అనుకోవడం కూడా ఒక పెద్ద భ్రమనే. ఇవన్నీ ఈరోజు ఎన్నికల ద్వారా బహిర్గతమయ్యాయి. ఎంత ఆధునిక సాంకేతిక శాస్త్రీయ విధానాలు వచ్చి యాంత్రిక జీవనాన్ని తీసుకువస్తున్నా కూడా యువత ఇవి ఏవి  బయట విషయాలు పట్టించుకోవడం లేదు అని అనుకోకూడదు.

  ప్రజలు కూడా అంతే .. వస్తున్న సాంకేతిక సౌకర్యాలనుండి చాలానే లబ్ది పొందుతున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫోన్ అనే ఒక మంత్రం… అరచేతిలో వైకుంఠం లాగా. ఈ సెల్ఫోన్ అనేది ఇక్కడ ఒక యంత్రం కాదు ఒక మంత్రం వచ్చినప్పటి నుండి ప్రజలు చాలా తెలివిగా అయ్యారు. ఇవన్నీ మనకు సాక్షులు. జరుగుతున్న ఇదే చెప్తోంది ఇప్పుడు .

    జాతి మత కుల వివక్షలను ఎన్ని తీసుకువచ్చినా అసలు సిసలైన మానవీయ కోణం అనేది కూడా ఒకటి ఉంటుంది అని ఎవరూ మరవకూడదు. పరాజయాన్ని పొందిన రాజకీయ నాయకులు బాధతో రకరకాల అభిప్రాయాలను వ్యక్త పరుస్తారు. అవన్నీ సత్యాలు కావు. అలా అని మొత్తం అసత్యాలు కావు. అలాగే విజయపథంలో దూసుకుపోతున్న రథసారథులు కూడా అంతే వాళ్ళ పార్టీ శ్రేణుల్లో ఎటువంటి ధైర్యాన్ని ఉసిగొల్పాలో అటువంటి మాటలను మాట్లాడడానికి ఏమాత్రం వెనుకాడరు. ఎక్కడైనా నిజాలు అబద్ధాలు రెండు బహు  పాత్రలు  వహిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా భారత దేశ రాజకీయ సామాజిక చరిత్రలో తప్పకుండా మార్పులను తీసుకువస్తాయి. ఈ మార్పుల ఫలితమే ఈరోజు ఎన్నికలు.

     ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి ఓడిపోవడానికి కారణం వాళ్ళ అసమర్థతనే!  ఎన్నికల ముందు ప్రచార హోరులో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే! ఇవన్నీ గమనించిన ప్రజలే కదా ఓట్లు వేసేది? అందుకే హామీలు ఇచ్చే ముందు శక్తి సామర్థ్యాలను ఒకటికి పది సార్లు చర్చించుకుని ఆలోచించుకుని గట్టి నిర్ణయం తీసుకొని బయటపెట్టాలి. అంతేకానీ గత పార్టీలు చేసిన దానికి మరికొంత జోడిస్తే మాకు గొప్పతనం వస్తుంది అని చెప్పి ఆ మాటలను తీర్చలేకపోతే మరోసారి వచ్చే ఎన్నికల్లో పర్యవసానం ఇలాగే ఉంటుంది. ఇది ఏ పార్టీ వాళ్ళకైనా… ఇప్పుడు గెలిచిన వాళ్లకైనా… భవిష్యత్తు అంతే! ఇదే సత్యం !! పారదర్శకత ఉండాలి పరిపాలనలో…. పట్టుదలతో సాధించాలి… ప్రజలకు చేరువగా ఉండాలి. ఇవి మూడు  ముఖ్యమైన విషయాలు. ప్రజలు కొత్త రాజకీయవేత్తలను కోరుకుంటున్నారు అని స్పష్టమైనది ఈసారి .

      ప్రసార మాధ్యమాలు ఎక్కువైన ఈ నేపథ్యంలో వెంట వెంట సమాచారాలను అందిస్తున్న ఈ పరిస్థితుల్లో పదేళ్ల పిల్లవాడికి కూడా రాజకీయాలు అర్థమవుతున్నవి. అయితే మంచి లేదా? రాజకీయ నాయకులందరూ చెడుబుద్ధి తోనే ఉన్నారా? లేదు లేదు.. కులమత రాజకీయాలను సృష్టించి బలపరిచి భయంకర రూపం దాల్చేలా చేసి ఈ రాజకీయాలు ఏ మార్గాలను అనుసరిస్తున్నాయో అర్థం కావడం లేదు దేశం ఎటు పోతుందో అని వేద చెందుతున్నారు పాతతరం వాళ్ళు.

జెన్ జీ  తరం ఆవేశపూరిత రాజకీయాలను ప్రేరేపిస్తూ ఆన్లైన్ లో అరాచకాలను సృష్టిస్తున్న ఈ వైనం నిజమైన  దేశభక్తులకు హృదయ వేదనం కలిగిస్తున్నది.

విచిత్రం ఏంటంటే ప్రపంచంలోని అన్ని దేశాలు ఆయా దేశాల బాగు కోసం పాటుపడుతున్నారు. ఎక్కడో ఒకచోట వ్యతిరేకులు ఉంటారు. వాళ్ల ను అధిగమిస్తూ ముందుకు పోతున్నారు. కానీ,మనదేశంలో ఈ పరిస్థితులు లేవు .వీటికి భిన్నంగా ఉన్నాయి.  దేశం పురోభివృద్ధిని  సాధించటం మాట అటు ఉంచి ఉన్న తీరున ఉంటు సుభిక్షంగ ఉండడమే కావాలి. 

