సంస్కృత చరిత్రలు రాసి సాహితీ లోకాన చరిత్ర కెక్కిన విదుషీ మణి శ్రీమతి ముదిగంటి సుజాతా రెడ్డి గారితో రంగరాజు పద్మజ పరిపృచ్ఛ….
జగమెరిగిన రచయిత్రి ముదిగంటి సుజాత రెడ్డి గారు. ఆమె శ్వాస- ధ్యాస రెండూ తెలుగు సాహిత్యసేవ- సాహిత్య పఠనంగా జీవనం గడుపుతూ ఈ ముదిమి వయసులోనూ సాహిత్యపరమైన సంభాషణలలో చిరునవ్వులు చిందిస్తూ… పసిపాపవలె అడిగిన వాటికి అడగని (అంటే నాకు వారి రచనలన్నీ పూర్తిగా చదవక తెలవకపోవడంతో) వాటికీ చక్కని సమాధానాలు ఇస్తూ… సమయమే తెలియకుండా చక్కగా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈ ముఖాముఖిని ఫలవంతం చేసిన విదుషీమణి శ్రీమతి ముదిగంటి సుజాతారెడ్డిగారి కలమనే హలంతో మేధస్సు మాగాణిలో తెలుగు భాషా పంటను పండించిన పంటకామె సాహిత్యాభిమానుల గరిసెలను నింపారు.
ఒక్కొక్క ప్రక్రియా వంగడం గురించి, ఆ పంట దిగుబడిలో వారి కృషిని గురించి వారి మాటల్లోనే తెలుసుకొని, తెలుగు భాషా పంటను పండించిన రైతు ఒక్కొక్క వంగడం గురించి ఆ పంట దిగుబడిలో వారి కృషిని గురించి వారి మాటల్లోనే తెలుసుకొని, మనమూ మన మన మేథో గాబులలో నింపుకుందాం రండి! సాహిత్య సుక్షేత్రంలో అలా విహరిద్దాం! కలుపు మొక్కలే లేని మేలిమి పొలంలోని నాణ్యమైన భాషా ధాన్యపు రాశులను మన మన స్వంతం చేసుకుందాము రండి! మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది మరో కృషీవలి రంగరాజు పద్మజ.
రంగరాజు పద్మజ :— అమ్మా! నమస్కారము!
ముదిగంటి సుజాతా రెడ్డి:- నమస్కారం!
పద్మజ:– మీ నేపథ్యం చెప్పండి
సుజాతారెడ్డి:– మా తల్లి – తండ్రులు వెంకటమ్మ, రాంరెడ్డి . నేను పుట్టింది నల్లగొండ జిల్లా ఆకారం అనే గ్రామంలో. ఆకారం అనే పేరు మా ఊరికి ఎలా వచ్చిందంటే? అర్కవరం ప్రజల పలుకుబడులలో అక్కవరంగా మారింది. అర్క అంటే సూర్యుడు అని అర్ధం. మా ఊరి చెరువు గట్టున కాకతీయుల త్రికూటాలయం ఉంది. ఇందులో విష్ణువు సూర్యుడు శివుడు ఉంటారు. మధ్యలో సూర్యుడు ఉంటాడు. ఎక్కువ ప్రాధాన్యత సూర్యుడిదే! ఇలా సూర్యుని ఆలయం ఉంది కాబట్టి అర్కవరం అనే పేరు వచ్చింది.
మా నాన్న భూస్వామి. నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. స్త్రీలకు ఆ కాలంలో బుర్ఖా పద్ధతి ఉండేది. మా చిన్నప్పుడు అంటే 1947 వరకూ బుర్ఖా పద్ధతి పాటించారు. ముఖ్యంగా ఇంటి నుండి బయటకు రావడం లేదు. అటువంటి వాతావరణం లో 1942 లో పుట్టాను నేను. తర్వాత వెంటనే కమ్యూనిస్టు ఉద్యమం వచ్చింది. దాంతో మా ఊర్లో నాకు చదువుకోడానికి అవకాశం లేకపోయింది. చిన్న స్కూల్లో అక్షరాభ్యాసం చేసి పంపే అవకాశం ఉన్న బుర్ఖా పద్ధతి ఆపింది.
మా చిన్నప్పుడు చెక్క పలకల మీదనే అక్షరాభ్యాసం చేశారు. ఆ పలక మీద రాయాలంటే చాలా శ్రమ పడవలసి వచ్చేది. బీరాకులను బొగ్గును కలిపి దంచి ఆ పసరు దానికి పూస్తేనే అక్షరం దిద్దగలిగే వాళ్ళం.
కమ్యూనిష్టులు మా ఇల్లు కూలగొట్టారు. ఆ నాయకులు మా ఊరివారే! కమ్యూనిస్టు ఆగడాలకు భయపడి మా కుటుంబం ఆంధ్రప్రాంతానికి నరసారావు పేటకు వలస పోయాము. అక్కడే 2 సంవత్సరాలు ఉన్నాము. అక్కడ వీధి బడిలోనే నా చదువు సాగింది. వారు మంచిగానే చెప్పేవారు, కానీ ఆర్థిక ఇబ్బందులుండేవి. భూస్వాములని పేరే కానీ నల్లగొండ జిల్లాలో వర్షాలు పడక పంటలు పండక పోయేవి. సాగు నీటి వసతి లేకపోయేది. చుట్టుపక్కల వర్షం పడినా మా గ్రామంలో పడకపోయేది. అలా డబ్బు కష్టాలు ఉండేవి. ఒక్కొక్కసారి భోజనానికి కూడా కష్టమయ్యేది. మా నాన్న , నాయనమ్మ ఊళ్ళో ఉండేవారు ఊర్లో ఉండి ఆమె వ్యవసాయం చేయించేది.
ఆమె నన్ను చాలా గారాబంగా చూసుకునేది.. ఎంతలా అంటే నరసరావుపేటలో నాకు మశూచి వస్తే నన్ను చూడడానికి ఇంత దూరం నుండి శ్రమపడి వచ్చింది.
అక్కడ మమ్మల్ని నైజాము వాళ్లు అనేవారు. మేము మూకీ సినిమాలు చూసే వాళ్ళము. స్టేజికి రెండు వైపులా ఇద్దరు మనుషులు నిలబడి కథను సంభాషణలను చెప్పేవారు అటువంటి సినిమా చంద్రలేఖను చూశాను. మన నిజాం సంస్థానం విలీనం అయిన తర్వాత మా ఊరికి రావాలని బయలుదేరాము కానీ, మా ఊర్లో రావి నారాయణ రెడ్డి, నర్సింహారెడ్డి మొదలైన వారు చాలామంది నాయకులు ఉండేవారు. అప్పుడే చాకలి ఐలమ్మ సంఘటన కూడా జరిగింది .అంటే ఇంకా కమ్యూనిస్టు ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకని నరసరావుపేట నుండి మా అమ్మమ్మ ఊరుకు అంటే వరంగల్ జిల్లా వెంకటాద్రి

పేటలోని 2సంవత్సరాలు ఉన్నాము అంటే 1950 వరకు అక్కడే ఉన్నాము.
మా ఊరికి పోయి వస్తుండే వారు అక్కడే వీధి బడిలో చదువుకున్నాను. కొంత కాలానికి నల్లగొండకు వచ్చాము. ఊర్లో మా ఇల్లు కూలగొట్టారు కనుక ఉండే వీలు లేకపోవడం, అలాగే మా చదువుల కోసం నల్లగొండలోనే ఉన్నాము. పిల్లలను చదివించాలనే అవగాహన అప్పుడప్పుడే కాస్త వచ్చింది. అక్కడ ప్రభుత్వ పాఠశాలలో నాలుగవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివాను. నేను చదువులో చురుకుగానే ఉండేదాన్ని. ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు మృగశిర అనే మా ప్రధానోపాధ్యాయురాలు ఉండేవారు. ఆమె అక్క చెల్లెళ్ళందరూ ఉపాధ్యాయినులే! వారికి వాళ్ళ నాన్న నక్షత్రాల పేర్లు పెట్టారు. మా ప్రధాన ఉపాధ్యాయురాలు మృగశిర మమల్ని ప్రేమగా చూసేవారు. ఆమెకు విద్యార్థులు పుస్తకాలను చదవాలనే ఆకాంక్షతో చాలా పుస్తకాలు కొనిపెట్టింది. రెండు అల్మారాలలో నీటుగా సర్ది పెట్టే వారు.
