మౌనానంద స్వామికి జై

కథ

ఇద్దరు స్నేహితులు కలిసి హార్సిలీ హాల్స్ కు విహారయాత్రకు బయలుదేరారు. మధ్యమధ్యలో బంధువులను కలవడం, అతిధి మర్యాదలు పొందడం వారిచ్చిన కట్నకానుకలు తీసుకుని ఆనందంతో సంబరంగా ప్రయాణమంతా సాగింది. తిరుగు ప్రయాణంలో చాలా దూరం డ్రైవింగ్ చేసిన తర్వాత అలసట ఇద్దరిని చుట్టేసింది. ఒక పెద్ద చెట్టు నీడలో వాహనం ఆపి, కాసేపు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
దయానంద్ కారు దిగి వెన్నునొప్పి తగ్గాలని, యోగి లాగా ఆసనం వేస్తూ చేతులు చాచి, వంగి నిలబడ్డాడు. అదే సమయంలో అతని స్నేహితుడు దేహబాధలు తీర్చుకోవడాని పక్కకు వెళ్ళాడు. కొంతసేపటికి వచ్చి “ఒరేయ్ బాబా… లేవరా… ఆలస్యం అవుతుంది బయలుదేరుదాం!” అని కేక పెట్టాడు.

ఆ మాటలే అతని పాలిట అపశకునమయ్యాయి.

అంతలో అక్కడే పొలాల్లో పనిచేసే కొందరు కూలీలు ఆ వైపు పరుగెత్తుకుంటూ వచ్చి, వంగి ఉన్న దయానంద్ కు నమస్కరించారు. అకస్మాత్తుగా వారు తనకు దండాలు ఎందుకు పెడుతున్నారో అర్థం కాలేదు. ఇంతలో దయానంద్ నోరు తెరచేసేలోపే, ఇంకొకడు గభాలున తనదగ్గరున్న మూడు అంగుళాల పొడగున్న చిన్న త్రిశూలాన్ని మౌనానంద బాబాకీ జై!బాబాకీ! జై! అంటూ అతని నాలుక మీద గుచ్చేశాడు.
ఒక్క క్షణం! దయానంద్ కు ఏమీ అర్థంకాలేదు! నాలుక నొప్పి! నోరు తెరిచి మాట్లాడుదామంటే అడ్డంగా త్రిశూలం. అప్పటికప్పుడు మూతి వాచిపోయి ముఖం గుర్తుపట్టరాకుండా అయ్యాడు. నొప్పి… కంట్లో నీరు… మాట రాని స్థితి. చేతులతో సైగలు చేస్తూ విలవిలలాడుతున్నాడు. లేవనివ్వకుండా అరడజను చేతులు అతని కాళ్ళను గట్టిగా పట్టుకున్నాయి…. వదలండీ! వదలండనీ అరవలేక సైగలు చేస్తున్నాడు.
వెంట వచ్చిన స్నేహితుడిని ఈ గుంపు వెనక్కి నెట్టేసింది. ఆ గోలలో అతను అరచి చెప్తున్నాడు అతను బాబాకాదు! ఏమీ కాదు! వదలండీ! నా స్నేహితుడని ఎంత అరుస్తున్నా వారు వినిపించుకోలేదు. అక్కడున్నవారు *ఇదో కొత్త నాటకం రేపు బాబాకు వచ్చే డబ్బులు , కానుకలు కాజేద్దామనీ వీడి కుట్ర… వీడిని లాగి అవతల పారేయండని స్నేహితుడిని ఒక్క తోపుతోసారు. అతను చేసేది ఏమీ లేక దగ్గరున్న పోలీసులకు ఫిర్యాదు చేద్దామని పట్టణానికి బయలుదేరాడు.

అంతలోనే ఆ గుంపులోంచి ఓ గొంతు లేచింది.

