చేను మేసిన కంచె

“కంటేనే అమ్మ అని అంటే ఎలా ? కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా”

ఎంతో మందిని, ఎన్నో హృదయాలను కదిలించిన ఈ పాట మనలో చాలామందికి తెలిసినదే.గతకొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే, ఈ పాట చాలా మందికి గుర్తురాక మానదు. కడుపుతీపి సంగతి దేవుడెరుగు, పిల్లల పాలిట క్రూర మృగాలుగా మారుతున్నారు. ఉచ్ఛం, నీచం మరిచి ఉన్మాదులుగా తయారవుతున్నారు. రాతిబొమ్మ ఏం చేస్తుందండి పాపం? మౌనంగా మన వైపే చూస్తూ ఉంటుందేతప్ప ఇసుక రేణువంత హాని కూడా ఎవ్వరికీ తలపెట్టదు. చీమ చి టుక్కుమన్నా, సింహం గర్జించినా నిర్లిప్తంగా ఉంటుందేతప్ప ఏ విధమైన తేడా కనబరచదు.

కానీ నవమాసాలు మోసి, పెంచిన మమతానుబంధాలే
పిల్లల పాలిట యమపాశాల వుతున్నాయి. జోలపాడి నిద్రబు చ్చిన ఆప్యాయతానురాగాలే మరణ మృదంగాలవుతున్నాయి.

శైశవం లో బిడ్డ తల్లి గుండెలో ఒదిగిపోయి, ఆ గుండె చప్పుడు వింటూ, తానొక భద్రతా వలయంలో ఉన్నాననే భరోసాతో హాయిగా నిద్రిస్తూ ఉంటుంది. కానీ ఆ గుండె చప్పుడే మున్ముందు తన పాలిట మృత్యు ఘంటిక అవుతుందనే (కేవలం ఇటువంటి వ్యక్తులను గురించి మాత్రమే అంటున్నాను) విషయం ఆ చిన్ని గుండె పసిగట్టలేకపోతోంది.

వివాహేతర సంబంధాలు ఒకచోట, తీవ్రమైన మానసిక వ్యాధులు మరోచోట, కారణాలేవైనప్పటికీ బాల్యానికి రక్షణ కరువవౌతుందనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

వివాహేతర సంబంధం కారణంగా దారుణమైన శారీరక హింసకు గురై పెద్ద దుమారం రేగిన ఇద్దరు చిన్నారుల విషయం మరుగున పడకముందే, ముగ్గురు బిడ్డల్ని పొట్టన బెట్టుకున్న కసాయి మృగాన్ని చూడాల్సిన దౌర్భాగ్యం. ఈడు, జోడు కుదరలేదనో, విందులు, విలాసాలు లోపించాయనో, మరింకేమైనా కారణాలో తెలియదుగానీ వైవాహిక జీవితంలోని అసంతృప్తి,అది ఇంకెక్కడో భర్తీ అవుతుందనే నీచపుటాలోచన ఎక్కడికి దారితీసిందో మనందరికీ తెలిసిందే.

ఇక్కడ మనం జీవవైవిద్యం అనే విషయం వైపు ఒకడుగు వేసి చూస్తే గనుక పశుపక్ష్యాదులు, క్రూర మృగాలు కూడా మాతృప్రేమకు అతీతం కాదనే విషయాన్ని మనం గమనిస్తాం. ఒక ఆడపులి గర్భం ధరించి ఉన్నప్పుడే, ప్రసవానికి అనువైన స్థానాన్ని ఎంచుకోవడంలో అత్యంత జాగరూ కతతో వ్యవహరిస్తుంది. కొన్ని కిలోమీటర్ల పరిధిలో స్వయం పర్యవేక్షణలో ఆ స్థానాన్ని ఎంపిక చేసుకుంటుంది. మరే మృగం రావడానికి వీలులేని ఒక రహస్య స్థావరాన్ని ఎంచుకుంటుంది. పులికూనలను వదిలి వేటకు వెళ్ళినప్పుడు కూడా, అవి ఉన్న చోటు నుండి కొంత దూరం మాత్రమే వెళుతుంది. ఎక్కువ దూరం వెళితే మరే మృగమైనా వచ్చి తన పిల్లలను మింగేస్తుందేమోననే భయం.