నేను ఎనిమిదో తరగతిలో ఉన్నాను కాబట్టి పుస్తకాలను విద్యార్థులకు ఇవ్వడం, వారి పేర్లు రిజిస్టర్లో రాయడం, ఏయే పుస్తకాలు ఉన్నాయో వాటిని వరుస క్రమంలో సర్దడం, అన్ని చేసే దాన్ని! ఆ పనులు చేస్తున్నప్పుడు ఆసక్తిగా అందులో ఏముందని? అవి వేటికి సంబంధించిన పుస్తకాలని? వాటిని పేర్లతో గుర్తించడం ఎలా అనీ, పరిశీలించడంతో పుస్తకాల మీద ఇష్టం ఏర్పడింది. అయితే అందులో మొగలాయి దర్బారు, బంకించందర్ నవలలు, శరత్ చంద్ర, ప్రేమ చంద్ర ,వీరి అనువాదాలన్నీ చదివాను. అలా చదవడం అలవాటైంది. సాహిత్యంతో సంబంధం ఏర్పడింది.
పదవ తరగతి పాస్ అయిన తర్వాత మా అమ్మ నాన్నలు పెళ్లి చేయాలనుకున్నారు. సరైన సంబంధం కలిసి రాలేదు. అప్పుడు నల్లగొండలో జూనియర్ కాలేజీ లేదు. అందుకని హైదరాబాద్ లో వెంకట్రామారెడ్డి కాలేజీలో చేర్పించారు. ఆ హాస్టల్ లోనే ఉండి చదువుకున్నాను. అక్కడ కూడా కాలేజీ లైబ్రరీ నుండి పుస్తకాలు తెచ్చుకొని చదవడం, మ్యాగజైన్ లో కథలు రాయడం ప్రారంభమైంది. అలా నా మొదటి కథ లావణ్య రాసాను. అలా నా చదువు M A phd.
పద్మజ:— కథ ఎందుకు రాయాలనిపించింది?
సుజాతారెడ్డి:– మా బంధువుల అమ్మాయి ఒక ఆమె ఉండేది. ఆమె భర్త మంచి వైద్యుడు, సౌమ్యుడు. పేదలకు ఉచితంగా సేవచేసేవారు. అక్కడ పేద ముస్లిమ్ కుటుంబాలు ఎక్కువ ఉండేవి. వారికి ఎనలేని సేవ చేసేవారు. ఐనా రెడ్డికులం అనే ఒకే ఒక కారణంతో రజాకార్లు ఆ డాక్టర్ ను చంపేశారు.
అతను చనిపోయాక ఆమె వితంతువుగా ఎనలేని కష్టాలు పడింది. ఆ కష్టాలు చూసి కథ రాయాలనిపించింది. అందుకే నా కథలో వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకోవాలని, పెద్దలు ఆ దిశగా ఆలోచించాలని రాశాను.
మేముండే హాస్టల్ కు గోల్కొండ పత్రిక వచ్చేది. అది చదువుతుంటే అందులో వచ్చే కథలు, కవితలు, చూసి నాకూ రాయాలనిపించి రాశాను. అలా జీవన్మృతుడు అనేది ఒక కథ అచ్చయింది.
పి యు సి అయిన తర్వాత మళ్లీ మా ఊరికి వెళ్ళిపోయాను. నల్లగొండలో డిగ్రీ కాలేజీ స్థాపించారు. నేను దాంట్లో జాయిన్ అయినాను. అప్పటికి ఇంకా సంబంధాలు కుదరలేదు.
నేను మా తమ్ముడు ఇద్దరం మాత్రమే ఉండి మెస్ లో భోజనం చేసే వాళ్ళం మా బాపు వచ్చి పోతుండేవారు. నేను బిఏ మొదటి సంవత్సరం తెలుగుతో చదివాను. అలా తెలుగు భాష మీద అభిమానం ఏర్పడింది. మా వాళ్లకేమో నన్ను డాక్టర్ చదివించాలని ఉండేది! ఆ కాలంలో ఆడపిల్లలు వైద్య విద్యనే చదవాలనుకునేవారు.
నాకు సాహిత్యం మీద అభిమానం ఏర్పడింది. అక్కడ కూడా మా గురువుగారు వెంకట నరసింహం గారు తెలుగు చాలా బాగా చెప్పేవారు. ఆముక్తమాల్యద ఇప్పటికి గుర్తున్నదంటే మా గురువుగారి బోధనే కారణం. ఒక పద్యాన్ని ఒక పీరియడ్ మొత్తం చెప్పేవారు. అలా తెలుగు భాష పైన ఆసక్తి ఏర్పడింది.
బి ఏ మొదటి సంవత్సరం పూర్తి కాగానే నాకు పెళ్లయింది. నా భర్త సంస్కృతంలో పండితులు. ఆయన సంస్కృతంలో ఎమ్మే చేశారు. మా మామగారు ఆర్య సమాజ సిద్ధాంతానికి ప్రభావితమయ్యారు. ఆయన తన కుమారులను సంస్కృతం చదివించాలని హిమాలయాలలో ఉన్న ( ) గురుకులంలో చేర్పించారు.
మాకుటుంబ స్నేహితులు విద్యాలంకార్ అనే గొప్ప నాయకుడు ఉండేవారు. ఆయన కూడా అక్కడే చదివారు. అలా వారి పరిచయంతో మా వారి గురించి తెలిసింది. మా వారి పేరు ముదిగంటి గోపాల్ రెడ్డి గారు. మొత్తం సంస్కృతంలోనే చదివి వేదాలంకార్ పట్టా పుచ్చుకున్నారు. మా వారి తమ్ముడు విద్యాలంకార పట్టా పొందారు. వేదాలంకార్ అంటే వేదాధ్యయనమే ఉండేది. విద్యాలంకార్లో మాత్రం సంస్కృతంతో పాటు హిందీ, ఇతర సబ్జెక్టులు నేర్పించేవారు.
వేదాలంకార్ పూర్తయిన తర్వాత ఎమ్మే కోసం హైదరాబాద్ వచ్చారు. ఉస్మానియాలో ఎమ్ ఎ చేశారు. మా పెళ్లి 1959 లో అయింది. యూనివర్సిటీలో తార్నాక అవతల మాకు ఒక క్వార్టర్ దొరికింది.అక్కడే కొత్త కాపురం పెట్టాము. ఉత్తర భారతదేశానికి తను చదువుకున్న గురుకులం చూపించాలని నన్ను తీసుకొని వెళ్లారు. కురుక్షేత్రం, గురుకులం, హరిద్వార్ అవతల గంగానది తీరంలో గోపాల్ రెడ్డి గారు చదివిన గురుకులం ఉన్నది. దాన్ని చూపించారు. అక్కడ సాత్వికాహారం ఇచ్చేవారు. మా వివాహం కూడా ఆర్య సమాజ పద్ధతిలో జరిగింది. ఆ పద్ధతిలో తాళి కట్టరు. కానీ మా అమ్మ నాన్న కోరడంతో ఓం అనే పథకం కట్టారు. మా వారు సంస్కృత శ్లోకాలు చక్కగా చదివేవారు. కాదంబరి చదివేవారు. దాంతో నాకు సంస్కృత భాషతో పరిచయమైంది. 1963లో పాప, 65లో బాబు పుట్టాడు.
మా వారు ఉస్మానియాలో సంస్కృతం భాషా అధ్యాపకులుగా ఉండడంతో 65లో జర్మన్ భాషా శాఖను ప్రారంభించారు. మా వారికి భాషలు నేర్చుకోవడం అంటే ఎంతో ఇష్టం ఉండేది. ఆయనకు చాలా భాషలు వచ్చు! అలా జర్మన్ భాష నేర్చుకున్నారు. మన సంస్కృత వ్యాకరణము- జర్మన్ వ్యాకరణం ఒకే తీరుగా ఉండేది. అందుకే ఆ భాషలో చక్కగా మాట్లాడేవారు. జర్మన్ ప్రొఫెసర్లు మా వారి భాషను మెచ్చుకొని, ఆయనకు ఒక స్కాలర్షిప్ ఇచ్చారు. జర్మన్ లో M A చేయడానికి అనుమతి కూడా ఇచ్చారు. ఆయన అలా వెళ్ళిన ఒక సంవత్సరం తర్వాత నేను కూడా జర్మనీ వెళ్లాను. అక్కడ టుబింగన్ యూనివర్సిటీలోని గ్రంథాలయంలో ఓరియంటల్ విభాగంలో భారతాధ్యయనం గ్రంథాలను* సబ్జెక్ట్ క్యాటలాగ్* చేయడంలో పనిచేసాను.
