“ఏమోయ్! ఎక్కడా ? ఫోన్లో అమ్మాయి మాట్లాడుతున్నది. త్వరగారా! ”
నారాయణరావు అరుపుకు, ‘వారం అయింది అమ్మాయి ఫోన్ చేసి ఎందుకు చేయలేదో మరి‘
అనుకుంటూ అదే ఆలోచనలో కాఫీ కలుపుతూ ఉన్న సునీత,భర్త పిలుపుతో
“ఆ! వచ్చే, వచ్చే” తడిచేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది.
“ఇదిగో, మాట్లాడు ” అంటూ, నారాయణ రావు ఫోన్ భార్యకు అందించాడు.
“ఆ! శ్రీలు ఎలా ఉన్నారు? ”
“అంతా బాగానే ఉన్నామమ్మా, కొత్త ఉద్యోగం కొంచెం పని ఎక్కువగానే ఉంటున్నది, నేను ఫ్రీ అయిన టైంలో మీకు అర్ధరాత్రి అప్పుడు ఫోన్ చేస్తే కంగారు పడతారని చేయలేదు అలా వారం గడిచిపోయిందమ్మా ”
‘’ అలా కాదు శ్రీలు ఏ టైం అయినా పర్వాలేదు ఒక్కసారి పలకరించావంటే స్థిమితంగా ఉంటాము సరేనా తల్లీ!”
“అలాగే అమ్మా, ఈ సమ్మర్ లో ఇండియాకు రావాలని ప్లాన్ చేస్తున్నామమ్మా …. డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత వివరంగా చెప్తాను. ”
“అవునా, చాలా సంతోషం శ్రీలు.ఎండలు ముదరకముందే వచ్చేందుకు చూడండి. అలాగే నీకేం కావాలో కూడా ముందుగానే చెప్పు వచ్చినప్పటినుండి పరుగులే మీకు. పాప ఎలా ఉంది. అల్లుడు గారు బాగున్నారు కదా, అత్తమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? మనవాళ్లంతా క్షేమమే కదా! ”
“అందరం బాగున్నామమ్మా. ఈయన వర్క్ లో చాలా బిజీగా ఉంటున్నారు. పాప బాగుంది. త్వరలో చూస్తారు కదా.
మనవాళ్ళందరిని కలవబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నాయనమ్మ తాతయ్య ఎలా ఉన్నారు?”
“తాతయ్య పరవాలేదు శ్రీలు. నాయనమ్మ ఆరోగ్యం తరచూ ఇబ్బంది పెడుతున్నది. ఆ గది దగ్గరకే వెళుతున్నాను పలకరించుకో చాలా సంతోషపడతారు”
మామగారికి ఫోన్ ఇచ్చి సగంలో వదిలేసిన కాఫీపని చూసేందుకు సునీత వంటగది వైపు కదిలింది.
“మధ్యాహ్నం భోజనాల తర్వాత అందరo హాల్లో కూర్చున్నపుడు. ఎప్పుడు ఏ అవసరం ముంచుకొస్తుందోనని నన్ను కనిపెట్టుకొనుoటూ, ఎక్కడికి కదలలేకున్నారు మీరు. పిల్లదాన్ని చూసి రెండేళ్లు దాటింది, ఫోనులో మాట్లాడుతున్నా, వీడియోలో చూస్తున్న, దగ్గరకు చేర్చుకోవాలన్న తపన తీరడం లేదు. దాని బిడ్డకు కూడా ఏ అచ్చట ముచ్చట తీర్చలేక పోతున్నాము.”
అంటూ అత్తయ్య బాధపడుతుంటే,
“అమ్మా!ఊరుకో, ఆ వెలితి తీర్చేందుకే నీ మనవరాలు వస్తున్నానని చెప్పింది కదా, నీ ఆయాసం అంతా ‘వూష్ కాకి ‘ అయిపోయి, చక చకా లేచి తిరుగుతావు చూడు.”
