సాగర్ చెప్పిన విషయం విని సౌదామని సంతోష పడింది. మనసులో నుండి పెద్ద భారం దిగిపోయినట్టుగా అనిపించింది.
” పాపం సుధీర్ అన్నయ్య, అలేఖ్య వదిన ఇన్ని రోజులు ఎంతగానో బాధపడ్డారు. సాగర్ వెళ్లడం మంచిదే జరిగింది” అనుకుంది.
సాగర్ ఒకరోజు సౌదామినికి ఫోన్ చేసి తాను వారికున్న వ్యవసాయ క్షేత్రంలో ఆర్గానిక్ పంటలు పండించాలని ఉందని చెప్పాడు.
” సౌదామిని! నాకు మన పొలంలో సేంద్రియ పంటలు పండించాలని ఉంది. ఒకప్పుడు ఇలాంటి సేద్యమే చేసే వాళ్ళు. విదేశీ పద్ధతులు ఆవలంబించి ఎరువులు, పురుగు మందులు వాడి మన పంటలను మనమే విషతుల్యం చేసుకుంటున్నాము. నేను వ్యవసాయం చేయడమే కాకుండా చుట్టుపక్కల రైతులకు కూడా అవగాహన కల్పించాలని అనుకుంటున్నాను .నేను ఇంత పెద్ద ఉద్యోగం వదులుకొని వ్యవసాయం చేయాలంటే నీకు ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పు. మరో మార్గం ఏదైనా ఆలోచిస్తాను” అన్నాడు సాగర్.
” నాకలా ఏం లేదు సాగర్! నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది. తప్పేముంది వ్యవసాయం చేసుకుంటే? ఉద్యోగం చేస్తే మాత్రం వ్యవసాయం చేయకూడదా!” అన్నది సౌదామిని.
” నీకు ఇష్టం ఉంటుందో? లేదో? అని భయపడ్డాను. అయితే ఈ దిశగా ఆలోచిస్తాను” అన్నాడు సాగర్…
” నిజమే సాగర్ ఈమధ్య ప్రకృతి సిద్ధంగా కాసే చింత చెట్టును సైతం ఆర్గానికేనా అని అడుగుతున్నారు. ఒకప్పుడు ఇంటి వెనకాల బోలెడు కాయగూరలు కాసేవి. ఆకుకూరలు ఒక్క క్షణంలో కోసుకొచ్చి వంట చేసే వాళ్ళు. కానీ ఇప్పుడు వాటికి ప్రత్యేకమైన పేరు ఆర్గానిక్ అని. అభివృద్ధి పేరిట మనం ఎటు పోతున్నాము అర్థం కావడం లేదు.
ఒకప్పుడు రాగులు, సజ్జలు ,మొక్కజొన్నలు, జొన్నలు, ఆహార పదార్థాలలో ఉండేవి. ఆ తర్వాత తీరు మారిపోయింది. పాలిష్ పెట్టిన బియ్యం తినడము, క్రమంగా తృణధాన్యాలను విస్మరించాము. మన నుండి విదేశీయులకు వెళ్లిన ఇదే తృణధాన్యాలు మనకి వాటికి రంగులు, హంగులు అద్ది కార్న్ ఫ్లేక్స్ అని రాగి మాల్ట్ అని మన దగ్గరకు వస్తున్నాయి. వాటిని పదింతల రేటు పెట్టి కొంటున్నాము. ఇప్పుడిప్పుడే కొంత అవగాహన వచ్చి, మళ్లీ తృణధాన్యాల వైపు జనాల దృష్టి మళ్లింది. నీఆలోచన బాగానే ఉంది సాగర్” అని చెప్పింది .
“సౌదామిని! నీకు మన ఇంట్లో సౌకర్యంగానే ఉందా? ఏమీ ఇబ్బంది లేదు కదా”అని అడిగాడు.
” చ! చ అదేం మాట సాగర్! అత్తయ్య, మామయ్య ఎంత మంచి వాళ్ళో నీకు తెలియదా?అలాంటి ప్రశ్న నువ్వు అడగవచ్చా? నాకు మా అమ్మ, నాన్న దగ్గర ఉన్నంత ఆత్మీయతగా ఉంది. నన్ను ఎంతో బాగా చూసుకుంటారు. నీకు తెలుసా సాగర్ మొన్న మామయ్య వంట చేసి పెట్టారు. ఎన్ని ఐటమ్స్ చేశారని! చాలా బాగున్నాయి నువ్వైతే మిస్ అయిపోయావు” అన్నది.