సంస్కృత శాఖలో ఇండాలజీ అంటే ఇండియాకు సంబంధించిన భాషలు విజ్ఞానం శాఖలో సంస్కృత భాషా బోధకులుగా ఆయన చేరారు. అభిలాష ఉన్నవారికి హిందీ కూడా చెప్పేవారు. అలా బోధకులుగా పనిచేశారు అక్కడ హెడ్ 1940 ప్రాంతంలోనే కాశి వచ్చి సంస్కృతం నేర్చుకున్నారట. పాణిని వ్యాకరణం మరియు సంస్కృతం మాట్లాడటం బాగా వచ్చు.
అక్కడ భారత దేశ సంబంధ భాషా శాఖలో నన్ను నియమించారు. గ్రంథాలయంలో విషయపరంగా మూడు భాషలకు సంబంధించిన పుస్తకాలను జాబితా చేయడం నా పని. అక్కడ ఇరానీ భాష కూడా ఉండేది. జర్మన్ మహిళ ఉండేది. ఈజిప్టాలజీ అంటే ఈ ప్రాచీన ఈజిప్టు భాష ఉండేది. అందులో ఒక విద్యార్థి ఉండేవాడు. నన్ను సంస్కృత భాషకు నియమించారు. అలా సంస్కృత పుస్తకాలను తిరిగేసి చదవడం వల్ల ఆ పుస్తకం ఏ విషయానికి సంబంధించినదని, వివరాలన్నీ రాసేదాన్ని! అలా సంస్కృత భాషతో పరిచయం ఏర్పడింది. మనకు ఇష్టం ఉంటే లైబ్రరీకి వెళ్లి చదువుకోవచ్చు కూడా! అలా అక్కడ సంస్కృత పుస్తకాలను చదివేదాన్ని. సంస్కృత సాహిత్య చరిత్రల అనువాదాలు ( ఇంగ్లీష్,జర్మన్, ఫ్రెంచ్ వాళ్ళు అనువదించినవి) అక్కడ ఉంటే చదివే దాన్ని. వాటి మీద నోట్స్ తయారు చేసేదాన్ని. అక్కడ ఉన్న మూడు సంవత్సరాలు అలానే చాలా చదివాను. భారతదేశం వచ్చిన తర్వాత మా వారు ఉస్మానియాలో చేరారు. నేను 1970లో రెడ్డి కాలేజీలో అధ్యాపకురాలిగా చేరాను. 2000 సం.లో పదవి విరమణ పొందాను. అధ్యాపకురాలుగా పనిచేస్తున్నప్పుడే సంస్కృత సాహిత్య చరిత్ర రాయాలని అభిలాష ఉండేది.
పద్మజ :—– మీరు రచించిన రచనల వివరాలు ఏంటో చెప్పండమ్మా!
సుజాతారెడ్డి:– నేను రాసిన వాటిలో అచ్చైనవి.
సాహిత్య విమర్శ గ్రంధాలు.
1 – మను- వసు చరిత్రల తులినాత్మక పరిశీలనం : 1981
2 – శ్రీనాధుని కవితా సౌందర్యం : 1982
3 – తెలుగు నవలానుశీలనం : 1991
4 – వేమన- నాథ సంప్రదాయం : 1993
5 – రస చర్చ – ఆధునికత : 2010
6 – అద్యతన దృష్టి : 2014
నవలలు
7 – మలుపు తిరిగిన రథచక్రాలు : 1994
8 – సంకెళ్లు తెగాయి : 1994
9 – ఆకాశంలో విభజన రేఖ ల్లేవు : 1995
కథా సంపుటాలు
10 – విస్సుర్రాయి : 1998
11 – మింగుతున్న పట్నం : 2001
12 – వ్యాపార మృగం : 2005
13 – మరో మార్క్స్ పుట్టాలి : 2010
* సాహిత్య చరిత్రలు*
14 – ఆంధ్రుల సంస్కృతి- సాహిత్య చరిత్ర
( బిఏ తెలుగు సాహిత్య విద్యార్థులకు)
(పాఠ్యపుస్తకం) తెలుగు అకాడమీ ప్రచరణ
1989
15 – చారిత్రక, సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర : 1996 రెండవ ముద్రణ : 2004 16 – సంస్కృత సాహిత్య చరిత్ర భర్త ఆచార్య గోపాల్ రెడ్డితో కలిసి రచించింది.
తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ 1986 17 : (ఇంతవరకు ఆరు ముద్రణలందుకొని చాలా ప్రసిద్ధి చెందిన గ్రంథం)
18 – తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర
19 – నైలునది నాగరికత : 2006 (ఈజిప్ట్ యాత్ర
కథనం) అనుబంధం లద్దాక్ యాత్ర కథనం
20 – అద్భుత చైనా యాత్రా కథనం
21 – వ్యాపార సంస్కృతిలో స్త్రీ చైతన్యం : 2002
అనుబంధం తెలుగు సాహిత్యం మానవ
సంబంధాలు పౌరాణిక నేపథ్యం
వ్యాస సంకలనం :— ముద్దెర ( 2005 )
( తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాద సాహిత్య
విమర్శ వ్యాసాలు)
ఆత్మకథ : ముసురు — 2010 (అనుభవాలు జ్ఞాపకాలు ఆలోచనలు) సంపాదకత్వం : తెలంగాణ తొలి తరం కథలు
2002
తొలినాటి కథలు, 2005 ( తెలంగాణ తొలితరం కథలో రెండో భాగం)
జైలు లోపల (వట్టికోట ఆళ్వారు స్వామి కథలు)
2009
నూరేళ్ల తెలుగు కథలు: 2011
( తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ ) తెలంగాణలో 1912 నుంచి 56 మధ్యకాలంలో రచింపపబడిన విస్తృతమైన కథలను సేకరించి పరిశోధనాత్మకమైన పీఠికతో
తెలంగాణ తొలి తరం కథలు 2002లో ప్రచురించారు. ఎన్నో వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు, కథలు పత్రికల్లో ప్రచురింపబడినాయి.
పద్మజ:— సంస్కృత సాహిత్య చరిత్ర రాయాలని ఎందుకనిపించింది, దాని నేపథ్యం ఏమిటి?
సుజాతారెడ్డి:– ఇంతకుముందే చెప్పాను కదా! నేను జర్మనీలో ఉన్నప్పుడు నోట్స్ తయారు చేసుకున్నానని, దాన్ని పుస్తక రూపకంగా తేవాలని సంకల్పం కలిగింది. తెలుగులో సరైన సాహిత్య చరిత్ర లేదని తెలుగులో రాయడం మొదలుపెట్టాను. దానికి నా భర్త గోపాల్ రెడ్డి గారి సహకారంతో అందింది. రాసిన తర్వాత చూస్తే ప్రింట్ లో 1000 పేజీలు వచ్చేలా ఉంది. ఇంత పెద్ద పుస్తకాన్ని నా సొంత డబ్బుతో వేయలేను. అందులో పుస్తక ముద్రణలో అనుభవం లేదు.
ఆ కాలంలో ఎక్కువమంది మహిళా రచయిత్రులు నవలలు రాసేవారు… అవి వస్తున్నాయి 60- 70 ఇలా మధ్య రచయిత్రుల యుగం. నాకు వారి నవలల మీద అవగాహన లేదు. నేను నవలలు రాయాలనుకోలేదు. ఒకరి సలహా మేరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ద్వారా ముద్రించాలని మేము అడిగితే సరేనన్నారు. అప్పుడే తెలుగు యూనివర్సిటీని ఎన్టి రామారావు గారు స్థాపించారు. ఆ యూనివర్సిటీ వారు ఆ పుస్తకాన్ని ముద్రించారు. ఈ సాహిత్య సంస్కృత చరిత్ర 7, 8 ముద్రణలు వచ్చాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని యూనివర్సిటీల్లో కూడా ఈ పుస్తకాన్ని పాఠ్యాంశంగా తీసుకున్నారు. అందుకే అన్ని ముద్రణలకు నోచుకున్నది.
పద్మజ:— తెలంగాణ పదకోశం రాశారు కదా! అది రాయడానికి నేపధ్యం ?
