లోకాభిరామాయణం 9

అరువు ముచ్చట్లు

దేదీప్య మానంగా వెలుగుతున్న లైట్ల వెలుగులో, అత్యంత సుందరంగా అలంకరించిన స్టేజ్ మీద ఎంగేజ్మెంట్ జంట, ప్రపోజ్ చేస్తూ, కౌగిలించుకుంటూ, ఒకరి ఒళ్ళో మరొకరు కూర్చుని ఇలా రకరకాల భంగిమలలో దాదాపు రెండు గంటల నుంచి ఫొటోలు దిగుతూనే ఉన్నారు.
తూతూ మంత్రంగా తాంబూలాలు ( ఇది పాత కాలపు మోటు మాటేమో????) మార్చుకునే కార్యక్రమం పూర్తి అయింది. ఫొటోగ్రాఫర్ దయతలచి ఇచ్చిన ఐదునిమిషాల సమయంలో తల్లిదండ్రులు, దగ్గర బంధువులు ఫొటోలు దిగారు. ఇక హవా అంతా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, ఫ్రెండ్స్ దే.
“ఏమండీ, ఏమండీ” చేతిమీద గిల్లుతూ గోముగా పిలిచింది రామలక్ష్మి, సుబ్బారావుని.
“అబ్బ, ఏమిటీ ఆ గిచ్చటం, ఏం కావాలి” అడిగాడు సుబ్బారావు.
“మరండీ, మరండీ మనం కూడా ఒక ఫొటో దిగుదామా? అడిగింది. రా.ల.
“ఇందాక దిగాం కదా!” అన్నాడు సుబ్బారావు.
“అలా కాదండీ, ఒక పోజు ఇచ్చి తీయించుకుందాం”అంది మళ్ళీ రామలక్ష్మి.
“మీరు ఆ అబ్బాయి లాగా మోకాళ్ళ మీద కుర్చుని నాకు ప్రపోజ్ చేస్తున్నట్లు” అన్న రామలక్ష్మి వైపు,పిచ్చిపట్టలేదు కదా, అన్నట్లు అయోమయంగా చూశాడు సుబ్బారావు.
ఒకప్పుడు సదరు ఎంగేజ్మెంట్ అనే పదం ఉండేది కాదు. పెళ్లి చూపుల తర్వాత, అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చారు అనుకున్న తర్వాత పెద్దవాళ్ళు మిగిలిన విషయాలు మాట్లాడుకుని ఒక మంచి రోజు చూసుకుని తాంబూలాలు పుచ్చుకునే వారు. ఇక్కడ అమ్మాయి, అబ్బాయి తో పని లేదు. కేవలం పెద్ద వారే ఉండేవారు.
ప్రధానపు ఉంగరం అని కొంతమందికి ఆచారం ఉండేది. ఈ ఉంగరం నిశ్చితార్థం రోజున అత్తగారు,చీరె తో పాటు కాబోయే కోడలికి బొట్టు పెట్టి ఇచ్చేది.

