“దసరా”

కవిత

అలనాడే అతివలబలలు కారని
వారు దలచిన సాధించలేని కార్యమేదీ లేదని,
సమాజ హితము కొరకు,
మహిషాసుర సంహారానికై, తమ ఆయుధములనిచ్చి
సృష్టించారు దుర్గాదేవిని త్రిమూర్తులు;

పాశ, శూల, చక్ర, వజ్రాయుధధారిణియై,
నవరాత్రుల భీకర పోరు అనంతరం,
అతివలబలలు కారని, మహాబలులని నిరూపించి,
సాధించె విజయం మహిషాసుర మర్ధనియై
దుర్గాదేవి ఆనాడు

మరి ఈనాడో!
అన్నిటా తానే ముందుండి, అంతరిక్షానికేగినా
అతివలపై అరాచకాలు, ఆకృత్యాలు,
నిత్య కృత్యమైపోయిన ఈ రోజుల్లో,
స్త్రీలకు మాన, ప్రాణ రక్షణే కరువైపోతుంటే,
దుర్గాదేవిలు యేమైపోయారు?
వారిని సృష్టించే దేవతలెక్కడ?

దార్శనికతలేని పురుషుల్లో,
అసుర గుణం ప్రబలుతుంటే,
జరుగుతున్న యెన్నో అమానవీయ సంఘటనలు,
మానవ జాతిని నిర్వీర్యం చేస్తుంటే,

వలువలిచ్చి, మగువల విలువను నిలిపే
శ్రీకృష్ణులు కానరారే?
కీచకుల మదమణచి, స్త్రీలను రక్షించే
భీమసేనులు అగుపడరే?
సహనశీలులను కాపాడే
వరాహమూర్తులు ప్రత్యక్షమవ్వరే?
మహిళలకూ సమాన హక్కులుండాలనే
కందుకూరులూ కనిపించలే?
మరేమి చేద్దాం?
పరిష్కారమెలా?
మానవ మృగాలు జనారణ్యంలో
వుండాలంటే భయపడేలా,
పుట్టిన నుండే ఆడపిల్లకు
ఆత్మరక్షణ నేర్పుదాం
అపర శక్తి స్వరూపిణిగా పెంచుదాం
ఆనాడే, ప్రతిదినమొక దసరా పండుగే అతివలకు
ఆ రోజు త్వరలో వస్తుందని ఆశిస్తూ…

Written by Dr. Majji Bharathi

ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరంలో ప్రొఫెసరుగా మరియు మైక్రోబయాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్న డా. మజ్జి భారతిగారు, మూడు కథా సంపుటాలు- 1. ఆలోచనా తరంగాలు (2022), 2. వేకువ (2024), 3. జీవన గానం (2025), 4. భారతీ! వందనము అనే పద్య సంకలనాన్ని వెలువరించి, నాల్గవ కథా సంపుటం "అనగనగా ఒక కథ" ప్రచురించబోతున్నారు. వందకు పైగా కథలు, ఆరోగ్యానికి సంబంధించిన వివిధ వ్యాసాలు, ట్రావెలాగ్స్, కవితలు వివిధ పత్రికలలో (ఈనాడు ఆదివారం అనుబంధం, విశాలాక్షి, విశాఖ సంస్కృతి, మాతృక, భూమిక, పాలపిట్ట, ప్రసారిక, సాహితీ కిరణం మొదలైన పత్రికలలో, కథామంజరి, కౌముది, విహంగ, సారంగ, సంచిక, మాధురి, తరుణి, మయూఖ, రవళి, గో తెలుగు డాట్ కాం మొదలైన అంతర్జాల పత్రికలలో) ప్రచురింపబడ్డాయి. ఐదు కథలకు బహుమతులు, ప్రత్యేక బహుమతులు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శ్రీమద్రామాయణము

స్ఫూర్తివంతమైన చిత్రాలు