“లక్ష్మీ, ఏం చేస్తున్నావు?” అంటూ వచ్చింది పక్కింటి పంకజం.
“కిచెన్ లో పని అయిపోయి ఇప్పుడే కూర్చున్నా. రా కూర్చో” అంది లక్ష్మి.
“మనకి పనులు ఎప్పుడూ ఉంటాయి, అందుకే కాస్త రిలాక్స్ కోసం ఒక మంచి ప్రోగ్రాం పెడుతున్నాను. నిన్ను కూడా కలిపాను అందులో”అంది పంకజం.
“ఏం ప్రోగ్రాం, కిట్టీ పార్టీనా, అది ఎప్పుడూ ఉండేదేగా” అంది లక్ష్మి.
“కాదు, మన గురువు గారు చార్ ధాం యాత్ర పెడుతున్నారు, కిందటి సారి కిట్టీ పార్టీలో చెప్పారు. నీవు రాలేదు కదా! నేను నీ పేరు కూడా ఇచ్చేసాను” అంది పంకజం.
“మా వారు ఏమంటారో కనుక్కోవాలి” అంది లక్ష్మి.
“మనం వెళ్ళేది పుణ్యక్షేత్రాలకే కదా, అన్నయ్య కూడా రావచ్చు.చక్కగా ఎంజాయ్ చేయవచ్చు” అంది పంకజం.
బెడ్ రూం లో ఉన్న సాగర్ కి వీళ్ళ మాటలు వినపడుతూనే ఉన్నాయి. ఈ మధ్య ఈ టూర్లు ఎక్కవ అయినాయి. టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ పుణ్యమా అని అందరికీ అందుబాటులోకి ఈ టూర్లు వచ్చేసాయి.
పుణ్యక్షేత్రాలు కూడా ఎంజాయ్ మెంట్ ప్రదేశాలుగా మారాయి. పిల్లలు, యువత, మధ్యవయసు వాళ్ళు, వృద్ధులు అందరూ వీటి పట్ల ఉత్సాహం చూపిస్తున్నారు.
డబ్బులకు కొదవ ఉండటం లేదు. అన్ని ప్రాంతాల్లో అన్నిరకాల సౌకర్యాలు వచ్చేసాయి. ఒకప్పుడు ఫ్లైట్ అంటే ధనవంతుల ప్రయాణ సాధనం, కానీ ఇప్పుడు మధ్యతరగతికి కూడా సాధారణమైపోవటంతో ఈ టూర్లు సునాయాసంగా వెళ్ళి వస్తున్నారు.
దీనివల్ల సమస్య ఏమిటి అనుకుంటున్నారా? ఈ మధ్యనే వచ్చిన నేపాల్ వరద భీభత్సం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. సాధారణంగా కొన్ని నెలలే యాత్రలకు అనుకూలం. కొన్ని నెలలు అసలు అనుకూలంగా ఉండవు. ముఖ్యంగా వానాకాలం. ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు. ఏం జరుగుతుందో తెలియదు.
మనకి యోగులు చాతుర్మాస్య దీక్ష అని చేస్తారు. ఈ దీక్ష ఆషాఢ ఏకాదశి మొదలు కార్తీకం శుధ్ధ ఏకాదశి వరకూ చేస్తారు. అంటే వర్షాకాలం మొత్తం అన్నమాట. ఈ సమయంలో వారు ఎక్కడికి కదలరు.
దీనికి ఆధ్యాత్మిక కారణాలు పక్కన పెడితే, ఈ వానాకాలంలో ప్రయాణాలు సులభం కాదు, మరియు భద్రత కూడా ఉండదు.
ఎవరూ ఎక్కువగా సంచరించని ఈ వర్షాకాలంలో ప్రకృతి కూడా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకు పోయే సమయం. నదులు ఉప్పొంగి ఆనందంతో పరవశిస్తూ తాండవం చేసే సమయం. హిమాలయ పర్వతసానువులలో యోగులు,మునులు,యతులు తపో దీక్షలో ఉండే సమయం.
అలాంటి ఈ సమయంలో కూడా యాత్రల పేరుతో విహారం చేస్తూ, ప్రకృతికి భంగం కలిగిస్తుంటే ఆ ప్రకృతికి కోపం రాదా!
ఇంకా ప్రాక్టికల్ గా ఆలోచిస్తే, హిమాలయాలు ఎత్తైన పర్వత శ్రేణులే కానీ అవి బోలుగా ఉండే రాళ్ళు మట్టి కొండలు. చిన్న ఒత్తిడి కూడా తట్టుకోలేవు.
అక్కడ కూడా ఆనకట్టలు, పెద్ద పెద్ద కట్టడాల పేరుతో కొండల్ని తొలిచి పారేస్తున్నారు.
విరామం లేకుండా జన సందోహం వెళుతుంటే విపరీతమైన కాలుష్యం వల్ల వేడి పెరిగి, హిమం కరిగిపోవటవల్ల ఈ అనర్ధాలు జరగక మానవు, ప్రాణనష్టం తప్పదు.
ఏదైనా సరే మానవ తప్పిదాల వల్లే ప్రకృతి విలయ తాండవం జరుగుతున్నది అనేది పచ్చి నిజం.