” అవునా? నాన్న వంట చేయడమా? ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. అమ్మ చేయడమే చాలా తక్కువ. అమెరికా వెళ్లి వచ్చాక ఎక్కువగా వంట చేస్తుంది. నాన్న చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కోడలి కోసం చేశారేమో” అన్నాడు నవ్వుతూ.
” ఏమో ఎందుకు చేసారో తెలియదు. కానీ వంట మాత్రం అద్భుతంగా చేశారు” అన్నది .
ఎన్నో విషయాలు మీద మాట్లాడుకున్నారు.
సౌదామిని తను పడుకుంటానని చెప్పింది.సాగర్ కూడా ఆఫీస్ కి వెళ్లాలని చెప్పి ఫోన్ పెట్టేసాడు.
తెల్లవారి నిద్ర లేచి బయటకు వచ్చిన సౌదామినికి ఆమె తల్లిదండ్రులు అప్పటికే వచ్చి హాల్లో కూర్చోవడం చూసింది.
సౌదామినికి పట్టరాని సంతోషం కలిగింది. పరిగెత్తుకొని వెళ్లి తల్లి తండ్రిని హత్తుకుంది.
రవీంద్ర, విజయమ్మ కూడా కూతుర్ని చూసి సంతోషపడ్డారు.
లోపలి నుండి వచ్చిన నీలాంబరి వారిని చూసి,
“మీ అమ్మాయి గురించి బెంగ పెట్టుకున్నారా” ? అని అడిగింది.
” బెంగ ఏమీ లేదండి! అమ్మవారి లాంటి మీ చెంతనుంటే మాకు ఎందుకు బెంగ! ఇన్ని రోజులు అమ్మాయిని చూడకుండా ఉండలేదు” అన్నది విజయమ్మ.
” కూర్చోండి మహేశ్వరి చాయ్ తీసుకొస్తుంది” అని చెప్పి తను ఒక కుర్చీలో కూర్చుంది.
” నేను స్నానం చేసి వస్తానమ్మా! మీరు చాయ్ తాగండి. అందరం కలిసి బాలసదనం వెళ్దాము. మీరు చూడలేదు కదా!” అన్నది సౌదామిని.
” అవును అందరమూ టిఫిన్ చేసిన తర్వాత బాలసదనంకు వెళ్లి వద్దాం” అన్నది నీలాంబరి.
అందరూ చాయ్ తాగుతూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు.
* * *
అందరూ మహేశ్వరి చేసి పెట్టిన దోసెలు తిని, బాలసదనంకు బయలుదేరారు. అక్కడి వాతావరణం చూసిన రవీంద్ర విజయమ్మలకు ఎంతో నచ్చింది. ఇంత మంచి భావాలు కలిగిన ఇంటికి తన కూతుర్ని కోడలిగా పంపిస్తున్నందుకు ఎంతో సంతోష పడిపోయారు. తొందరపడి మేనరికానికి ఇద్దామని అనుకున్న రవీంద్ర పశ్చాత్తాప పడ్డాడు.
సౌదామినీ ఉత్సాహంగా బాలసదనం అంతా చూపించింది తల్లి తండ్రికి. నీలాంబరికి కూడా వాళ్లు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది.
” సౌదామినీ! అందరికీ లంచ్ ఏర్పాటు ఇక్కడే చూడు. వంటింట్లోకి వెళ్లి ఈరోజు ఏం ఐటమ్స్ చేస్తున్నారో ఒకసారి కనుక్కో. అమ్మా,నాన్న ఏం తింటారో అది చేయించు” అని చెప్పింది నీలాంబరి.
అది విన్న రవీంద్ర..
” అలా స్పెషల్ గా ఏంవద్దండీ. ఇక్కడ రోజు ఏం చేస్తారో అదే మనం భోజనం చేద్దాం. పిల్లలు, ఇక్కడి స్టాఫ్ తినే భోజనం మనం చేద్దాము. ఎందుకు మనము స్పెషల్ భోజనం చేయాలి” అన్నాడు.
ఆ మాటతో సంతోషించిన నీలాంబరి “అలాగే రోజు చేసిన భోజనమే మనం కూడా తిందాం” అన్నది.