“సైగల బాబాకు జై! సైగల బాబాకు జై!”అని ఆ ప్రాంతమంతా జయజయ ధ్వానాలతో మారుమోగింది. దాదాపు స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉన్నాడు దయానంద్. చెట్టు కింద రాళ్లు పేర్చి గద్దెలా తయారుచేసి, దయానంద్‌ను దానిమీద కూర్చోబెట్టారు. “చూశారా! ఇంత నొప్పిలోనూ ఎవరికో భవిష్యత్తు చెప్పాలనుకునే మహాత్ముడు!” అని పొగడ్తలు మొదలయ్యాయి.
ఆ మగతలో కూడా దయానంద్‌ కు కోపం తారాస్థాయికి చేరుకుంది. నా భవిష్యత్తే నాకు తెలియడం లేదు … “నేను ఇంకొంకడికి చెప్పడమేమిటి? నా బొంద, నేను చెట్టు కింద ఆసనాలు వేయడమే నేరమా? ఎవరైనా ఈ త్రిశూలం తీస్తే బాగుండును”… అని అనుకుంటున్నాడు. కానీ మోటుగా లాగితే మరింత ప్రమాదమని, సెప్టిక్ అయితే ఏమవుతుందో అన్న భయంతో మాట్లాడలేక మౌనంగా ఉన్నందుకే అతనికి కొత్త పేరు పెట్టేశారు—మౌనానంద స్వామి అని.

ఇంతలో స్నేహితుడు ఎక్కడ? అని కళ్లతో వెతికాడు. అక్కడ కనబడలేదు. ఒంటరితనమూ, నాలుక నొప్పీ, తలంతా నొప్పి కలిసి అతన్ని నలిపేస్తున్నాయి. ఏమీ చెప్పలేని మౌనం చూసి, “లోకక్షేమం కోసం తపస్సు చేస్తున్న మహానుభావుడు” అని జనాలు మరింత నమ్మేశారు. భజనలు మొదలయ్యాయి.
ఒక ముసలమ్మకు ఒక ఆలోచన వచ్చింది. చుట్టు పక్కల తిరిగి రుద్రాక్ష కాయలు ఏరుకుని వచ్చి దండ గుచ్చి బాబా మెడలో వేసింది. ఆ దండ వల్ల అతనికి ఒకటే దురద పుట్టింది! అతని చేతులు గట్టిగా పట్టుకోవడం వల్ల దురదోపశమనం చేసూకోలేకపోతున్నాడు.

మళ్లీ—జయజయ ధ్వానాలు. మౌనానంద స్వామీకి జై అంటూ….

కోపం… బాధ… అసహనం… దయానంద్
గుడ్లురిమాడు. వదలండి అనే అతని సైగలు అర్ధంకానీ ఆ మూఢులు అది కలి ప్రభావమనీ విపరీత పనుల మీద బాబాకు కోపం వచ్చిందని మొదట గుసగుసలాడిన జనం ఇక పైకే అనడం మొదలు పెట్టారు.
ఆఁ….. బాబాకు కోపం వచ్చిందంటే రాదా? ఆ ఫలానా పిల్ల తను ప్రేమించిన వాడికోసం భర్తను గొడ్డలి పెట్టి నరికి- ఇంటి దగ్గరే ప్రేమికుడి సాయంతో గోతిలో పాతిపెట్టి , పైన నున్నగా ఎవరికీ తెలియకుండా ఉండాలని సిమెంటు గచ్చు చేసిందట! మరి అంతటి అన్యాయాలను బాబా చూసి తట్టుకుంటాడా ? వస్తది! కోపం రావడం సహజమే అంటున్నారు.
బాబాకు కోపం ఎక్కువ అవుతుందేమోనని, పక్కనే పారుతున్న వాగులోంచి నీళ్లు తెచ్చి కుమ్మరించింది ఒక భక్తురాలు. చల్లటి గాలి, చల్లని నీళ్లు… వణుకు పెరిగింది. నోట్లో త్రిశూలం బాధ మరింత పెరిగింది. చూస్తుండగానే జనం బాగానే పెరిగారు. బాబా ఆగ్రహం తగ్గాలని దండకాలు, శ్లోకాలు, కరావలంబ స్తోత్రాలు అసలు ఒక్కటేమిట? నోటికొచ్చిన పద్యాలు చదవడం మొదలుపెట్టారు. రణగొణ ధ్వనితో దయానంద్ చెవులు దిబ్బడ పడ్డాయి.. ఎవరో కుంకుమ తీసి నుదుట పెద్ద బొట్టు పెట్టారు.
నిమిషాల్లోనే దయానంద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. లోలోపల నిజంగానే కోపం వస్తున్నది దయానంద్ కు…అరే! చెప్పింది వినిపించుకోరు! చెప్పనివ్వరు! తన ముఖంలోని కోపాన్ని చూసి పైనుండి ఈ లాంటి వ్యాఖ్యానాలు.. ఏం చేయాలో పాలు పోవడంలేదు!

