“మీరెన్ని చెప్పండి. మీ అమ్మగారిని యిక్కడికి తీసుకురావడానికి నేనొప్పుకోను. అలవాటైన ఊరు. అలవాటైన పరిసరాలు. అయినా కాలు చెయ్యి బాగానే ఆడుతున్నాయి కదా! కాలు చెయ్యి పడిపోయినప్పుడు ఆలోచిద్దాంలెండి”.
“అదేమిటి సరసూ! అంత మాటన్నావు?”
“ఆవిడ అత్తగారి గురించి మీ అమ్మగారన్న మాటలే కదా! నేనేమైనా కొత్తగా అన్నానా ఏమిటి?” “ఎప్పుడో అయిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు?”
“ఎందుకంటే, అది ఆవిడ చూపిన త్రోవే కదా! నేను అనుసరిస్తున్నానంతే!”
“అది తప్పని నీకు తెలియదా?” “మీకు తెలియదా?”
“తెలుసు కాబట్టే, అమ్మను యిక్కడకు తీసుకొద్దానుకుంటున్నాను”.
“కాలానుగుణంగా మనుషులను బట్టి మీ తప్పొప్పులు మారిపోతాయంటే నేను లెక్కచెయ్యను”
“సరసూ దయచేసి అర్థం చేసుకో! అప్పుడు మా అమ్మ చేసినది తప్పే. కాని ముప్పయ్యేళ్ళ క్రిందట జరిగిన దానికి యిప్పుడు నేనేం చెయ్యగలను?” నాన్న అమ్మను బ్రతిమలాడుతున్నారు.

“ఇప్పుడూ అలాగే అనుకొని ఊరుకోండి. మీకు అమ్మ అయితే అవ్వచ్చు. గాని ఆవిడ మా అమ్మమ్మకు చేసినదానికి, ఆవిడ క్షమించినా నేను క్షమించలేను. కొడుకుగా మీరేం చేసినా నేను అడ్డు చెప్పను. కానీ ఒక కోడలుగా ఆవిడ ఎంతవరకు చేశారో, నేనూ అంతవరకే చేస్తాను. నన్ను ఎక్కువగా బలవంత పెట్టవద్దు” అమ్మ నిష్కర్షగా చెప్తుంది నాన్నతో.
అమ్మానాన్నల సంభాషణను పక్కగదిలో ఉన్న నేను పూర్తిగా విన్నాను. నేను గదిలో లేననుకొని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారో, ఉన్నా ఫరవాలేదు అనుకొని మాట్లాడుకున్నారో నాకు తెలియదు. కానీ వారం రోజులనుండి అమ్మానాన్నల మధ్య ఈ ప్రచ్చన్న యుద్ధం జరుగుతూనే ఉంది నాన్నమ్మ విషయంలో. ఈరోజు ఇద్దరూ బయటపడ్డారు.
అమ్మ, నాన్నకు అత్త కూతురే. తాతమ్మ నాన్నకు నాన్నమ్మ అయితే అమ్మకు అమ్మమ్మ అవుతుంది. నాన్నమ్మ తాతమ్మను బాగా చూసుకోలేదని అమ్మకు కోపం. ముత్తాత చనిపోయాక, తాతయ్య వాళ్ల అమ్మ… అదే తాతమ్మను ఇంటికి తీసుకువస్తానంటే నాన్నమ్మ ఒప్పుకోలేదంట. చివరకు ఆ పల్లెటూరిలోనే తాతమ్మ చనిపోయిందంట. అప్పటికి నాన్నగారు ఉద్యోగం చేస్తున్నా తాతమ్మ విషయంలో ఏమి చేయలేదని అమ్మకు కోపం. అందుకని ఇప్పుడు తాతగారు చనిపోయాక నాన్నమ్మను తీసుకువస్తానంటే ఒప్పుకోవడం లేదు.
దానికితోడు… మనలో మనమాట… నాన్నమ్మ ఎప్పుడూ అమ్మను కూడా బాగా చూసుకోలేదు. నాన్నమ్మకు ఇష్టం లేకుండా, తాతమ్మ బలవంతంతో అమ్మానాన్నల పెళ్లి జరిగిందని ఒక కారణం. ఏదైతేనేం నాన్నమ్మ, అమ్మల మధ్యలో సయోధ్య ఎప్పుడూ లేదు. నాన్నమ్మ అటు ఆవిడ అత్తగారి విషయంలోనూ, ఇటు కోడలి విషయంలోనూ తన మాటే నెగ్గేటట్లు చూసుకుంది. అధికారం చలాయించింది. ఆ విషయం జగమెరిగిన సత్యం.
ఒకప్రక్క తన అమ్మమ్మకు అన్యాయం చేసిందని, ఇంకొక ప్రక్క తనను ఏ రోజూ ప్రేమగా చూసుకోలేదని అమ్మకు, నాన్నమ్మ అంటే కోపం. ఆ కోపం ఇప్పటికీ అలానే ఉంది. అందరి విషయంలో మంచిగా ఆలోచించే అమ్మ, నాన్నమ్మ విషయంలో మాత్రం తన గతంనుండి బయటపడలేక పోతుంది. మధ్యలో నాన్న నలిగిపోతున్నారు.
ఇప్పుడు పరిస్థితి యిలా ఉంటే…. మరో పాతికేళ్ల తర్వాత…. ఇదే పరిస్థితి నేనూ ఎదుర్కోవలసి వస్తుందా? మీ నాన్నమ్మ గారిని మీ అమ్మగారు చూశారా, నేను మీ అమ్మగారిని చూడడానికి? అని నా భార్య అంటే నేనేమి చెయ్యాలి? నా భార్య మా అమ్మల మధ్య నలిగిపోవాలా! అమ్మో! నా వల్ల కాదు. ఆ పరిస్థితి నాకు ఎదురవ్వకూడదంటే ఇప్పుడే నేను సరైన దిశగా ఆలోచించాలి అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చాను.
“అమ్మా! నీ బాధను, మనోభావాలను నేను అర్థం చేసుకోగలను. గాని కొత్తవారికి ఇవన్నీ అర్థం కాకపోవచ్చు. పాతికేళ్ల తర్వాత ఇదే పరిస్థితిలో నేనూ వుంటానేమోనన్న ఆలోచన నన్ను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ఏం చేయమంటావు నన్ను?” ఆ రాత్రి అమ్మ చరవాణికి ఒక సందేశం పంపించాను.
*
“సరసూ! తలుపేసుకో” వేకువజామునే నాన్న మాటలు.
“రేపు పెందరాళే బయలుదేరండి. ఎండ పడ్డాక బయలుదేరవద్దు. మీ అమ్మగారి ఆరోగ్యం అసలే అంతంత మాత్రం” అమ్మ నాన్నకు చెప్తుంది.
నాన్నమ్మను తీసుకురావడానికి ఊరికి బయలుదేరినట్లున్నారు.
నాకు తెలుసు. మా అమ్మ వివేకవంతురాలు. అర్థం చేసుకోగలదు.*