(హైదరాబాద్ లో పుస్తకాల పండగ ముగియడం బాధగా ఉంది. వెళ్ళాలి, అందరిని కలవాలి అనే తాపత్రయంతో ఈ పది రోజులు ఉత్సాహంతో గడిచింది. అందుకే పుస్తకం ఏమనుకుంటుందో అనే భావనతో ఈ పంక్తులు కవితగా- విజయా రంగనాథమ్)
……..
ఉత్తుంగ తరంగాల జన జలధిని చూసి మురిసింది పుస్తకం
గుమ్మంలోనే రారమ్మని చేతులు చాచి పిలిచింది
తన అభిమానుల్ని కనులారా చూసి తృప్తి గా ఆనంద పడింది
తన సృష్టి కర్తలను చూసి ముచ్చటపడి నవ్వింది
అంతటా ఆనంద కోలాహలాల మధ్య
కావలసిన పుస్తకాల వెతుకులాట ను చూసి తల్లిలా నవ్వింది
పిల్లల పుస్తకాలు, ప్రేమ కథలు, నవలలు, కవితలు,
మత ప్రచారాల గ్రంథాలు, వ్యాసాలు… అబ్బో ఎన్నెన్నో…
తనను సృష్టించిన విజ్ఞాన ఘనులు కవులను రచయితలను
తనివితీరా చూస్తూ అభిమానం కురిపించింది
పుస్తకం చేసిన చుట్టాల పరిచయాలను,కరచాలనాలను,
ఆలింగనాలను చూసి సంతోషంతో తబ్బిబ్బయింది
పరిచయస్థుల వెతుకులాటల ప్రజల కన్నులను చూసి చలించింది
ఉపన్యాసాల సవ్వడి చిరు మువ్వల ధ్వనులుగా పులకించింది!
పది రోజుల పండుగను తనివితీరా ఆస్వాదించి పాఠకాభిమానుల ఇళ్ళకు చిరునవ్వులతో తరలింది!
పండుగ ముగిసిందని ..
తడి కన్నులతో మళ్ళీ వచ్చే ఏడు కలుస్తానంటూ వెళ్ళింది.
పుస్తకం నీకో నమస్కారం!