అక్కడ ఉన్న పిల్లలందరితో ముచ్చటించారు. ముద్దు ముద్దు పాపలతో బాలసదనమంతా విరిసిన పూల తోటలా ఉంది.
భోజనం అయిన తర్వాత నీలాంబరి, విజయమ్మ , రవీంద్ర ఇంటికి బయలుదేరారు. సౌదామిని సాయంత్రం వస్తానని చెప్పింది.
గడికి వచ్చిన వీళ్లంతా కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. పనిమీద నగరానికి వెళ్ళిన భూపతి, సాయంత్రం ఇంటికి వచ్చారు. సౌదామిని తల్లిదండ్రులను చూసి సంతోషపడి వాళ్ళను పలకరించాడు.
సాయంకాలం నలుగురు కలిసి కచేరీలో కూర్చున్నారు. చాయ్ తాగుతూ మహేశ్వరి చేసిన పాలకూర పకోడీ తింటూ, ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు.
” భూపతి గారు! మేము పిల్లల పెళ్లి విషయం మాట్లాడటానికి వచ్చాము” అన్నాడు రవీంద్ర.
” మేము కూడా అదే ఆలోచిస్తున్నాము. ఇంకా ఆలస్యం చేస్తే బాగుండదు. అందుకని సాగర్ కి కూడా చెప్పాము .ఒకవేళ అక్కడి పనులు కాకుంటే పెళ్లి అయిన తర్వాత మళ్ళీ వెళ్ళమని” అన్నాడు భూపతి.
“అవునండి! పిల్లల పెళ్లి చేయాలని మాకు కూడా తొందరగా ఉంది. కానీ! పెళ్లి కాగానే ఇద్దరు చెరొకచోట ఉంటే బాగుండదని నాకనిపిస్తుంది. సాగర్ , సౌదామిని కూడా అదే మాట అన్నారు. పనులన్నీ పూర్తి చేసుకొని వస్తే ఇద్దరూ కలిసి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవచ్చని అంటున్నారు” అన్నది నీలాంబరి.
” మీరన్న మాట కూడా నిజమే. పెళ్లి జరిగిన తర్వాత చెరొకచోట ఉండడము వారిని ఇబ్బంది పెట్టడమే” అన్నది విజయమ్మ.
వీళ్లు మాట్లాడుతున్న సమయంలోనే సాగర్ ఫోన్ చేశాడు.
” అమ్మా! ఎలా ఉన్నావు! నాన్నగారు సౌదామిని బాగున్నారా”? అని అడిగాడు.
” బాగున్నాము సాగర్! సౌదామిని తల్లి ,తండ్రి పొద్దున వచ్చారు” అని చెప్పింది నీలాంబరి.
” అలాగా సౌదామినినీ చూడడానికి వచ్చారా” అన్నాడు సాగర్.
” మీపెళ్లి విషయం కూడా మాట్లాడటానికి వచ్చారు. నీ పనులు ఎంతవరకు వచ్చాయి దాన్నిబట్టి మేము నిర్ణయం తీసుకుంటాము. ఇంకా ఆలస్యం చేస్తే బాగుండదురా” అన్నది నీలాంబరి.
” ఈ మాట చెప్పడానికే ఫోన్ చేశానమ్మ నేను .ఇక్కడ పనులన్నీ పూర్తి చేసుకున్నాను. ఇక్కడ కంపెనీలో కూడా రిజైన్ చేశాను. అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది అందరం కూర్చుని ఆలోచిద్దాం. మరొక నెలలో నేను వచ్చేస్తాను” అని చెప్పాడు.
చాలా సంతోష పడ్డది నీలాంబరి. ఆమాటే అందరికీ చెప్పింది .అందరూ సంతోషించారు త్వరలో మంచి రోజులు వస్తాయని అనుకున్నారు.
అప్పుడే సౌదామిని వచ్చింది. వీరితో పాటే అక్కడే కూర్చొని చాయ్ తాగి వారు చెప్పిన విషయం అంతా విన్నది.
” మేమే వద్దనుకున్నామమ్మా. సాగర్ ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఏం చేయాలనుకున్నాడో అది ఆలోచించి, అప్పుడు పెళ్లి చేసుకుంటే మాకు ఏ టెన్షన్ ఉండదు” అని చెప్పింది సౌదామినీ.