అంటూ మావారు ఉడికించారు. మావయ్య నవ్వుతూ చూస్తున్నారు.
శ్రీ లాస్య మా ఏకైక సంతానం. అల్లారుముద్దుగా పెరిగింది. అపురూప లావణ్యం అందమైన మనసున్న తనంటే మా బంధు వర్గానికి అంతా కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం. చదువులో కూడా చాలా చురుగ్గా ఉండేది. అనుకోకుండా వచ్చిన సంబంధం, అందరికీ నచ్చినప్పటికీ, అమెరికా అనేసరికి, అంత దూరమా అని ఆగిపోయాము. కానీ అబ్బాయి తల్లిదండ్రులు ఒక అడుగు ముందుకు వేసి,
“అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు ఇష్టపడ్డారు. ఈడు జోడు కూడా చక్కగా కుదిరింది. అమ్మాయిని గురించి మీరు దిగులు పడకండి. మా ఇద్దరు పిల్లలు వసుధ, కృష్ణ చైతన్య ఇద్దరూ అట్లాంటాలో ఉంటారు. మీకు తెలుసు మా అమ్మాయికి పెళ్లయి ఇద్దరు పిల్లలు. మేము వారికిఐదారు గంటల ప్రయాణ దూరంలో సిన్సినాటిలో స్థిరపడ్డాము. తరచూ కలుస్తుంటాము. మా బంధు బలగమంతా కూడా అమెరికాలోనే ఉన్నారు.”
అంటూ మాకు నచ్చచెప్పి శుభస్య శీఘ్రం అనిపించారు. పెళ్లి ఘనంగా జరిగిపోయింది. మొదట్లో చాలా కష్టంగా అనిపించినా, తప్పదు కదా అలవాటు పడ్డాము. ఏడాదికి ఒకసారి తను రావడమో మేం వెళ్లడమో జరుగుతుండటం, శ్రీలు డెలివరీ సమయంలో అక్కడే ఆరు నెలలు ఉన్నాము . పాపకిప్పుడు ఐదేళ్లు. మా అత్తయ్య ఆరోగ్యం బాగోలేకపోవడంతో గత రెండేళ్లుగా మేము వెళ్లలేకపోయాము, ఉద్యోగాల మార్పులు,’ వీసా’ ప్రాబ్లమ్స్ తో శ్రీలు వాళ్ళు కూడా రాలేకపోయారు. ప్రొద్దున మాట్లాడినప్పటినుండి ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆత్రుత పడుతున్నాము.
తీరా శ్రీలు వాళ్ళు వస్తున్న రోజు దగ్గర పడుతున్న కొద్ది మనోబలం కంటే మించింది లేదు అన్నట్లు మంచంపై నుండి కాలుకింద పెట్టేందుకు ఆయాస పడుతూ ఇబ్బంది పడుతున్న మా అత్తయ్య, మావారు అన్నట్లుగానే ఉత్సాహంగా ఆ పని ఈ పని అందుకుంటూ హడావిడి పడసాగారు.
“సునీతా, ఎలాగూ శ్రీలు వాళ్ళు శ్రీరామనవమికి ఇక్కడే ఉంటారు కనుక, మనవాళ్లందరినీ ఇక్కడికే రమ్మని చెబుదాము. అందరం ఒకచోట కలిసినట్లు ఉంటుంది. పైగా శ్రీలు వాళ్లు కూడా ఎండలకు తిరిగే పని తప్పుతుంది ఏమంటావు? ”
అన్నాడు నారాయణరావు. ఈ ఆలోచన బాగుందనిపించింది అందరికీ. అలాగే చేద్దాం అనుకున్నాము. మా పుట్టిల్లు, మా ఆడపడుచులు అందరివి,మాఊరుకి యాభై కిలోమీటర్ల దూరాల్లో ఊర్లే. అదీ కాక,మాఊర్లో ప్రసిద్ధి పొందిన రామాలయం, శివాలయాలు ఉన్నాయి. శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలు విశేషంగా జరుపుతారు కనుక చుట్టుపక్కల గ్రామాల నుండి అందరు కూడా ఇక్కడకు చేరుతారు.