సుజాతారెడ్డి:– అచ్చమైన తెలంగాణ శబ్దాలను తీసుకొని ఒక నిఘంటువును తయారు చేయాలనుకున్నాను. మన తెలంగాణ భాషను రాబోయే తరాలకు అందజేయాలన్నదే ముఖ్య ఆశయం. అంతేకాదు!ఈ తరం వారికి పరిచయం కూడా అవుతుందని నా భావన. ఎందుకంటే తెలంగాణ పదాలు వాడుకలో లేకుండా అంతరించిపోతున్నాయి. కొన్ని పదాలున్నా వాటి అర్థం చాలా మందికి తెలియడం లేదు. ఈ వాడుక పదాలను బతికించుకోవాలని రాసాను. తెలంగాణ సాహిత్యమని చెప్పి, రాసేటప్పుడు తెలంగాణేతర పదాలను వాడకూడదని నా ఉద్ద్యేశ్యం. తెలంగాణ నిఘంటువులలోని పదాలను రచయితలు, తర్వాత తరం వారు చక్కగా వాడారు. తెలంగాణ భాష -యాస -పలుకుబడులు అందరికీ తెలియాలి! లేకపోతే అవి క్రమంగా అంతరించి పోతాయి. ఇప్పుడు సినిమాల్లో కూడా తెలంగాణ భాషను- యాసను వాడుతున్నారు.
పద్మజ:—- మీరు పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు కదా! ఏ విషయం మీద పరిశోధన చేశారు? అంశం ఏమిటి?
సుజాతారెడ్డి:— నేను పీహెచ్డీ చేయాలని MA లో చేరడం జరిగింది. మను- వసు చరిత్రల తులనాత్మక పరిశీలన మీద పరిశోధన చేయమని దివాకర్ల వెంకటావధాని గారు నాకు అంశాన్ని ఇచ్చారు. మీరు చక్కగా చేయగలరని కూడా అన్నారు. నేను దానికోసం చదువుతుంటే అంశం చాలా ఇష్టమైంది. తొందరగానే పరిశోధనలు ముగించాను. సిద్ధాంత గ్రంధాన్ని ముద్రించుకున్నాను కూడా!
పద్మజ:– అమ్మా! ఇక మీ రచనల గురించి మింగుతున్న పట్టణం విసుర్రాయి వ్యాపార మృగం ఈ కథల వెనుక తెలంగాణ గ్రామీణ జీవనశైలి కనపడుతుంది అలాగే నిత్య కల్లోలం ఆర్థిక విధానాల ఫలితాలు కనపడతాయి. ఈ కథల గురించిచెప్పండి!
సుజాతారెడ్డి:— మింగుతున్న పట్టణంలో క్రమంగా పట్టణాలు విస్తరించి నగరీకరణలో భాగంగా చుట్టుపక్కల పల్లెలు నగరంలో కలసి , వాటి రూపురేఖలు మారిపోయి, ఒకవేళ వారు వ్యవసాయ దారులైతే పొలాలు కోల్పోయి, పంటలు పండించే వీలులేక నష్టపోవడం… అంటే పల్లెలను లేదా గ్రామీణ వాతావరణం, గ్రామీణ జీవనాలను లేకుండా చేస్తున్నదని నాభావం. చెరువు మింగేస్తున్నదంటే భూమిని తనలో కలుపుకుంటున్నదని అలాగే పట్టణం పల్లెలను తనలో కలుపుకుంటున్నది. పల్లెల స్వరూపం లేకుండా చేస్తున్నదని, పట్టణీకరణ ప్రభావం గురించి రాసాను. ఎందుకంటే పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు కదా! అవి కనుమరుగౌతున్నాయనే బాధే నన్ను రాయించింది.
ఇక విసుర్రాయి కథలో స్త్రీల అణచివేతల గురించి రాసాను. కుటుంబంలో వారి స్థానాన్ని వివరించాను. స్త్రీల సమస్యలే చర్చించాను. వారికంటూ ఉనికి లేదు. వారి శ్రమను దోచుకునే వైనం చిత్రించాను. హక్కులు లేవు. దోపిడికి గురైన విషయాలు రాసాను.
ఇక వ్యాపార మృగం కథలో వ్యాపార సంస్కృతిలో స్త్రీలు అనే అంశంతో విడిగా ఒక పుస్తకం రాశాను. అదీ కాక వ్యాపార మృగంలో వ్యాపార సంస్కృతి ఎలా వ్యాపిస్తున్నది… ప్రతిదాన్ని వ్యాపార ధోరణిలో చూడడం, మానవత్వం లేకపోవడం ,డబ్బు మీద వ్యామోహం ఎక్కువై, నైతిక విలువలు నశించిపోయిన వైనం రాశాను. మానవ సంబంధాలు నశిస్తున్నాయని చెప్పడానికి ఈ ఇతివృత్తాన్ని ఎన్నుకున్నాను. అలాగే ప్రపంచీకరణం మీద నేను చేసిన ప్రసంగాలను పుస్తక రూపంగా వేసుకున్నాను. వస్తు సంస్కృతి కుటుంబాలను ముఖ్యంగా స్త్రీలు ఎలా బలైపోతున్నారని రాసి ముద్రించాను.
వ్యాపార మృగంలో… ప్రపంచీకరణ గురించి రాసాను.
ఈ సమస్యలను పత్రికలలో రేడియోలలో చదివి వింటున్నాము తప్ప ఏ చర్యలూ తీసుకోలేదు. భూములను సేకరించడం, అప్పుడు రైతులకు డబ్బు ఇవ్వడానికి వారి పేరు మీద ఆ భూమి లేకపోవడం, ముఖ్యంగా తెలంగాణలో
భూ వివరాల రికార్డులు సరిగా లేవు. చాలామంది భూములు ముస్లింల పేరు మీదనే ఉన్నాయి. రైతులు కౌలు దారులుగా ఉండి వ్యవసాయం చేసేవారు. వారి పేర్లు రికార్డుల్లో లేవు. కొంతమంది ముసల్మాన్ లో పాకిస్తాన్ కి వెళ్ళిపోతే ఆ భూములు కూడా కౌలు మీదనే నడుస్తున్నాయి. ఎప్పుడైతే భూసేకరణ జరిగిందో ఈ రైతులకు ఏ ఆధారం లేక, పరిహారం దొరకక… చాలా కష్టపడ్డారు. ఆ సమస్యల మీద గుడిసెలు, గుడిసెలు అనే కథ రాశాను. సేకరణ చేసినప్పుడు వారికి చెక్కులు ఇచ్చారు. కానీ ఆ రైతులకు బ్యాంక్ అకౌంట్లు లేక ఆ డబ్బులు వారికి అందలేదు. మధ్య దళారీలు దోచుకున్నారు. అటువంటి సమస్యలను రాశాను. భూమి తగాదాల గురించి సమాజాన్ని బాగా పరిశీలించాను.
పద్మజ:– నిత్య కల్లోలం ఏమిటి?
సుజాతారెడ్డి :– జీవితం అంటే ఎలా కల్లోలంగా మారుతున్నది? ఆర్థిక, రాజకీయ, సామాజికంగా ఎన్ని మార్పులు లోనవుతున్నాయనీ, దాని ప్రభావం జీవితాల మీద ఎలా ఉందన్నదే ఈ నిత్య కల్లోలం ఇతివృత్తం.
పద్మజ:—- మరో మార్క్స్ పుట్టాలని మీకు ఎందుకు అనిపించింది?
సుజాతా రెడ్డి:– మార్క్స్ సిద్ధాంతాలు, ఆర్థిక సంస్కరణలు, పునః సంస్కరణలు రావాలని, సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగాలని, అందరూ సమానంగా చూడబడాలని, సమానత్వం రావాలని రాశాను.
పద్మజ:– రాజకీయాల గురించి చక్కటి సామాజికాంశాన్ని తెలిపే యఙ్ఞబలి మన రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో తెలిపే కథ దీన్ని వివరించండి!
సుజాతారెడ్డి:— నేను సమాజాన్ని పరిశీలించి, అందులోని సమస్యలను లేవనెత్తుతూ జరిగిన వాస్తవాలను యధాతధంగా కాకుండా, కొన్ని కల్పనలను సాహిత్య పరంగా ఎట్లా చెప్పవచ్చు? అని వివరించే ప్రయత్నం చేశాను. రాజకీయాలు ఎలా బ్రష్టు పట్టిపోయాయనేది చెప్పాలనే ప్రయత్నం చేశాను. ఇందులో రాజకీయాల కోసం ఎంతటి క్రూరమైన పనులైనా చేయడానికి సిద్ధంగా ఉండి, మనుషులు ఎంతగా దిగజారిపోయారనే విషయం ఆయా పాత్రల ద్వారా చెప్పాను. ఇది యదార్ధంగా జరిగింది అని చెప్పను!
