ఒకరోజు ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మొదటి వ్యక్తి భగవంతుడు ఏదైనా చేయగలడు అని అంటాడు. రెండవ వ్యక్తి ఏదైనా చేయగలడు అని అంత గట్టిగా చెప్తున్నావు ఏంటి నీకు ఆయన మీద అంత నమ్మకం అని అడుగుతాడు. అప్పుడు ఆ స్నేహితుడు ఒక చిన్న కథ చెప్తా విను తర్వాత నువ్వే ఆలోచించు నీకే అర్థమవుతుంది నేను చెప్పింది నిజమా కాదా అనేది అని కథ చెప్పటం మొదలు పెడతాడు.
ఒక ఊళ్లో ఒక చెప్పులు కుట్టుకునే వాడు ఉంటాడు. అతడు తన పని తాను చేస్తూ కూడా ఆ శివ నామస్మరణ అనుక్షణం చేస్తూ ఉంటాడు. అదే ఊర్లో ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ధనవంతుడవటం చేత ఎన్నో రకాల పూజలు, దానధర్మాలు చేస్తూ అందర్నీ పలకరిస్తూ సరదాగా మాట్లాడుతూ అందరూ తనను పొగుడుతూ ఉంటే సంతోష పడిపోతూ ఉంటాడు. అటుగా వెళుతూ ఈ ఇద్దరిని చూసిన నారద మహర్షి ఆ శివుడి దగ్గరికి వెళ్లి ప్రణామములు తెలియజేసి నాకు ఒక సందేహం శివయ్య. అది నువ్వైతేనే తీర్చగలవు అని అంటాడు. ఏంటో చెప్పు అని ఆ శివుడు అడగగా….. ఆ నారద మహర్షి శివుడితో నువ్వు చూస్తున్నావు కదా కింద ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పు ఎవరికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని అంటాడు. అప్పుడు ఆ శివుడు చెప్పులు కుట్టే అతనికి అని చెప్తాడు. అదెలా ఆ ఇంకో వ్యక్తి కూడా అనేక రకాల పూజలు దానధర్మాలు చేస్తాడు కదా మరియు చెప్పులు కుట్టుకునే వ్యక్తి అవేమీ చేయకపోగా నీ నామస్మరణతో కాలక్షేపం చేస్తున్నాడు కదా అంటాడు. అయితే ఒక పని చెయ్యి నేను ఒక మాట చెప్తాను దానిని తూ.చా తప్పకుండా వారితో చెప్పు ఎవరు ఏం సమాధానం చెప్తారో దానిని బట్టి ఎవరికి పుణ్యం ఇవ్వాలో నిర్ణయిద్దాం అని అంటాడు. నారద మహర్షి సరే అని శివుడు చెవిలో చెప్పిన విషయాన్ని మారువేషంలో ముందుగా సంపన్నుడి దగ్గరికి వెళ్లి ఈ విధంగా చెప్తాడు. ఓయ్ పెద్దమనిషి నేను ఆ శివయ్యను చూశాను తెలుసా అని చెప్తాడు. ఓ!!! అవునా. శివయ్య ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు వెటకారంగా. శివయ్య సూది బెజ్జం లో నుండి ఏనుగును దూరుస్తున్నాడు అని సమాధానం చెప్తాడు మారువేషంలో ఉన్న నారద మహర్షి. చాలు చాలు లేవయ్యా సూది బెజ్జం లో నుండి ఏనుగును దూర్చడమేంటి వెటకారంగా ఉందా అని కసిరి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాస్త ముందుకెళ్లి ఇదే విషయాన్ని చెప్పులు కుట్టుకునే వాడితో చెప్తాడు. చెప్పులు కుట్టుకునే వాడు చాలా సంతోషంగా అవునా!!! అయినా నా శివయ్య ఏదైనా చేయగలడు అని అనుకుంటూ తన పనిలో తాను నిమగ్నమై శివనామ స్మరణ చేస్తూ ఉంటాడు. అది గమనించిన నారద మహర్షి నీకు నేను చెప్పిన విషయాన్ని విన్న తర్వాత కోపంగానీ ఆశ్చర్యం కానీ కలగలేదా అని అడుగుతాడు నారద మహర్షి. లేదయ్యా ఆ రెండు కలగటానికి ఆయన మనలాగా మామూలు మనిషి కాదు కదా!!!! అంటూ పక్కనే చెట్టు మీద నుండి రాలి పడిన మర్రి పండును ఒక దాన్ని తీసి మారువేషo లోఉన్న నారదమహర్షికి చూపిస్తూ ఇంత చిన్న పండు లో నుండి ఇంత పెద్ద వృక్షాన్ని సృజించగలిగిన నా తండ్రి సూది బెజ్జ ం లోనుండి ఏనుగును తీయలేడా??? ఇంత చిన్న విషయానికి ఆశ్చర్యం ఎందుకు???? ఆయన ఏదైనా చేయగలడు. మనకు కావాల్సిందల్లా ఆయన మీద నమ్మకం మాత్రమే అని తన పని తాను చేసుకుంటాడు. ఈ సమాధానం విన్న నారద మహర్షి శివుడి దగ్గరికి వెళ్లి నిజమే స్వామి మీరు చెప్పింది అని ప్రణామాలు చేసి వెళ్ళిపోతాడు.
మనం కూడా చాలాసార్లు మనకు దైవం మీద నమ్మకం లేకపోయినా అలవాయితీగానో అలవాటుగానో ఇష్టం లేకపోయినా ఆడంబరాలకు పోయి పొగడ్తలకు లొంగిపోయి చాలా పనులు చేస్తుంటాం. కానీ ఆ పరమేశ్వరుడికి కావలసింది తన పైన నమ్మకం పెట్టుకోవటం, భగవంతుడు మీద ప్రీతి కలిగి ఉండటం . దేవుడి మీద భారం వేసి మనం చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని చేకూర్చటమే ఆయన పని. తనపైన నమ్మకం పెట్టుకున్న వారిని అనుక్షణం కాపాడటం భగవంతుడు ప్రధమ కర్తవ్యం గా భావిస్తాడు. అందుకే మనం ఏ పని చేసినా అంతా మనదే గొప్ప అని గొప్పలకు పోకుండా ఆ భగవంతుని తలుచుకొని చేసే ప్రతి పనిలో తప్పకుండా విజయం సాధిస్తాం. అప్పుడప్పుడు చిన్నచిన్న ఆటంకాలు అవరోధాలు ఎదురవుతాయి.ఇక ఎదురయ్యే ఆటంకాల గురించి అంటారా అవి మన కర్మఫలం తప్పకుండా అనుభవించి తీరాల్సిందే.