పండక్కు వారం ముందుగా శ్రీలు, మా అల్లుడుగారు కృష్ణచైతన్య, పాప వచ్చారు. శ్రీలును దగ్గరకు తీసుకుని అత్తయ్య ఆపుకోలేక ఏడ్చేశారు . నా కళ్ళల్లో తడి గుండెల్లో భారాన్ని తగ్గించింది. మావారి పరిస్థితి,మామయ్య స్థితి కూడాఅంతే. అల్లుడు గారిని సాదరంగా పలకరించుకుని దగ్గరకు తీసుకున్నారు. పాప పేరు శ్రీనిధి అమ్మానాన్నల అందమంతా పుణికి పుచ్చుకొని కుందనపు బొమ్మలా ఉంది. తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నది దాంతో జేజవ్వ తాతయ్యల మురిపాలకు పొద్దు చాలడం లేదు, కథలు చెప్పమంటూ పాపవారిని వదలడం లేదు కూడా .
మరో రెండు రోజులకు బంధువులందరూ కూడా వచ్చేశారు. వాళ్ళ ఇళ్ళకు పిలిచి భోజనం పెట్టి పంపలేదు అన్న కొరత అందరిలో ఉన్నా, వచ్చిన మూడు వారాలకు అందులో ఎండలకు ఇబ్బంది పడతారని అందరూ ఇక్కడే సరదాగా గడుపుతున్నారు. తన వయసు పిల్లలతో నిధి కూడా బాగా కలిసిపోయి ఆడుకుంటున్నది.
అల్లుడుగారు కూడా కొత్త పాత లేకుండా మొదటి నుండి అందరితో కలిసి పోయారు. శ్రీలు అత్తగారు మాకు, బంధువులందరికీ కూడా పేరుపేరునా బహుమతులు పంపించారు.
శ్రీరామనవమి పండుగ సంబరాలకు దేవాలయాల ముందు,ఇళ్ల ముందు తాటాకు చలువ పందిళ్లు వేసి, మామిడి తోరణాలు కట్టి ఊరును ముస్తాబు చేస్తారు. రంగులు రాట్నాలు, రకరకాల అంగళ్ళు, సందడి చేస్తాయి. ముఖ్యంగా పిల్లలు పీచు మిఠాయితో చేతికి వాచీలు, ఉంగరాలు పెట్టించుకుని అవి(నాక్కుంటూ) రుచిచూస్తూ తిరగడం, రకరకాల ఆట బొమ్మలు, గాలి బుడగలుకొనడం సరదాలు. అక్కడక్కడ చలివేంద్రాలు పెట్టి పెద్దపెద్ద కుండలలో తాగే నీరు,మజ్జిగ, పానకం సిద్ధం చేస్తారు. వేడిని తగ్గించే పానకం, వడపప్పు ఈ పండుగ ముఖ్య ప్రసాదాలు. పొద్దున్నే అందరo స్నానపానాదులు, పూజా కార్యక్రమాలు, ముగించుకుని దేవాలయానికి బయలుదేరాము. కన్నుల పండువగా జరిగిన సీతారామ కళ్యాణం చూసి తరించి కల్యాణ అక్షింతలు తలపై చల్లుకొని,కొన్ని అక్షింతలు శ్రీలు వాళ్ళతోఅమెరికా పంపేoదుకు తీసుకొని ఇంటికి చేరాము.
ఆరోజు రాత్రి ఆరు బయట చల్లగాలికి మధ్య మధ్యలో విసన కర్రలతో విసురుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నప్పుడు, రోజంతా పండుగ సందడిని గమనిస్తూ ఉన్న నిధి,జేజి తాతయ్య ఒడిలో కూర్చుని ,
“తాతయ్యా! శ్రీరామనవమి అంటే ఏంటి ” అని అడిగింది.