మరో రెండు రోజులు ఇక్కడే ఉండి సౌదామిని తల్లిదండ్రులు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు.
ఈమధ్యకాలంలో కలెక్టర్ నీలాంబరి పెయింటింగ్స్ ఎగ్జిబిషన్లో పెట్టించారు ఆమె పెయింటింగ్స్ కి ఇక్కడ కూడా విపరీతమైన ఆదరణ లభించింది. ఆమె చిత్రించే బొమ్మలు ఆమె అంతరంగాన్ని చెప్పకనే చెప్తాయి. ఎక్కువగా సమాజం గురించి ఆలోచించే నీలాంబరి, అలాంటి చిత్రాలను ఎంచుకొని చిత్రిస్తుంది.
పెద్ద ఎత్తున ఆమెకు సన్మానం చేశారు. ఆ ఏరియాకు సంబంధించిన రాజకీయ నాయకులు కొందరు వచ్చారు. ఆమె బాలసదనం గురించి చేస్తున్న సేవలను గుర్తించి గవర్నమెంట్ నుండి ఫండ్ ఆమెకు ఇప్పించారు.
ఆమెకు ” సమాజ హిత” అని బిరుదు ప్రదానం చేసి సత్కరించారు.
నీలాంబరి, భూపతి ఎంతో సంతోషపడ్డారు. ఒక్కటే కొరత కూతురు, అల్లుడు, కొడుకు లేకుండా ఈ కార్యక్రమం జరిగిందని కొంచెం బాధపడ్డారు.
సౌదామిని సంతోషానికి పట్టపగ్గాలు లేవు. సౌదామిని తల్లిదండ్రులు మరియు అలేఖ్య అత్తమామలు అందరూ కూడా ఫంక్షన్ కి హాజరయ్యారు.
గోపాలపురంలో ఫంక్షన్ జరగడం వల్ల చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ఎంతోమంది వచ్చారు. ఆనోటా ఈ నోటా నీలాంబరి చేసే సేవలు అందరికీ తెలిసిపోయాయి.
అనుకున్నట్లుగానే నెల లోపల సాగర్ ఇండియాకి వచ్చాడు.
సౌదామినికి ఎంతో సంతోషంగా ఉంది.”ఎంత కష్టమైనా ఇద్దరం కలిసి ఉంటే అది తేలికగానే ఉంటుంది .కానీ దూరంగా ఉండటం చాలా బాధాకరం”అని అనుకున్నారు.
నీలాంబరి ,భూపతి కొడుకు శాశ్వతంగా ఇండియాలో ఉండడానికి నిర్ణయం తీసుకున్నందుకు ఎంతో ఆనందపడ్డారు.
కాసేపు మనసు విప్పి మాట్లాడుకోవడానికి సౌదామిని, సాగర్ ఇద్దరూ కలిసి ఊరికి దూరంగా లాంగ్ డ్రైవ్ చేస్తూ వెళ్లిపోయారు.
* * *
అప్పటికే సాయంత్రం కావచ్చింది .ఆకాశం కూడా కొంచెం మేఘావృతం అయింది.
వీళ్ళు బయలుదేరుతుంటే నీలాంబరి వచ్చి,
“తొందరగా రండి వర్షం పడే లాగా ఉంది” అని చెప్పింది.
” సరే అమ్మా! ఎక్కువ దూరం వెళ్లములే. నువ్వు కంగారు పడకు” అని చెప్పి బయలుదేరారు.
వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చల్లని గాలులు వీస్తున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురిసినందున పరిసరాలన్నీ హరితవనంలా కనిపిస్తున్నాయి. అలా ప్రకృతిని చూసి పరవశిస్తూ ఇద్దరూ మాట్లాడుకుంటూ కారులో ప్రయాణం చేస్తున్నారు.
అలా కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక చక్కని కొండ కనిపించింది. దాని పైకి వెళ్లాలని ఇద్దరు అనుకున్నారు. ఒకరి చేయి ఒకరు పట్టుకొని పైకి వెళ్లారు. అక్కడ ఒక చిన్న గుడి కూడా ఉంది .అది ఆంజనేయస్వామి నెలవైన మందిరము. దేవుడి దర్శనం చేసుకుని మెల్లగా కొండ దిగారు. అంతలోనే సన్నని చినుకులు ఆరంభమయ్యాయి. వయసులో ఉన్న జంటలకు ఆ చినుకులు పెద్ద ఇబ్బంది కావు కదా! అలా ఒకరి చేయి ఒకరు పట్టుకొని మెల్లగా కిందికి దిగి, కారు దగ్గరికి వచ్చారు.ఇంతలో వర్షం చాలా ఎక్కువగా పడసాగింది.