కానీ ఇప్పుడు అలాకాదు. ఎంగేజ్మెంటే పెళ్ళిలాగా చేయిస్తున్నారు. అమ్మాయి చేత పూజ, అబ్బాయి చేత తర్వాత ఇద్దరికీ పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకోవటం.
ఇక మొదలవుతుంది పూజ దండలు మార్పించటాలు, అబ్బాయి అమ్మాయికి ఉంగరం తొడగటం, తర్వాత అర్దం పర్ధం లేని కేక్ కటింగ్ అది ఒకళ్ళ నొకళ్ళు నోట్లో పెట్టుకోవటాలు అసలు ఒకటేమిటి, అన్ని వికారాలు జరిగిపోతున్నాయి.
ఇక ఫొటోల సంగతి చెప్పే పనే లేదు. పెళ్లి సమయంలో,లేదు మంత్రాల సాక్షిగా జీలకర్ర, బెల్లం ఒకరి శిరస్సు మీద మరొకరు పెట్టుకున్నప్పుడు మొదటి స్పర్శ అనుభూతి కలుగుతుంది. ఆ తర్వాత ఏడడుగులు నడిచేటప్పుడు ఒకరిచేయి మరొకరు పట్టుకోవటం జరుగుతుంది.
కానీ ఈ విశృంఖల సంస్కృతిలో ఎంగేజ్మెంట్ లోనే పదిమంది ఉన్నారు అనే సంస్కారం లేక ముద్దులు, కౌగిలింతలు . దౌర్భాగ్యం ఏంటంటే కొంతమంది పెద్దలు కూడా,ఇవి ఖండించకపోగా ముసిముసిగా నవ్వుకుంటూ ఈ కాలం పిల్లల సరదాలు మనం కాదని కూడదు అనే సమర్ధింపు.
ఇక పెళ్ళిళ్ళ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరదాలు, ముచ్చట్లు పేరుతో మనవి కాని ముచ్చట్లు భీభత్సంగా చేసుకుపోతూ, తొంభై ఏళ్ళ బామ్మా, తాతా నుంచి మొదలుకుని ఏడాది లోపు పసికందులు కూడా డాన్సులు, వీడియోలు.
ఈ క్రమంలో అసలు, సిసలైన మన తెలుగు సాంప్రదాయపు వివాహ వ్యవస్థ కనపడకుండా పోతున్నది. వారి వారి ఆచారాల్ని బట్టి, వేదమంత్రాలతో ఒకరోజు పూర్తిగా చేయాల్సిన వివాహ తంతుని పూర్తిగా అటకెక్కించేసారు.
ఈ అరువు తెచ్చుకున్న సరదాలు, ముచ్చట్లు అనుసరిస్తున్న వారిని ఒక్కటే ప్రశ్న అడుగుదాం. మీరు మన రాష్ట్రం కాని వారిని, ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ని మన పద్ధతిలో వివాహం చేసుకుంటారేమో అడిగి , మన పద్ధతిలో చేయించగలరా! నిస్సందేహంగా వాళ్ళు ఖండిస్తారు. తమది కాని సంస్కృతిని సాంప్రదాయాలను వాళ్ళు అనుసరించరు.మరి మనం ఎందుకు ఇలా?
“ఏమండీ, ఏంటీ ఆలోచిస్తున్నారు. నా ముచ్చట తీర్చరా?” మళ్ళీ గోముగా అడిగింది రామలక్ష్మి.
“నోరు మూ‌సుకో, నీకు నాకు పిచ్చి ముదిరింది అనుకుంటారు చూసేవాళ్ళు. అయినా నా బంగారం, ఈ అరువు ముచ్చట్లు మనకెందుకు. మనం షష్టి పూర్తి పూర్తి సాంప్రదాయ బద్దంగా జరుపుకుందాం సరేనా?” అన్నాడు సుబ్బారావు.

Written by PVS Krishnakumari

పేరు. : పీ. ( వల్లూరు) వి. యస్. కృష్ణ కుమారి
భర్త : పోతరాజు వేణుగోపాల కృష్ణ మూర్తి ( రిటైర్డ్ ఫైనాన్స్ ఆఫీసర్ హై కోర్టు)
పుట్టిన తేది. ఆగష్టు, 14
తండ్రి. : వల్లూరు కోటేశ్వరరావు
తల్లి : వల్లూరు రాజ్యలక్ష్మి
పిల్లలు : నీలా సుందరి ( కూతురు )
రవిశంకర్ ( అల్లుడు)
శ్రీవాత్సవ ( కుమారుడు)
‌. మృణాళిని ( కోడలు)

జన్మస్థలం : వల్లూరు , గుంటూరు జిల్లా
విద్యాభ్యాసం. : పొన్నూరు, విజయవాడ ,
క్వాలిఫికేషన్ : బి.ఏ. బీఈడీ
వృత్తి. : ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ శ్రీవాణి మోడల్ స్కూల్ ( సొంత స్కూల్)
ప్రవృత్తులు. : సంగీతం, సాహిత్యం
సాహితీ ప్రయాణం. : 2010 లో మొదటిసారిగా కవితలతో మొదలైంది. వార్త, మన తెలంగాణా, సత్యం ఆన్లైన్ మ్యాగజైన్ లలో వందకి పైగా కవితలు
2015 లో మొదటి కథ ' ఓ సీత కథ' నవ్య వారపత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాత నవ్య, పాలపిట్ట, నమస్తే తెలంగాణా, జాగృతి, ఉషోదయ వెలుగు, వార్త ఆదివారం అనుబంధం, ఉషా మ్యాగజైన్ లలొ దాదాపు ఇరవై ఐదు కథలు, బహుమతులు , సాధారణ ప్రచురణకు ప్రచురితమైనాయి.
కథా మంజరి, కథా వేదిక, తరుణి ఇంకా అనేక ఫేస్ బుక్ గ్రూప్ లలో యాభైకి పైగా కథలు రాగా, ఇరవై కథలకి బహుమతులు వచ్చాయి.
నవలలు : జీవన విపంచి
వేద సుధామయం.
నేల నుండి నింగికి ( అముద్రితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పసిదనంతో ప్రయాణం (కాలమ్ 10)

కథల పోటీ – 2026