“రాముడు పుట్టినరోజు తల్లీ” అంటూ పెద్ద వాళ్లకు కూడా అర్థమయ్యేలా చెప్పే పండుగ విశేషాలు వినాలని అందరం మాటలు ఆపి కుతూహలంగా కూర్చున్నాము.
నిధి తలనిమురుతూ నీలాగ’ రామ ‘అనే పేరును కూడా పలుకలేని అడవిలో పక్షులను జంతువులను చంపుకుని తింటూ బ్రతికే ఒక బోయవానికి, నారాయణ నామాన్ని పలుకుతూ నారదముని కనిపించి, ఇలా ప్రాణులను చంపడం పాపమని చెప్పి’ మరా ‘ మరా’ అని పలికించి నేను మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేవరకు ఇలాగే పలుకుతూ ఉండాలని చెప్పి వెళ్ళాడట. ఆ బోయవాడు ముని చెప్పినట్లు మరా, మరా అని చెబుతూ అక్కడే కూర్చుండిపోయాడు అంట. అదే రామ రామ అనే శబ్దంగా వినిపిస్తూ, ఆ బోయవాడు వాల్మీకి మహర్షిగా మారిపోయి మనందరికీ శ్రీరామ కథను చెప్పాడు తల్లి. రాముడు నీలాగా చాలామంచివాడు, ఎంతో బుద్ధిమంతుడు, అందరి పట్ల దయతో ఉండేవాడని చెబుతూ, రామచంద్రుని జననం, సీతా కళ్యాణం, వనవాసం, రామ భక్తుడైన హనుమంతుని గురించి,రావణ సంహారం, రామ పట్టాభిషేకం, లవకుశల జననం, అవతార సమాప్తి. ఒక్కొక్క ఘట్టాన్ని, వింటూ అందరం రామ కథలో, లీ నమైపోయాము. అందరి కళ్ల వెంట కన్నీళ్లు కారుతున్నాయి.
రాముడు లేడా!వెక్కి వెక్కి ఏడుస్తున్న నిధిని, సముదాయిస్తూ, రాముడు ఎక్కడికి వెళ్లిపోలేదు తల్లి మనతోనే ఉన్నా డు. రామ అని పలికితే హనుమంతుడు కూడా మన పక్కనే ఉంటాడు. అలా అయితే తాతయ్యా!రాముడిని పిలుస్తూ హనుమంతుని నా పక్కనే ఉంచుకుంటాను. అని చెబుతుంటే దాని బుద్ధి సూక్ష్మతకు, విశ్వాసానికి అందరం క్షణం సేపు నివ్వెర పోయాము.
1. తాతయ్య అందరి వైపు చూస్తూ, పదిపాకలున్న పల్లైనా రామాలయం తప్పక ఉంటుందన్నది మనమెరిగిన విషయమే కదా! సాయంత్రాలు తప్పనిసరిగా పిల్లలతో కలసి ,ఊరి వారందరూ అక్కడ చేరి రామ భజన చేస్తారు.
ఏ మహిమలు చూపని మనుజావతారం రామావతారం. రాజు గా ప్రజల పట్ల బాధ్యత, తల్లిదండ్రుల పట్ల విధేయత, భార్యాభర్తల అనుబంధం, సోదరులపట్ల అనురాగం, ఆశ్రమ వాసుల పట్ల రక్షణ, స్నేహ ధర్మం, శరణన్న శత్రువునైన క్షమించగలిగే ఔదార్యం. మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు. తాను నడిచి చూపి,మన జీవితాలకు ఆదర్శంగా నిలిచాడు. అందరి నాలుకలపై పలుకు తేనెలు కురిపించే రామనామం మన బతుకునావను ఆత్మస్థైర్యంతో నడిపే శక్తినిస్తూ ఒడ్డుకు చేరుస్తుంది.
శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం పునర్వసు నక్షత్రంకర్కాటక లగ్నం లో జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం శ్రీరాముడు. శ్రీరాముని జన్మదినంగా శ్రీరామనవమి జరుపుకుంటారు. సీతారాముల కళ్యాణం కూడా నవమినాడే జరిగిందని ఆ రోజే కళ్యాణం కూడా జరుపుతారు, వనవాసానంతరం పట్టాభిషిక్తుడు అయ్యిందికూడా నవమినాడే అని చెప్తారు. రామ పట్టాభిషేకం పటoలేని, ఇల్లుఉండదు. పూజామందిరమూ ఉండదు. ముఖ్యంగా పెళ్లిళ్లలో,సీతా సమేతుడై, సింహాసనం పై కూర్చుని, సోదరులను, హనుమంతుని, సకల దేవతలను కూడిన శ్రీరామచంద్రుని తప్పక పూజిస్తాము.
శ్రీరామనవమి పండుగ మన తెలుగు లోగిళ్ళలో వసంతోత్సవం పేరిట తొమ్మిది రోజులు చాలా వైభవంగా జరుపుకుంటాము. మార్చి అంటే ఎండలు మొదలవుతాయి కాబట్టి వడపప్పు, మిరియాలు వేసిన బెల్లo పానకం, ప్రసాదంగా పంచి పెడతారు. వడపప్పు పానకం చలువనిచ్చి సేద తీరుస్తాయి. విసెన కర్రలు కూడా పంచుతారు. దేవాలయాల్లో ముఖ్యంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. గత ఏడాది మనమంతా భద్రాచలం వెళ్లి కళ్యాణం చూసి వచ్చాము కదా అంటూ తాతయ్యగుర్తు చేస్తూ, శ్రీరామ రామరామేతి
రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే అని మూడుసార్లు పలికించి కళ్యాణ అక్షతలు అందరిపై చల్లాడు.
ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్లిపోయారు.శ్రీలు వాళ్ళు ఊరికి వెళ్లే రోజు వచ్చింది. అందరి మనసులు భారంగా ఉన్నాయి అయినా, అక్కడ వాళ్లు దేనికి కొరత పడకూడదని, పచ్చళ్ళు, ఊరగాయలు, పొడులు,చిరు తిండ్లు. అన్నీ హాలంతా పరుచుకున్నాయి., ఇంకా బంధువులు ఇచ్చిన గిఫ్టులు, శ్రీలు అత్త,ఆడపడుచుల కొరకు మేం పంపుతున్న ప్రత్యేక బహుమతులు. ఇవన్నీచూస్తూ చైతన్య మేము తీసుకెళ్లేందుకేనా, విమానం సరిపోతుందా! అంటూ నవ్వుతుంటే! చూసేందుకు అలా అనిపిస్తుంది కానీ, తలా కాసింత పంచుకుంటే పూర్తిగా సరిపోవు కూడా అంటూ మా అత్తయ్య తనే స్వయంగా సర్దుతూ చెబుతుంటే, ఆమెను నొప్పించకూడదని మీరన్నది నిజమే అమ్మమ్మ, తనూ సూట్ కేసులు సర్దేందుకు కూర్చున్నాడు కృష్ణ చైతన్య. శ్రీలు వస్తానని ఫోన్లో చెప్పిన రోజు నుండి ఇప్పటివరకు మా అత్తయ్యేనా అని అబ్బురపరుస్తూ మందులకు మించిన శక్తి మనసుకు ఉందేమో అనిపిస్తున్నది.
ఈసారి పాప కూడా బాగా చేరిక అయ్యి విడవలేకున్నాము. అయినా పసిది బెంగ పడుతుందని నిబ్బరంగామళ్లీ వాళ్లు రాబోయే రోజు కొరకు ఎదురు చూస్తూ అందరం మామూలుగా మసలాము. మనోరంజకమైన మన పండుగ పరమార్థం తెలుసుకున్న మనుమరాలు మరో దేశం వెళ్ళింది.