కారు ఎక్కి ఇంటి దారి పట్టారు. రాను రాను వర్షం చాలా పెద్దదయింది. మొత్తం చీకటి కమ్మేసింది. చిన్న రోడ్లు అవడం వల్ల నీళ్లు కూడా రోడ్డుపై నిలిచి కారు స్పీడ్ గా ముందుకు వెళ్లడం లేదు. ఆ వర్షంలో సరైన దారి తెలియక పక్కదారికి కారు మళ్ళింది.
అలా కారు వెళుతూనే ఉంది. కానీ తెలిసిన దారి లాగా కనిపించడం లేదని సాగర్ కంగారు పడ్డాడు.ఇప్పుడు వెనుకకు వెళ్లడానికి కూడా కష్టంగానే ఉంది.ఇద్దరికీ ఏం చేయాలో అర్థం కాలేదు.
సౌదామినికి భయం వేయసాగింది. కానీ !పైకి భయం కనిపించకుండా ధైర్యంగానే మాట్లాడుతుంది.
” వెనుకదారి బాగా లేదు కదా! సాగర్ ముందుకే వెళ్లిపోదాము. ఇంకేదైనా దారి కనపడుతుందేమో” అని చెప్పింది.
అప్పటికే కొంచెం వర్షంలో తడవడం వల్ల సౌదామిని కట్టుకున్న తెల్ల శిఫాన్ చీర పూర్తిగా తడిసిపోయింది. కొంచెం వణుకుతూ ఉంది కూడా.
” భయంగా ఉందా! నీతో మాట చెప్పనా తడిసిన తెల్ల చీరలో ఎంతో అందంగా ఉన్నావు ” అన్నాడు సాగర్.
” ఒకపక్క దారి తెలియక కంగారుగా ఉంటే,ఇప్పుడు నీకు నా అందం కనిపిస్తుందా?” అన్నది సౌదామిని చిరు కోపంగా.
” అయితే నీకు నిజంగా భయమేస్తుందా ?” అన్నాడు.
“అంతా అడవి ప్రాంతం కదా సాగర్! మనము ఎక్కడో ఒకచోట ఆగడానికి కూడా లేదు. ఇప్పుడు మన ఫోన్లో సిగ్నల్స్ కూడా రావడం లేదు. ఇంట్లో అత్తయ్య, మామయ్య ఎంత భయపడతారో తెలుసా?” అన్నది.
” నాకు అదే టెన్షన్ గా ఉంది. ఇంట్లో ఎంత భయపడతారో? ఆ వర్షంలో మనం దారి తప్పాము. లేకుంటే మనం తొందరగానే ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం” అన్నాడు .
ఇంతలో వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది. కారు అలా ముందుకు వెళుతూనే ఉంది. కొంచెం ఎత్తైన ప్రదేశంలో మినుకు మినుకు మంటూ దీపాలు వెలుగుతూ కనిపించాయి.
” సాగర్! అటువైపు ఇళ్లు కనబడుతున్నాయి. అక్కడికి వెళ్దామా?” అని అడిగింది.
” వెళ్దాము. కనీసం మన ఊరికి దారి అయినా వాళ్ళు చెప్తారేమో” అన్నాడు సాగర్ కారు గుడిసెల వైపు పోనిస్తూ..
గుడిసెల దగ్గరికి వెళ్లి కారును ఆపాడు. అక్కడ కూర్చున్న జనం అంతా ఒక్కసారిగా కారువైపు వచ్చారు.
ఇద్దరూ కారు దిగి వాళ్లను అడిగారు.
” మేము గోపాలపురం వెళ్లాలి. దారితప్పి ఇటువైపు వచ్చాము. ఎలా వెళ్లాలో కాస్త చెప్తారా” అని అతను అడిగాడు.
వాళ్లకి తెలుగు సరిగా అర్థమైనట్లు లేదు. అంతా గిరిజనులు కదా!
కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. వాళ్లకు వచ్చిన భాషలో వాళ్ళు చెప్పారు.
” ఈ రాత్రి వెళ్లడం ప్రమాదకరమని, మీరు ఊరికి చాలా దూరంగా వచ్చారని, అందులో వర్షం ఇంకా కురిసే లాగా ఉందని ఉదయం వెళ్ళమని” చెప్పారు.
అక్కడున్న ఆడవాళ్లు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి కూర్చోమని చెప్పారు. కర్రలతో చేసిన మంచం పరిచి అక్కడ కూర్చోమన్నారు.
ఇద్దరు వెళ్లి కూర్చున్నారు. పరిసరాలను పరిశీలించారు..ఇరవై నుండి ఇరవై అయిదు గుడిసెలు ఉన్నాయి. అన్ని చెక్కలతో కట్టిన గుడిసెలే. పెద్దవాకిళ్ళు ఆ వాకిలికి ,ఎండ వాన పడకుండా వేసిన పందిళ్లు.వంట చేసుకోవడానికి కట్టెల పొయ్యిలు, అన్ని బయటే ఏర్పాటు చేసి ఉన్నాయి.
నేత చీరలు కట్టిన ఆడవాళ్లు, లావాటి కడియాలు కాళ్లకు చేతులకు పెట్టుకుని ఉన్నారు. మెడలో రకరకాల పూసల గొలుసులు, ముక్కులకు పోగులు పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని అందంగా కనిపిస్తున్నారు.
వాళ్లంతా కట్టెల పొయ్యి మీద మొక్కజొన్న పిండితో రొట్టెలు చేస్తున్నారు. ముందుగా పిల్లలందరికీ కంచాలలో వేసి ఇస్తున్నారు. మగవాళ్ళు కొంచెం దూరంలో కూర్చుని చుట్టలు కాలుస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు.
చుట్టుపక్కల అంతా పూల చెట్లు ఉన్నాయి. ఆ చీకట్లో కూడా పూలు మిలమిలా మెరుస్తున్నాయి.
వేడి రొట్టెలు ఆకులో వేసి అందులో మిరప పండ్లతో చేసిన కారము, ఒక బెల్లం ముక్క పెట్టి వీరిద్దరికీ తెచ్చి ఇచ్చారు.
ఎన్ని ఉన్నా అవతలివారికి పెట్టడానికి మనసు రాని ఈ రోజుల్లో, ఈ అడవి ప్రజలు వారికి వచ్చే ఆదాయమే చాలా తక్కువ .అందులో మరొకరికి పెట్టాలని ఆలోచన ఉండడం ఎంత గొప్ప విషయం అని అనుకున్నారు సాగర్, సౌదామిని. వద్దని ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు తినమని చెప్పి, ఇత్తడి చెంబులో నీళ్లు తెచ్చి పెట్టారు.
అంత పెద్ద రొట్టెలను ఎప్పుడూ చూడలేదని చెప్పింది సౌదామిని. రొట్టెలు ఎంతో రుచిగా ఉన్నాయి .అందులోకి వేసిన మిరపండ్ల కారం రుచిగా ఉంది. కొంచెం కారం అయినా కూడా ఇద్దరూ ఎంతో ఇష్టంగా తిన్నారు .ఇదంతా వారికి ఒక కొత్త అనుభవం లాగా ఉంది.
వీళ్ళిద్దరిని చూసి వాళ్ళు భార్యాభర్తలే అనుకున్నారు. కాదు అని చెప్తే చాలా ఇబ్బందులు వస్తాయని వీళ్ళు కూడా అనుకున్నారు. ఎందుకంటే అమాయకపు అడవి ప్రజలు కదా! పెళ్లి కాకుండా మాట్లాడుకోవడాలు, బయటకు వెళ్లడాలు తెలియవు కదా .అందుకని సాగర్, సౌదామిని కూడా వాళ్ళకి ఏమీ చెప్పలేదు.
రొట్టెలు తిన్న తర్వాత పెద్ద గ్లాసుల్లో కషాయం లాంటిది తెచ్చి ఇచ్చారు. వద్దని ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. కానీ తాగుతుంటే వేడిగా ఆ కషాయం కూడా చాలా బాగుంది. దేనితో చేశారో అర్థం కాలేదు. కానీ కడుపులో హాయిగా ఉంది ఇద్దరికీ.