పద్మజ:– నూరేండ్ల తెలుగు కథలు (కథా శతాబ్దం) జరుపుకున్న సందర్భంలో వేసిన సంకలనం గురించి చెప్పండి! సంకలనం వేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది?
సుజాతారెడ్డి :— తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఒక ప్రచురణ కార్యక్రమం చేయాలని తలపెట్టారు. అయితే నేను నూరేళ్ల కథలు ప్రచురిస్తే బాగుంటుందని సూచించాను. వైస్ ఛాన్స్లర్ గారు సరేనని ఒక సమావేశం ఏర్పాటు చేసి రచయిత(త్రు) లను ఆహ్వానించారు. ఎలా ముద్రిస్తే బాగుంటుందని వారిని సలహా కోరారు. నూరంటే నూరు కథలే కాదు! ఎక్కువ కూడా వేయవచ్చు అని వారంటే అలానే నూటికి పైనే కథలు ముద్రించారు.
కథా శతాబ్ది ఉత్సవం కథా ప్రక్రియను గుర్తించడమే కాకుండా, కథను బలోపేతం చేయడమే ఉద్దేశంగా చేశారు. అందరూ ఏమన్నారంటే తెలంగాణ నుండి అసలు కథలే రావు…. లేవు… అనీ వచ్చిన కథలు కూడా 1960లో నక్సలైట్ ఉద్యమం జరుగుతున్నప్పుడే కథలు వచ్చాయి కానీ అంతకుముందు కథలే లేవు అని ఒక దుష్ప్రచారం ఉండేది!
అలా కాదు! తెలంగాణలో ఎప్పటినుండో కథలున్నాయి…. అని అందరూ అంటుండే వాళ్ళు కానీ ఎవరు ముద్రణలోనూ చేతివ్రాతలలోను దాన్ని చూపలేదు. ఫలానా రచయితలు రాశారని చెప్పలేదు.
సంగిశెట్టి శ్రీనివాసు కొన్ని కథలు సంపాదించారు (సేకరించారు) వాటిని ఎవరు పట్టించుకోలేదు. ఒకటి మాత్రం మాడపాటి హనుమంతరావు గారి కథ 1912లో వచ్చింది అని అనేవారు అయితే నేను ఏం చేశానంటే తెలంగాణ తొలి తరం గాథలు అనే పేరుతో కొన్ని కథలు సేకరించాను. అప్పుడే నాకు ఒద్దిరాజు సోదరుల గురించి తెలిసింది. ఎంతో ఆశ్చర్య వేసింది. ఇన్ని రచనలు చేసినా, ఇంత సాహిత్య కృషి చేసినా వీరి గురించి ఎవరూ మాట్లాడలేదు. ఎక్కడ ప్రచారమే లేదు! సోదరుల పేర్లు కూడా ఎవరికి తెలియవు. ఎందుకని? అని నేననుకొని వారి కథ లండన్ విద్యార్థి కథను ఎన్నుకున్నాను. నేను ఎన్నో లైబ్రరీలు తిరిగాను! వేమన గ్రంథాలయం వెళ్ళినప్పుడు సోదరులు ఎన్నో రచనలు చేశారని, నవలలు రాసారని తెలిసింది. ఆ సంకలనానికి ముందుమాటలో నేను అదే విషయం చెప్పాను.
అయితే పుస్తక ఆవిష్కరణ అయిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు. ఒద్దిరాజు సోదరులు ఇన్ని రచనలు చేస్తే వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదని అప్పుడనుకున్నారు.
వారి కథలను ఈ సంకలనంలో చేర్చాను. లండన్ విద్యార్థి సంకలనంలో రెండవ కథ! ఒద్దిరాజు రాఘవ రంగారావు గారు 1927లో రచించారు.
అంతకుముందు మాడపాటి హనుమంతరావు కథ మొదటిది అని చెప్పుకుంటున్నాం కదా! అయినా కూడా ఆ కాలంలో ఒద్దిరాజు సోదరులు కథలు రాశారని తెలిసి ఆశ్చర్యపోయాను. 1928లో ఒద్దిరాజు సీతారామచంద్రరావు రాసిన రక్త మూల్యము అనే కథ ఈ రెండు ఆ సంకలనంలో వేసాము. తెలుగు నేలలో నవలలు రాకముందే అనువాద నవల వారే మొదట రాశారు. ఒద్దిరాజు సోదరులు వ్యాసాలు కూడా రాశారని పరిచయంలో రాశాను. వేదిక మీద మాట్లాడితే కూడా కొంచెం ఆశ్చర్యం పోయారు. కొంచెం గర్వంగా కూడా ఫీలయ్యాము. తెలంగాణ నుండి ఆ కాలంలోనే కథలు రాసారా! అని అనుకున్నారు. ఒద్దిరాజు సోదరులు పూర్తి సాహిత్యం గురించి, వాళ్ళని గురించి మనం మాట్లాడాలనీ, తెలంగాణలో వాళ్ళ సాహిత్య ప్రచారానికి ఎంతో కృషి చేయాలని అనుకున్నాము. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత నాకు తెలిసింది కొండపల్లి నిహారిణి వారి సాహిత్యం మీద పరిశోధన చేయాలనుకుంటున్నదని తెలిసింది. ఆమె పరిశోధన గ్రంథం కూడా వేసింది. క్రమంగా సోదరుల సాహిత్యానికి గుర్తింపు వచ్చింది.
పీ.వీ నరసింహారావు గారు రెండు మూడు వేదికల మీద ప్రసంగిస్తూ ఒద్దిరాజు సోదరులు సాహితీ కృషి గురించి చాలాగొప్పగా చెప్పారు.
మొదటి నుండి గమనిస్తే తెలంగాణ ఉద్యమ నవలలు వచ్చాయి. వట్టికోట ఆళ్వారుస్వామి నవల ప్రజలమనిషి వచ్చింది. తర్వాత ఈ రెండవ ఉద్యమానికి సంబంధించిన నవలలు వచ్చాయి.
పద్మజ:— మీరు రాసిన నవలల విషయం గురించి వివరించండి!
సుజాతారెడ్డి:– నేను రాసిన నవలలు.. మలుపు తిరిగిన రథచక్రాలు, సంకెళ్లు తెగయి, ఆకాశంలో విభజన రేఖలు లేవు అనే నవలు రాశాను.
మొదటి నవల మలుపు తిరిగిన రథచక్రాలు నవల రాయడానికి మా ఊరు నేపథ్యమే కారణం… కమ్యూనిస్టుల మూమెంట్ ; భూముల ఆక్రమణ; భూస్వాములను చంపి వేయడం ; కమ్యూనిజం పేరుతో లోకల్ గుండాల ,రౌడీల ఆగడాలు ఎక్కువ కావడం; కుల వృత్తులు చెల్లా చెదురై పోవడం; స్వాతంత్రం వచ్చినా కమ్యూనిజం అనే దృష్టితోటే రాజకీయాలు సాగడం ఈ దృష్టితో మలుపు తిరిగిన రథచక్రాలు అనే నవల రాశాను. ఇప్పుడు ఆ కమ్యూనిస్టు దృష్టి అవసరం లేదు! ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలి! సమానత్వం గురించి ఆలోచించాలి! కానీ కమ్యూనిస్టు సిద్ధాంతాలు మనం పాటించక్కర్లేదని ఆ పేరు పెట్టాను.
సంకెళ్ళు తెగాయి నవల కొంచెం బాధతోనే రాశాను. స్వాతంత్రం వచ్చి ఇనేళ్లయింది ఇంకా అసమానతలు; ఆర్థిక ఇబ్బందులు: వర్గ బేధాలు ఉండడం బాధనిపించింది. ఉదాహరణకు ఒక మంగలి అతని కొడుకు పెద్ద చదువులు చదువినా, కాలేజీలో అతన్ని వేధించడం, రైల్లో ప్రయాణించినప్పుడు పెద్దవారు తాము సీట్లలో కూర్చొని వాళ్లను సామాను తెమ్మని, అటు పెట్టు! ఇటుతెమ్మని అనడం, వారి పక్కన కూర్చోబెట్టుకోకపోవడం, సమ భావం లేకుండా ఉండడం; వాళ్ళని ఇంకా సేవాభావంతోనే చూడడం బాధ కలిగించి అలా ఉండొద్దని రాసిన నవలనే సంకెళ్లు తెగాయి నవల.