కోకిల తన గుడ్లను కాకి గూట్లో పెట్టడం, ఆ విషయం తెలియని కాకి వాటిని కూడా పొదిగి పిల్లల్ని చేయడం, వాటి కూత విన్న తర్వాత అవి తన పిల్లలు కావని తెలుసుకున్నాక కూడా వాటిని తన గూట్లో నుండి తరిమేస్తుందే తప్ప, వాటిని చంపదు. సృష్టిలో ఇన్ని జీవుల్లోలేని కాఠిన్యం, కర్కశత్వం మనిషిలో ఎందుకు (నేను అందరినీ అనడం లేదు) రగులుతుందో అర్థం కావడం లేదు.

ఇటువంటి సంఘటనలకు మానసిక వ్యాధులు కారణమైన చోట ఆలోచిస్తే గనుక ఇక్కడ మనకు మనుషుల నైజం పెద్ద కారణంగా కనిపిస్తుంది. ఎందుకంటే మానసిక వ్యాధికి గురై, అది ప్రాణాలు తీసేంత దూరం వెళ్లిందంటే, అది ఒక రోజో, రెండు రోజుల్లోనో జరిగే విషయం కాదు. ఒక వ్యక్తి మానసిక వ్యాధికి గురవుతున్నాడు అంటే, ఆ విషయం ఆ కుటుంబంలోని వారికి (వారెంత నిరక్షరాస్యులైనప్పటికీ, ఆ జబ్బుకు సంబంధించిన అవగాహన ఏమాత్రం లేకపోయినప్పటికీ) తెలియకపోవడం అనేది ఉండదు. ప్రారంభ దశలో ఉన్నప్పుడే, వారి ప్రవర్తనలో ఎన్నో తేడాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ విషయం అర్థమైనప్పటికీ కూడా దాన్ని ఒప్పుకోవడానికి చాలామంది సమ్మతించరు. ఇరుగుపొరుగువారు వారి క్షేమాన్ని కాంక్షించి ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకువస్తే గనుక, ఇక ఆ క్షణం నుండే వారిని శత్రువుల మాదిరిగా చూడటం, వారు కనిపించగానే
దభేలుమంటూ తలుపులు మూయడం వంటి పనులు చేస్తూ ఉంటారు. మానసిక వ్యాధి అనే విషయాన్ని అనుమతించని వారి ప లాయన వాదానికి ఇది నిదర్శనం. శరీరంలోని అన్ని అవయవాల మాదిరిగానే మెదడు కూడా ఒకటి. ఏ అవయవానికైనా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వ్యాధి మనిషిని పట్టిపీడిస్తూ ఉంటుంది. దానికి నిస్సంకోచంగా వైద్యం చేయించుకునే మానవుడు మెదడు విషయం వచ్చేసరికి చికిత్స తీసుకోవడానికి ససేమిరా అంగీకరించడు. దాని పర్యవసానమే ఈ దారుణాలు. ఇప్పుడిప్పుడే దీనిపై అవగాహన కలిగించే ప్రయత్నాలను మేధావులు ఒక సవాలుగా స్వీకరించడం ముదావహం.

క్షీణించిన నైతిక విలువలు మరో కారణమనే విషయం మనం ముందే చర్చించుకున్నాం గనుక, మొగ్గ దశ నుండే వాటిని బోధించగలిగితే, రేపటి తరంలోనైనా సుహృద్భావ వాతావరణాన్ని మనం చూడగలుగుతాం.

సర్వేజనా సుఖినోభవంతు
లోకాసమస్తా సుఖినోభవంతు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని – 68 వ భాగం

ఇంకెప్పుడు….