అక్కడే ఉన్న గుడిసెల్లో ఒకరిది కొంచెం పెద్దగుడిసె. వీరిని అందులో పడుకోమని చెప్పారు. అక్కడ వాళ్ళ పిల్లలతో పాటు వీరిద్దరికీ కూడా చాప వేస్తే ,వారి పక్కనే పడుకున్నారు.
ఆ గుడ్డి దీపంలో అంతా మసక మసకగా కనిపిస్తుంది. ఎక్కడికొచ్చారో , ఏంటో అనేది అర్థం కావడం లేదు. కానీ రక్షిత ప్రాంతంలో ఉన్నామని మాత్రం అర్థం అయింది. నాగరీకుల కన్నా వీళ్లే ఎంతో మేలు అనుకున్నారు. ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడం వారికి పుట్టుకతో వచ్చిన మంచి అలవాటు.
అలా ఇద్దరికీ ఎప్పటికో కానీ నిద్ర పట్టలేదు . తెలతెలవారుతుండగా ఇద్దరికీ మెలకువ వచ్చింది. అప్పటికే వాళ్లు వంట పనులు చేసుకుని పనులకు వెళ్లడానికి తయారుగా ఉన్నారు.
వీళ్ళు లేవగానే చేతుల్లో కట్టె బొగ్గు ఇచ్చి ముఖం కడుక్కోమని చెప్పారు. అది ఎలాగో ఇద్దరికీ అర్థం కాలేదు. అక్కడ వాళ్ళ పిల్లలు కడుక్కోవడం చూసి ఎలాగో ప్రయత్నం చేశారు. తర్వాత వేడివేడి పాలు ఇద్దరికీ గ్లాసుల్లో పోసి ఇచ్చారు. ఇద్దరు పాలు తాగిన తర్వాత మేము బయలుదేరుతాము అని చెప్పాడు సాగర్.
వారికి ఏమైనా ఇద్దాం అంటే కూడా తన దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. ముందులాగా క్యాష్ కూడా దగ్గర పెట్టుకొని ఎవరు తిరగడం లేదు కదా! అంతా ఆన్లైన్ పేమెంట్లు. కానీ సాగర్ ఆ ప్రదేశాన్ని గుర్తు పెట్టుకున్నాడు. వీళ్లకు ఏ విధంగానైనా సహాయం చేయాలని అనుకున్నాడు.
గుడిసెలో ఒక చిన్న పిల్లోడు జ్వరంతో పడుకున్నాడు. పక్కనే ఉన్న ఆ తల్లి ఒడిలో పడుకో పెట్టుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది. ఇది గమనించింది సౌదామిని.
” ఏమయింది ఆ బాబుకి”? అని అడిగింది.
గబగబా బాబు దగ్గరికి వెళ్లి చేయి పట్టుకుని చూసింది .విపరీతంగా కాలిపోతుంది. వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న మందులు గుర్తొచ్చాయి. బాలసదనముకు వెళ్లేటప్పుడు కొన్ని మందులు తన బ్యాగ్ లో పెట్టుకుంది. కారులో నుండి బ్యాగు తీసుకుని వచ్చి అందులో టాబ్లెట్స్ తీసి ఆ పిల్లవాడి తల్లికి ఇచ్చి ఎన్నిసార్లు వేయాలో చెప్పింది. తర్వాత తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న ప్రోటీన్ పౌడర్, పాలపొడి పొట్లాలు అక్కడ ఉన్న పిల్లలందరికీ ఇచ్చి ఎలా తాగాలో చెప్పింది .కొంతలో కొంత వారికి సహాయం చేయగలిగాము అనే తృప్తి మిగిలింది.
వారి వద్ద సెలవు తీసుకొని మెల్లిగా బయలుదేరారు. కొంత దూరం బయలుదేరిన తర్వాత మొబైల్ కి సిగ్నల్ వచ్చింది. ఇంటికి ఫోన్ చేస్తే నీలాంబరి ,భూపతి కంగారుపడి వీళ్ళ కోసం ఎంతో వెతికిస్తున్నట్లు తెలుసుకున్నారు.
“అమ్మా! ఇంటికి వచ్చినాక విషయం చెప్తాను కంగారు పడకండి బయలుదేరాము” అని చెప్పాడు .
సశేషం