స్త్రీవాదులు ఆకాశంలో విభజన రేఖ ఉందంటారు. అది ఇంగ్లీషులో ఉంది. తెలుగులో ఆడ- మగ బేధాలు ఉన్నాయని అంటారు నేనేమో ఆకాశంలో విభజన రేఖలు లేవని రాశాను. ఏ దృష్టితో అంటే…? సమాజ బాధ్యతలు వారికున్నాయి అయితే స్త్రీలు కూడా అభివృద్ధి చెందాలి! వాళ్లకు కూడా స్వతంత్రులుగా జీవించాలి! అవన్నీ కావాలంటే మగవాళ్ళ సహకారం అనేది అవసరము…. అనే దృష్టితో విభజన రేఖలు లేవని చెప్పాను. ఒకరికొకరి సహకారం ఉండాలనీ, ఉంటేనే ఆడవాళ్ళు ఎంత గొప్ప పనులైనా చేయగలుగుతారని నేను నమ్ముతాను!
నేను స్త్రీ వాదిని కాను! ఏదైతే మనకు పాశ్చాత్య దేశాల నుండి వచ్చిందో ఆ స్త్రీవాద దృక్పథం నాకు లేదు. చర్చలంటూ పెద్దగా జరుగలేదు కానీ, విమర్శలొచ్చాయి. ఆ కాలంలో జరిగిన సభల్లో ఇలా రాసిందేమిటని? కొంచెం ఘాటుగానే ఆ విషయాన్ని పదేపదే ప్రస్తావించారట! కానీ మృణాళిని మాత్రం చాలా బాగుందని, నిజమే కదా! పురుషుల సహకారంతోనే స్త్రీ స్వాతంత్య్రము, ఆమెకో స్వభావము ఏర్పడుతుందని, అది ప్రకటించడానికి సాధ్యమౌతుందని అంగీకరించింది.
చాలామంది ఇలా ఎందుకు ఏదో ఒక స్త్రీవాదమో? లేక పురుష వాదమో రాయస్తే సరిపోయేదికదా!? ఈ మధ్యే మార్గం రచించారని అన్నారు. కొంతమంది చాలా బాగా ఉందని ప్రశంసించారు.
వాస్తవికతను గమనిస్తూ ఏ వాదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా…ఏ వాదాల వైపు పోకుండా స్త్రీలకు జరిగే అన్యాయాన్ని చెప్పాను. పురుషాహంకారంతోనే స్త్రీలు కష్టపడ్డారని కొందరుంటారు. అగౌరవం కూడా అని పురుషుల మీద ద్వేషం పెంచుకోవడం, శత్రువుగా భావించడం, దుష్టుడనడం, శత్రువు అని అనడం, అన్నింటికీ వారినే బాధ్యులు చేయడం నాకు బాగనిపించలేదు! అందుకే అంగీకరించలేదు.
అలా అంటే ఆడవాళ్ళలో చెడ్డవారు లేరా ?
వారు మగవారిని హింసించడం లేదా? పురుషుల దగ్గర డబ్బు లాగే వారు లేరా? పురుషులను అణిచివేసే వారు కూడా ఉన్నారు. అదే విషయం నవలలో చెప్పాను! అంతే కాదు పురుషులు మారాలి! వారు మారితేనే సమస్యలు చాలా వరకు తగ్గి మహిళలు ఎన్నో విజయాలను సాధిస్తారని ముగించాను.
పద్మజ:— మీ రచనల మీద వచ్చిన సిద్ధాంత గ్రంథాల గురించి తెలుపుతారా?
సుజాతారెడ్డి:— నా రచనల మీద మూడు సిద్ధాంత గ్రంథాలు వెలబడ్డాయి. మూడు ఎంఫిల్ వచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీలో త్రివేణి అనే అమ్మాయి పరిశోధన చేసింది. నేను రాసిన కథల మీద పద్మ అనే అమ్మాయి సిద్ధాంత గ్రంథం రాసింది. ఇంకొక ఆమె వేంకటేశ్వర యూనివర్సిటీలో కూడా కథల మీద పరిశోధన చేశారు. ఇక్కడ ఎంఫిల్ చేసినారు. ఇద్దరు మహిళా కళాశాలలో ఒక ఎంఫిల్, ఒక phd పట్టా తీసుకున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఒకరిద్దరు ఎంఫిల్ చేశారు.
పద్మజ:—- విమర్శ గ్రంథాల గురించి వివరించండి!
సుజాతారెడ్డి:— మావారు ఊరికే కాదంబరి చదువుతూ ఉండేవారు. కాదంబరి కథతో వేరే కథలను పోల్చి రాశాను.
ఆంధ్రప్రదేశ్ అకాడమీ వారు కాదంబరి మీద విమర్శ గ్రంధాలు రాసి సమర్పించండి అని ఒక ప్రకటన చేశారు. అప్పుడు మేమిద్దరం భార్యాభర్తలం రాశాము. మరో సంస్కృత అధ్యాపకురాలు కూడా రాసింది. అయితే ఆమెకే అవకాశం ఇచ్చారు.
నేను వేమన మీద రాసిన విమర్శ గ్రంథం చాలా పేరుపొందింది. వేమన -నాథ సంప్రదాయం అని రాశాను శ్రీశైలం ప్రాంతంలోనే బౌద్ధమత ప్రభావంతో ప్రారంభమైంది. మొదట ఉత్తర భారత దేశంలో బాగా ప్రచారం పొందింది. తర్వాత దక్షిణ ప్రాంతానికి వ్యాపించింది. నాధ సంప్రదాయం అంటే పూజలు చేయరు! క్షేత్రాలను దర్శించడం, నదీ స్నానాలు చేస్తే పుణ్యం వస్తుందనే మాటను నమ్మరు. నాధ సంప్రదాయంలో 9 మంది గురువులు ఉన్నారు. నాధ సంప్రదాయంలో భావాలు వేమనలో ఎక్కువగా కనిపిస్తాయి. రాముడు దేవుడెలా అయ్యాడని ప్రశ్నిస్తాడు వేమన. కంసాలి వారిలో నాధ సంప్రదాయం అభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. వీరబ్రహ్మేంద్రస్వామికి కూడా నాధ సంప్రదాయం అభిప్రాయం ఉండేది. ఇక్కడ బ్రాహ్మణ కుటుంబాలలో అచల సంప్రదాయమని వచ్చింది. ఆంధ్రాలో నాధ సంప్రదాయం బాగా విస్తరించింది. నవనాధులు అనే కావ్యం కూడా ఉంది.
వేమనలో ఎక్కువ ఈ అభిప్రాయాలు కనపడతాయి వేమన పేరు కూడా వేప చెట్టుతో వేమన వచ్చిందని పేరు గురించి రకరకాలుగా చర్చలు చేశారు. అనంతశర్మ గారి దగ్గర నుండి ఆ చర్చ నడిచింది.
వేమన పేరు ఏమిటి అని కాసింత పరిశోధన చేసి, నేనేం చెప్పానంటే సంస్కృతంలో భీమన అనే పేరు ఏదైతే ఉందో అది శివుని పేరు. భీమన కాస్త ప్రజల నోటపడి పలుకుబడులలో మారి వీమన… అయిందని దానికి కూడా ఉదాహరణ చూపించాను. ఎలా అంటే కుషాణ రాజుల్లో ఒకరి పేరు వీమ- వీమ పేరుతో నాణెం కూడా విడుదల చేశారు. భీమ అంటే శివుడు అని అర్థం ఉంది. అదొక విగ్రహం కూడా ఉంది. వీమ అంటే భీమ అని అర్థం కనపడుతుంది. తమిళనాడులో కొన్ని ప్రాంతాలలో శాసనాలలో కూడా భీమనకు బదులు వీమన అని రాసి ఉందని నిరూపించాను.
పద్మజ:—- చరిత్ర రాయడం అంటే ఆషామాషీ కాదు !రచయిత్రిగా ఆ కాలానికి పయనించాల్సిందే! ఆ కాలపు ప్రభావం సాహిత్య క్రమపరిణామాన్ని ఎలా బేరీజు వేయగలిగారు? కాలంతో పాటు ఎన్నో మార్పులు జరుగుతాయి కదా! పూర్వకాలానికి ఎలా పయనించారు?