ఫోన్లు మొదలయ్యాయి—“ఇక్కడ చెట్టు కింద మహిమగల బాబా వెలిశాడు!” అని ఎవరికో చెబుతున్నారు.

నమ్మకాలెక్కువున్న ఓ ఆచారమ్మ భక్తిప్రదర్శనలో ప్రథమశ్రేణిలో ఉండే ఆ మహా తల్లి పులిహోర, పానకాలతో అక్కడికి వచ్చింది.
ఆ గుంపులో ఉన్న వ్యాపారికి ఒక ఆలోచన వచ్చింది. ఈ చక్కటి అవకాశం ఎందుకు వదులుకోవాలి? నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు! అని—తన వెంట బస్తా కొబ్బరికాయలు, ఊదుబత్తీలు, కర్పూరం తెచ్చి… చెట్టుకింద పెట్టాడు. మొదట ఒక కొబ్బరికాయ, ఊదుబత్తీలు, కర్పూరం తీసుకొని బాబా దగ్గరకు వెళ్ళి పూజ చేసాడు అంతే… అక్కడ ఉన్నవారికి ఉత్సాహం ఉరకలెత్తింది… కొబ్బరికాయలు తీసుకోవడం, కొట్టడం…. తీసుకోవడం, కొట్టడం….
తానేం తక్కువ తిన్నానా అని మరొక వ్యాపారి దేవుళ్ల ఫోటో ఫ్రేములు, నల్ల-ఎర్ర దారాలు, తాయెత్తులు, టార్పాలిన్ షీట్… పట్టుకుని అక్కడికి వచ్చాడు.
ఇంకొకడు టీ డబ్బా పట్టుకొని వచ్చాడు. వాడి సంచార చాయకొట్టుతోపాటు, వాడి బావమరిది ఏకంగా మరమరాలు, ప్రసాదాల డబ్బా పట్టుకుని వచ్చాడు. ప్లాస్టిక్ బూరలు, బొమ్మలవాడు ఇలా ఎవరి బంధువులకు వారు చెప్పుకుని క్షణాలలో దుకాణాలు వెలిసాయి. కాసేపట్లోనే అక్కడ చిన్న జాతర వాతావరణం ఏర్పడింది.
భజనలతో గొంతులు ఎండిపోయినవాళ్లకు చాయ్ అమృతమైంది. కానీ మౌనానంద స్వామికి నోట మంచినీళ్ల చుక్క కూడా లేదు.
ఇంతలో స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుడు, ఆయనతో పాటు చిన్న- చిన్న నాయకులు… అందరూ అక్కడికి వచ్చారు. అక్కడే బాబాకు గుడి కట్టించమని భక్తులు అడగారు… ఆ నాయకుడు వాగ్దానాలు చేయడాలు జరుగుతున్నవి… ఇదంతా చూస్తున్న స్నేహితుడికి ఏమీ అర్థంకావడంలేదు. తన స్నేహితుడు దయానంద్ ఏడి? అని చుట్టుపక్కల వెతుకుతున్నాడు.
బాధతో కళ్ళు తెరిచిన దయానంద్‌కు స్నేహితుడు కనిపించడు. కోపం నషాళానికి అంటుకుంది. కానీ సైగ చేస్తే— చుట్టూ ఉన్నవారు “దేవుడు పూనాడు!” అంటున్నారు. “ఏంకావాలి సామీ?” అని అడుగుతుండగానే ఒక మహిళ పూనకం వచ్చి ఊగింది— హుహుహు….“అరిష్టం! గొర్రెలు, మేకలు నైవేద్యం!” పెట్టాలి! హుహుహు…. అని పూనకంతో ఊగింది…
వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇంతలో కోళ్ళు, మేకలు అక్కడికి తెచ్చారు… వాటిని బలివ్వడం మొదలుపెట్టారు.
ప్రజల మూర్ఖత్వం.. మూఢభక్తిని చూసి దయానంద్‌కు ఇదేం మూఢ భక్తి అని విరక్తి కలిగింది. ఇంతలో ఏదో చెప్పాలని దయానంద్ చేయి పైకి ఎత్తుతున్నాడు.
చూడండి “బాబా ఆశీర్వదిస్తున్నాడు!” అంటూ గుంపుగా వచ్చి మౌనానందస్వామికి జై, మౌనానందస్వామికి జై అని అరుస్తూ చుట్టిమూగారు… తలో మాటా…దండాలు మొక్కులు…గడబిడగా మారింది
…అక్కడ బాబా ఆశీర్వాదం కోసం తొక్కిసలాట మొదలైంది…
ఎవరి కోసం కాలం ఆగదు. స్నేహితుడు దగ్గరలో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయాలని వెళ్ళాడు కదా! కానీ ఎన్నికల హడావుడి, గొడవలు, బందోబస్తు కారణంగా ఎవ్వరూ అతని మాటలను పట్టించుకోలేదు. దాంతో తాను ఏమీ చేయలేనని కనీసం డాక్టర్ ను తీసుకొని వెళ్ళి స్నేహితుని నాలుక మీద ఉన్న త్రిశులాన్ని పీకివేయాలనుకున్నాడు. అక్కడ డాక్టర్ అందుబాటులో లేదు.
తానే దయానంద్‌ను తీసుకెళ్లాలని అక్కడికి వస్తే అక్కడ ఒక పెద్ద జాతర జరుగుతోంది.
ఇంతకీ ఏది దయానంద్ అని వెదుకుతున్నారు. “బాబా ఎవరు?” అని అడుగుతూ జనసంద్రములోకి తోసుకుంటూ వెళ్లాడు. దగ్గరికి వెళ్లి చూసేసరికి తన స్నేహితుడిని గుర్తు పట్టలేకపోయాడు. ఆకలి, దప్పి, నొప్పితో బాబా కళ్ళు మూసుకున్నాడు. భక్తులు హారతులు, కొబ్బరికాయలు, భజనలు… యువకవులు పాటలు రాసి పాడి, వీడియోలు తీశారు. స్వరకర్తలు పాటలు యూట్యూబ్ లో అప్పుడే అప్లోడ్ చేస్తున్నారు.
ఆ తొక్కిసలాటను ఎలాగైనా ఆపాలని రాజకీయ నాయకుడు తన పలుకుబడితో పోలీసులను అక్కడికి రప్పించాడు. ఇదే అదను అని దయానంద్ స్నేహితుడు ఆ పోలీస్ అధికారితో జరిగిందంతా చెప్పాడు. ఆ పోలీసు అధికారి అంతా విని అయ్యో! ఇంత అన్యాయం జరిగిందా? అని అతను బాబాకాదనీ, ప్రజల మూఢనమ్మకానికి బలైన ఒక అమాయకుడనీ చెప్పి, కొందరు యువకుల సాయంతో ఆ గుంపును అదపులోకి తెస్తూ… వెనుక నుండి పోలీసులు దయానందన్ ను పక్క ఊరిలో ఉన్న ఆసుపత్రికి తరలించారు!

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఓ ప్రేమ కథ (మోహన రాగం)-12

లోకాభిరామాయణం 11