యువతరం  రాజకీయాల లో  చురుకుగా పాల్గొనాలంటే  ప్రపంచ  రాజకీయాల పై అవగాహన ఉండాలి.  చరిత్ర ను చదవాలి.  సర్వమత సౌభ్రాతృత్వ భావనలు అర్థం కావాలి  దీనికి  మనదేశ పు  పూర్వ  రాజకీయాల పట్ల అవగాహన అవసరం. ఆ రీతిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది.  మన కళ్ళతో ప్రపంచాన్ని చూడాలి ప్రపంచం కళ్ళతో మన దేశాన్ని చూడాలి అప్పుడే యువతరం దేశ రాజకీయాలపై బట్టలు ఇస్తుంది ఈ భవిష్యత్తులో రాజకీయ నాయకులుగా ఎదిగే శక్తిగా తయారవుతారు.

    ఎలక్షన్ విధి విధానాలు తెలుసుకొని కళాశాల చదువుల నుండి విశ్వవిద్యాలయాల వరకూ,  పౌరుల హక్కుల పైనే కాదు బాధ్యత ఎంత అనేదీ తెలియాలి.  పార్లమెంట్,  లోక్ సభ సభ్యులకు ఉన్న  విధులేమిటో ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకోవాలి.  పొలిటికల్ పార్టీల ఆవిర్భావాలు ఆచరణలు సంపూర్ణంగా తెలుసుకొని ఉండాలి. అప్పుడే కలలు కన్నా సాధించుకోగలరు సాధించుకోవాలన్న తపనతో కలలను కలగలరు , కలలను తీర్చుకొనగలరు.  ఎన్నికలు యవతను ఎన్నికలలో  కనమంటూ అంటుంటే వ్యక్తిత్వ వికాసానికి సమిష్టి  వికాసాని కి వారధులుగా యంగర్ జనరేషన్  ఉండాలి. 

 అందుకే స్త్రీ లు  బాగా చదువుకోవాలి.  ఎక్కడ ఏ విధంగా సమాజం స్త్రీలను అన్యాయాలకు గురి చేస్తున్నదో అవమాన పరుస్తున్నదో తెలుసుకోవాలి ఎంతసేపు వాళ్ల పరిధిలోకి స్త్రీల జీవితాలను లాగేసుకునే ఈ పురుషాధిక్య ప్రపంచానికి పాఠాలు నేర్పాలి రాజకీయంగా చైతన్యవంతంగా లేకపోవడం వల్లనే ఇవన్నీ చేయడం సాధ్యం కావడం లేదు కాబట్టి చదువుకోవాలి. ప్రపంచ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. ఏ ఏ సంఘటనలలో సందర్భాలలో ఆడవాళ్ళను ఎలా  ఉపయోగించుకుంటున్నారో తెలుసుకోవాలి. తగిన విధంగా బుద్ధి చెప్పాలి. వీటన్నింటికీ స్త్రీలకు రాజకీయ పరిజ్ఞానం ఉండాలి .అంటే పత్రికలు బాగా చదవాలి ప్రతినిత్యం ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి ముఖ్యంగా రాజకీయాల్లో నిలబడడానికి కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలి ఆ తర్వాత పోటీ చేయాలి ఒకసారి ఓడిన దిగులు పడకూడదు మళ్లీ మళ్లీ నిలబడి గెలిచే ప్రయ త్నం చేయాలి గెలిచే ప్రయత్నం చేయడం అంటే ఏదో ఎవరికో డబ్బు ఆశ చూపించడం కాదు ప్రజలతో మమేకమై ఉండటము సామాజిక అవసరాలను గుర్తించి తగిన సేవ చేయడము ఇటువంటివి చేస్తే కానీ రాజకీయంలో నిలబడగలుగుతారు. మహిళలు ఎప్పుడైతే రాజ్యపాలనా అధికారంలో మహిళలకు తగిన స్థానం ఉంటుందో ఇప్పుడే మహిళల జాగృతి కోసం ప్రయత్నం చేయగలుగుతారు.

    ఎన్నికలు మహిళలు అనే విషయంపై ఆడపిల్లలకు బడులలో వ్యాసరచన పోటీలు ఉపన్యాస పోటీలు నిర్వహించాలి . అమ్మాయిలను రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేసేలా ఉత్తేజపరచాలి. రాజకీయాధికారం చేపట్టడానికి కావలసిన తెలివిని , జ్ఞానాన్ని ఆడపిల్లలు నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా ఒక క్రమశిక్షణ యుతమైన జీవితంతో మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరికో లొంగుబాటు గురయ్యాము అంటే మన జీవితం కోల్పోయినట్టే ! అంత అవసరం లేదు. నిజాయితీగా నీతిగా ఉంటూ ఇవన్నీ ఎన్నో సాధించవచ్చు. ఒక ఇందిరా గాంధీ, ఒక సిరిమావో బండారు నాయకే , ఒక మార్గరేట్ థాచర్ మనకు ఉదాహరణగా నిలిచి ఉన్నారు. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎన్నింటినో ఆనందాలను కోల్పోయి కేవలం రాజకీయ చైతన్యం తోటీ బ్రతికారు. కాబట్టే పెద్దయ్యాక రాజకీయాలలో నిలదొక్కుకోగలిగారు. కేవలం తండ్రి ప్రైమ్ మినిస్టర్ అవుతేనో, ఇంటి వాళ్ళు ఎవరో రాజకీయాలలో ఉంటేనే ఇప్పుడు పాలిటిక్స్ లోకి వస్తారనుకోవడం పొరపాటు . కాబట్టి అవన్నీ నేర్చుకొని, ఆ ధ్యాసలోనే ఉన్నప్పుడు వాటి కోసం ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే సాధించగలుగుతారు. భవిష్యత్తులో రాజకీయాలలోకి మహిళలు వస్తారు అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలి.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చెరుకుతుద వెన్ను పుట్టిన

హరిచందన -13 వ భాగం