సుజాతారెడ్డి :— ఎలా సాధ్యమైందంటే నేను విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఎక్కువ సాహిత్య చరిత్రనే బోధించాను. అందులోనూ నాకు చరిత్ర అంటే చాలా ఇష్టమైన అంశం. చరిత్ర గ్రంథాలు చాలా చదువుతాను. అటు బోధించడం, ఇటు అధ్యయనం చేయడము రెండు రకాల నాలో పునాది పడింది. అందుకే తెలుగు సాహిత్య చరిత్ర మంచిగా రాయాలని అనుకొని రాసాను. ఆదికాలంనుండి తెలుగు భాషా చరిత్ర మనకు తెలినప్పటినుండి తీసుకున్నాను. నాణేల మీద దొరికిన సమాచారం సేకరించాను.
నాగబు అనే శాసన లిపితో అప్పటి నుండి తెలుగు మొదలైందనే వాదనను ఖండిస్తాను. ఎందుకంటే నాగ శబ్దం మొదటిది కాదు. మనకు తెలంగాణలో ఏదైతో నాణెం ఉందో దానిమీద తెలుగు పేర్లు కనిపిస్తాయి. నాగబు ప్రాచీనం కాదు! నాణేలమీది పదాలే ప్రాచీనం.
నాగబు అనే దానిలో నాగ సంస్కృతమే! బు ఒక్కటే తెలుగు ప్రత్యయము అని చెప్తున్నారు. బు అనే ఒక్క తెలుగులో ఉన్నది అంటున్నారు.బు అనేది ప్రత్యయం కానే కాదు! నాగబుధిక అనేది ఒక పేరు. చివరి అక్షరం కాలక్రమేణ వాతావరణ ప్రభావంతో కనుమరుగై పోయి, కేవలం నాగబు అనేవే కనిపించాయి. పరిశీలకులు నాగబు మొదటి తెలుగు పదం అనుకున్నారు. నాణేల మీద కొన్ని పేర్లు మనకు కనబడతాయి. వాటి ఆధారంతో చెప్పాను.
పద్మజ :— అలాగే కాదంబరి పరిశీలనం అనేది కష్టమైన విషయం కదా? కథలో కథ… కథలో- కథ మాకు చదవడానికే కష్టమైంది. మీరు విమర్శ చేసారంటే ఈ విషయంలో మహిళల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదములు...
పద్మజ:– విమర్శ గురించి మీదైన బాణీ ఏదైనా ఉందా?
సుజాతారెడ్డి :— సాహిత్య విమర్శ లో నేను రస సిద్ధాంతము రస చర్చ, ఆధునికత అని ఒక పుస్తకంరాసాను. ప్రాచీన కాలంలో భరతుడు ప్రతిపాదించిన రస సిద్ధాంతాన్ని తీసుకుని కొత్త విశ్లేషణ చేస్తూ..లేదా ఉన్నదాన్ని ఉన్నట్టు విశ్లేషణ చేస్తూ ఈ నాటి నవలకు కూడా రససిద్ధాంతాన్ని ఆపాదించుకోవచ్చు! అని కొత్తగా చెప్పాను. ఐతే దాన్ని ఆధునిక విద్యార్థులు కానీ ఎవరైనా phd విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఈ భావాన్ని తీసుకోవచ్చు రస సిద్ధాంత చర్చను వాడుకోవచ్చు.
విమర్శ గ్రంథాలు రాయడానికి ఒక లక్ష్యం ఉంటుంది కదా! సామాన్యంగా విమర్శ ఎలా రాస్తారంటే ఒక కావ్యాన్ని లేక గ్రంథాన్ని, ఒక పుస్తకాన్నో తీసుకొని, అందులో వస్తువు ఏమిటీ? భాష ఎలా ఉంది? భావప్రకటన ఎలా ఉంది? మొదలైన అంశాల మీద రాస్తుంటారు. దాన్ని విశ్లేషణ చేస్తుంటారు. అలా కాకుండా కొత్త విషయాన్ని చెప్పడమనేది చాలా తక్కువ జరుగుతుంది. ఏంటి నీ పోల్చి చెప్పే విధానం కూడా ఉంటుంది మను వసూ చరిత్ర తులనాత్మకత అని రాసాను కదా! అది పోల్చే పద్దతి లేదా నవలలను తులనాత్మక పరిశీలన చేయడం కూడా ఉంటుంది ఇలా చేసినప్పుడు సాహిత్య మీద ప్రభావం ఉండదు కానీ ఏదైనా కొత్త విషయాన్ని చెప్పినప్పుడు ప్రభావం ఉంటుంది అలాంటివి తక్కువ ఆవశ్యకత విషయానికి వస్తే ఆ గ్రంథాలను గురించి తెలుసుకోవడం వాటిని లోతుగా అధ్యయనం చేయడం ఇంకా ఆనాటికి ఈనాటికి సామాజిక చారిత్రిక భూమి ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి.
పద్మజ:– సాహిత్య చరిత్ర గ్రంథం రాయడానికి ఆ కాలం నాటికి మీరు పయనించి ఆ కాలపు ప్రభావం, సాహిత్య క్రమ పరిణామాన్ని ఎలా గుదిగుచ్చి గ్రంథంగా నిక్షిప్తం చేశారు ఆ వివరాలు చెప్పండి!
సుజాతారెడ్డి :—– అప్పటికి ఇంకా తెలంగాణ రాలేదు. అందుకని సాధారణంగా తెలుగు సాహిత్య చరిత్ర*ను రాశాను. తెలంగాణ వచ్చిన తర్వాత *తెలంగాణ సాహిత్య చరిత్ర రాశాను.
ఈ పుస్తకాన్ని తెలుగు అకాడమీ వారికి పునర్ముద్రణ చేయమని సమర్పించాను. వాళ్ళు ఏమన్నారంటే? ఉన్నదున్నట్టు ముద్రణ చేయలేము. తెలంగాణ సాహిత్యం గురించి ప్రత్యేకంగా రాస్తేనే వేస్తామన్నారు. మళ్ళీ ప్రత్యేకంగా కొంత రాసి చేర్చాను. దానికి సాహిత్య చరిత్రను కలిపి ముద్రించారు. దానికి మన సాహిత్య చరిత్ర అని పేరు పెట్టారు. తెలంగాణ సాహిత్య ప్రస్థానమని మరో పుస్తకం రాశాను. నమస్తే తెలంగాణలో అది ధారావాహికగా వచ్చింది దానికి బొమ్మలు జత చేశారు.
పద్మజ:– మీ రచనలు అనువదింపబడ్డాయి కదా! ఏ ప్రక్రియలు ఏ ఏ భాషల్లో అనువదించారు?
సుజాతారెడ్డి :—– నా రచనలు ఇతర భాషల్లోకి అనువదించినవి….
1- మలుపు తిరిగిన రథచక్రాలు (తెలంగాణ విమోచన పోరాటాన్ని చిత్రించే నవల) ముడ్ గయేరథ్ చక్ర్ పేరుతో హిందీలోకి డాక్టర్ సుమన్ లత అనువదించారు.
2- విసుర్రాయి ( స్త్రీల వేదనను, శోషణను చిత్రించే కథలు) చక్కి పేరుతో ఆచార్య సత్యనారాయణ హిందీలోకి అనువదించారు.
3- నిశ్శబ్దం నిశ్శబ్దం అనే కథను అల్లాడి ఉమ, ఎం శ్రీధర్ ఇద్దరూ ఆంగ్ల భాషలోకి అనువదించారు.
4- పాలు పొంగే పుణ్యభూమి అనే కథను నిడదవోలు మాలతి ఇంగ్లీషులోకి అనువదించారు.
5- వ్యాపార మృగం అనే కథను స్వాతి శ్రీపాద ఇంగ్లీషులోకి అనువదించారు.
6- గుడిసెలు… గుడిసెలు డిస్ పేస్ మెంట్ అనే పేరుతో గన్ను నటరాజశేఖర్ అనువదించారు.
పద్మజ:— యాత్ర విశేషాలు రాశారు కదా! దాని సందర్భం తెలపండి!
సుజాతారెడ్డి :– — నాకు చారిత్రక స్థలాలను దర్శించుకోవాలని చాలా ఇష్టం. పుణ్యక్షేత్రాలు తక్కువ! ఆ మధ్యకాలంలో ఏమైందంటే యాత్రలకు బస్సులు, రైళ్లల్లో, విమానాలలో కొందరు వ్యాపారంగా యాత్రలకు తీసుకొని పోయేవారు. అలా అవకాశం వచ్చినప్పుడు నేను కాస్త పనితీరుబడి ఉండడం వల్ల చైనా, ఈజిప్ట్, మొదలైన దేశాలు దర్శించుకునేందుకు బయలుదేరాను. ఎందుకంటే ఆ దేశాలతో యుద్ధ వాతావరణం లేకుండా దేశాలు శాంతియుతంగా ఉండడం మాకు అనుకూలించింది. ఎన్నో ప్రదేశాలు చూశాను. వాటి గురించి యాత్రా విశేషాలు రాశాను. జపాన్ కూడా వెళ్లాను వాటి గురించి మూడు పుస్తకాలు రాశాను.
పద్మజ :– మీరు పొందిన పురస్కారాలు చెప్పండి!
సుజాతారెడ్డి:— నేను ఎన్నో పురస్కారాలందుకున్నాను. అవేమిటంటే…
1 – ఉత్తమ అధ్యాపకులు [ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నుంచి 1992]
2 – తెలుగు నవలాను శీలనంకు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి [రచయిత్రి ఉత్తమ గ్రంథం అవార్డు 1992లో]
3- నెల్లూరు వర్ధమాన సమాజం వారి [ కవిత్రయ అవార్డు 1993లో]
4- దాశరధి దంపతుల సాహిత్య పురస్కారం 1994లో
5 – జ్యేష్ఠ లిటరరీ అవార్డు 1998 [విస్సుర్రాయి కథల సంపుటికి]
6 – విశాల సాహితీ పురస్కారం, జగిత్యాల 1999 [విసుర్రాయి కథల సంపుటికి]
7- చాసోస్పూర్తి సాహితీ పురస్కారం, విజయనగరం 2001, [ కథారచనకు ]
8 – జీవియస్ సాహితీ పురస్కారం, 2003
[ చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్రకు ]
9 – రంగవల్లి సాహితీ పురస్కారం, 2004 [ జహంగీర్ బీ కథకు ]
10 – తెలుగు విశ్వవిద్యాలయం
ఉత్తమ రచయిత్రి పురస్కారం, 2005లో
11 — రంగినేని సాహిత్య పురస్కారం, సిరిసిల్ల 2007 [ వ్యాపార మృగం కథల సంపుటికి ]
12 – సుశీలా నారాయణరెడ్డి సాహిత్య పురస్కారం, 2008లో
13 – సురవరం ప్రతాపరెడ్డి సాహితీ పురస్కారం, 2011లో
14 – విశిష్ట రచయిత్రి పురస్కారం , నిజామాబాద్ 2011లో
15 – ఆచార్య పల్లా దుర్గయ్య సాహిత్య పురస్కారం, 2013లో
16 – వంశీ తెన్నేటి అహల్యాదేవి సాహితీ పురస్కారం , 2014లో
17 – తెలంగాణ ప్రభుత్వం ఉగాది సాహితీ పురస్కారం , 2017 లో
18 – తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కారం 2016లో ద్వితీయ
పద్మజ :– కొండపల్లి నీహారిణీ సంపాదకత్వంలో రెండు అంతర్జాల పత్రికలు వెలవడుతున్నాయి కదా! మయూఖ, తరుణి పత్రికలు. తరుణికి అనుబంధంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడుస్తున్నది . అవి ఇంకా రాణించాలంటే ఏం చేయాలో మీ సూచనలు, సలహాలు ఇస్తూనే…. పత్రికల ఆవశ్యకత చెప్పండి! ఇంటర్వ్యూల వల్ల లాభం ఉందని విశ్వసిస్తున్నారా?
సుజాతారెడ్డి :— ఇలా పత్రికలను నడపాలని ఆలోచన రావడం నిహారిణిని అభినందించదగిన విషయం. ఎందుకంటే అమెరికాలో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆన్లైన్ పత్రిక కనుక అన్ని దేశాలలో ఉన్న తెలుగు వాళ్ళు ఈ పత్రికలను చదువుతారు అనుకుంటాను. వాళ్ళు మాతృభూమి నుండి దూరంగా ఉన్నా కూడా తెలుగు సాహిత్యాన్ని , ఈ దేశంలోని సాహితీ విశేషాలు, సాహితీ రంగంలో ఉన్న వాళ్ళను గురించి తెలుసుకొని ఇలా పరిచయం చేయడం ఎంతో ఉపయోగకరమైన విషయం. తర్వాత అన్ని రచనలు అందరూ చదవలేరు! కవులందరూ అందరికీ తెలిసి ఉండరు! ఇలా ముఖాముఖిల ద్వారా ఆయా రచనల- రచయితల గురించి తెలుసుకోవడం… చదవడం…. తెలుగు భాషకు పట్టం కట్టినట్టే కదా! పత్రికలోని అంశాలన్నీ బాగున్నాయి .అన్ని ప్రక్రియలలో సాహిత్యాన్ని రాబడుతున్నది. వీటిని ఆగకుండా నిర్వహించాలని నా సూచన! ” నిహారిణీ! చాలా కష్టపడుతూ రెండు పత్రికలను నడుపుతున్నావు! ఇలాగే ముందుకూడా దిగ్విజయంగా నడవాలని కోరుకుంటున్నాను, అభినందనలు తెలుపుతున్నాను.
ప్రపంచంలో జరిగే ఎన్నో విషయాలు సూర్యుడు చూడకపోవచ్చు! కానీ కవి ఆలోచనాచక్షువు నుండి ఏ విషయం దాటిపోదని పెద్దలు సామెత రూపంలో చెప్పారు. అందుకే కవి- కవయిత్రి సమాజ హితవరులు . ఏ సమాజం గురించి కవి- కవయిత్రులు ఆలోచిస్తారో ఆ కవిని సమాజం గౌరవిస్తుంది.
కవయిత్రి లేదా రచయిత్రిని పరిచయం చేయడమంటే ఆ కవి యొక్క ఆలోచన, అనుభూతి, అనుభవం, సమాజం పట్ల రచయిత్రి దృష్టి ఇలా ఎన్నో విషయాలు తెలుస్తాయి! అలా తెలుసుకోవడం వల్ల రచన రంగంలోకి కొత్తగా అడుగుపెట్టే వారికి ఒక నిర్వచనం వలె ఉండి తమ ఆలోచన పరిధిని ఎంతో విస్తరించుకోవచ్చు…అది ఎలా విస్తరించుకోవచ్చో తెలుస్తుంది. ఇలాంటి పరిపృచ్ఛ ప్రక్రియ తమ పత్రికలలో చేపట్టిన శ్రీమతి కొండపల్లి నిహారిణి గారు యువకవయిత్రులకు- రచయిత్రులకు దిశా నిర్దేశం చేస్తున్న సాహితీ ద్రష్ట అని చెప్ప వచ్చు! ఆమెకు అభినందనలు తెలుపుతూ….
శ్రీమతి ముదిగంటి సుజాత రెడ్డి గారు చేసిన సాహితి సేవ అమోఘం. ఎంతోమంది విద్యార్ధినీ విద్యార్థులకు జ్ఞానాన్ని పెంచిన ఆమె మూర్తిమత్వం అందరికీ ఆదర్శప్రాయమే! ఒక విద్యలోనే కాదు ఆమె శ్రమ విలువ తెలిసిన అసలు సిసలైన మనిషి… ఇలా ఎందుకు అంటున్నానంటే? తన ఇంట్లో నమ్మకంగా పనిచేసిన వారికి కోటి రూపాయల విలువ గల ఇల్లును బహుమతిగా ఇచ్చారంటే ఆమె సహృదయత ఎంత అని చెప్పగలము? ఆమె ఏమంటారంటే “ఈ కాలంలో మంచితనము, నిజాయితీ, దొరకనివి. వాటికి వెలకట్టలేము” కదా! అందుకే 50 సంవత్సరాలుగా పనిచేస్తున్న కుటుంబానికి ఇల్లు ఇవ్వడం సరైన నిర్ణయం అని అనుకుంటున్నాను” అని అన్నారు. ఈ ఉదార విషయంలోనూ రాబోయే తరానికి ఆదర్శమూర్తి సుజాత రెడ్డి గారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సిలబస్ కమిటీ సలహాదారుగా , పాఠశాల టెక్స్ట్ బుక్ కమిటీ సభ్యురాలుగా, తెలంగాణ సారస్వత పరిషత్ లో ఉపాధ్యక్షురాలిగా ఉంటూ సాహిత్య కృషి చేస్తున్నారు… ఇలాగే ఆమె సాహితీ సేవలు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…
వారు అడగగానే ముఖాముఖికి సమయం కేటాయించి ఇచ్చినందుకు, ఎంతో ఆదరణ చూపినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ….