పరంధామయ్య, సుభద్రమ్మ రెండు రోజులు అయింది, కొడుకు దగ్గరకి వచ్చి. స్టేషన్నుంచి ఇంటికి తీసుకొచ్చి, ఆఫీసులో మీటింగ్ ఉందని వెంటనే వెళ్ళిపోయాడు కొడుకు సుధాకరం. ఇద్దరికీ టిఫిన్ పెట్టి, “భోజనం టేబుల్ మీద పెట్టాను. మీ టైముకి మీరు పెట్టుకుని తినండి అత్తయ్య… బాబుని స్కూల్ దగ్గర దింపి, నేనూ ఆఫిస్ కి వెళ్ళొస్తాను ” చెప్పి, హడావిడిగా వెళ్ళిపోయింది కోడలు కమల.
సాయంత్రం వరకూ ఇద్దరూ మాటలు రాని బొమ్మల్లా కూర్చున్నారు.
ఆరుగంటలకి కోడలు మనవడిని తీసుకుని వచ్చింది.
వాడికి పాలు తాగించి,అదే అపార్ట్మెంట్ లో పై ఫ్లోర్ లో ఉన్న ట్యూషన్ కి తీసికెళ్లి దిగబెట్టి వచ్చింది.
బట్టలు మార్చుకుని నైటీ వేసుకుని, సెల్ లో మాట్లాడుతూ సోఫాలో కాలిమీద కాలు వేసుకుని కూర్చుని, ఎదురుగా అత్త మామలున్నారన్న ధ్యాసకూడా లేకుండా కాలు ఊపుతూ మాట్లాడుతూనే ఉంది.
ఎనిమిది అవుతుంటే, “డిన్నర్ టేబుల్ మీదుంది, మీకు ఆకలి అయినప్పుడు తినండి. నేనలా వెళ్ళి బాబుని ట్యూషన్ నుంచి తీసుకొస్తాను ” చెప్పి, తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయింది.
తొమ్మిది అవుతుంటే వచ్చింది కోడలు కమల.
కొడుక్కి తినిపిస్తూ “మీరు తినలేదేం?” అడిగింది.
‘”అబ్బాయి వచ్చాక తింటాo లేమ్మా ” అంది సుభద్రమ్మ.
“సుధా వచ్చేసరికి లేట్ అవుతుందట. మిమ్మల్ని తినేసి పడుకోమన్నాడు”. హోటల్ నుంచి తెచ్చిన డిన్నర్ పేకెట్స్ విప్పి, ప్లేట్ లో పెట్టి ఇద్దరికీ ఇచ్చింది.
బిర్యానీలో మసాలా, వెల్లుల్లి వాసన అలవాటు లేక పోవడంతో సుభద్రమ్మ “నాకంతగా ఆకలిగా లేదు ఇంతవద్దు తీసేయమ్మా “అని తనే కొద్దిగా ఉంచుకుని మిగిలినది బౌల్లో వేసేసింది. ఆ కాస్త తిన్నాననిపించి చేయి కడుక్కుంది. పరంధామయ్యకి సహించక పోయినా ఆకలికి ఆగలేక ముద్దకి ముంతడు నీళ్లు అన్నట్లు, ముద్ద నోట్లో పెట్టుకుని, నీళ్లు తాగి లోపలికి పంపాడు.
ఇద్దరూపడుకున్నాక కొడుకు ఎప్పుడొచ్చాడో వారికి తెలియదు.
ఉదయం ఇద్దరూ తొందరగానే లేచి, తయారై హాల్లోకి వచ్చి కూర్చున్నారు. కొడుకు లేచి వస్తే మాట్లాడవచ్చు అనుకున్నారు.
సుధాకరం ఎనిమిదిన్నర దాటాక బెడ్ రూమ్ లోనుంచి బయటికి వచ్చాడు. ఆఫీస్ కి వెళ్ళడానికి తయారై ఉన్నాడు.
తల్లిదండ్రుల్ని చూసి, “బ్రేక్ఫాస్ట్ చేశారానాన్నా,? ” అడుగుతూనే, తనే డిష్ లో ఉన్న ఇడ్లి ప్లేట్ లో పెట్టుకుని తినడం మొదలు పెట్టాడు.
కొడుకుతో కలిసి తిందామని ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు.
కొడుకు, కోడలు మనవడిని తీసుకుని వెడుతూ “అత్తయ్యా!సుధా కి ఈ రోజు ఆఫీస్ లో లంచ్ ఉందట.నేనూ కేంటేన్ లో తినేస్తాను. మీరు ఏం కావాలో వoడుకుని తినేయండి.”సమాధానం కోసం చూడకుండా వెళ్లిపోయారిద్దరూ.
పరoధామయ్య, సుభద్రమ్మ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు.
********-
తను ఖమ్మం లో ఉద్యోగం చేసే రోజుల్లో మొదటిసారి అమ్మ నాన్న ఖమ్మం వచ్చినప్పుడు తను స్టేషన్ కి వెళ్ళి,వారిని ఆప్యాయంగా పలకరించి ఇంటికి తీసుకొచ్చాడు.సుభద్ర ఎదురొచ్చి వారిని ప్రేమగా పలకరించి, అత్తగారి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొచ్చింది. కుశల ప్రశ్నలు వేసి కాఫీ ఫలహారాలు అందించింది.
ఆ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టేశాడు తను.
లోపలికి వెళ్ళి “చూడు. అమ్మకి నాన్నకి ఏం కావాలో కనుక్కుని సమయానికి ఇవ్వు.భోజనంలోకి కూడా ఏం తింటారో కనుక్కుని చెయ్యి. నాన్న కారంకారంగా తింటారు. చూసి చెయ్యి తెలియకపోతే అమ్మని కనుక్కునిచెయ్యి ” చెప్పాడు.
“ఆ విషయo మీరు ప్రత్యేకంగా చెప్పాలా? అదంతా నేనూ చూసుకుంటాను మీరు ఆఫీస్ కి వెళ్ళండి “అంది సుభద్ర.
వాళ్ళు ఉన్న వారం రోజులు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు వెళ్ళొస్తానని తల్లిదండ్రులకి చెప్పి, వారిని జాగ్రత్త గా చూసుకోమని, వేళకి భోజనం పెట్టేయమని భార్యకి చెప్పి వెళ్ళేవాడు. సాయంకాలం వచ్చేటప్పుడు వారికి నచ్చిన ఉపాహారాలు, పళ్ళు తీసుకొచ్చి, ప్లేట్స్ లో పెట్టి ఇద్దరికీ ఇచ్చేవాడు
రాత్రి భోజనాలు అయ్యాక నలుగురు కూర్చుని కష్టసుఖాలు మాట్లాడుకునే వారు.
“మీరిద్దరూ ఒంటరిగా అక్కడెoదుకు,?. ఇక్కడే మాతోపాటు ఉండిపోవచ్చుగా ” అంది సుభద్ర.
“లేదులేమ్మా….. ఇంకా మాకు కాస్త ఓపిక ఉందిగా.. ఓపిక తగ్గితే మీ దగ్గరకే వస్తాం. మాకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారు? ” అన్నాడు తండ్రి.
“అవునమ్మాయ్! మీకూ మొన్నీ మధ్యనేగా పెళ్లయింది. కొన్నాళ్ళు సరదాగా ఉండండి. పిల్లా పాప బయలుదేరితే మనవడితో ఆడుకోడానికి అప్పుడు వచ్చి ఉంటాములే.”అంది అత్తగారూ కోడలికి బుగ్గలు నిమిరి ముద్దు పెట్టుకుంటూ.
ఇద్దరికీ బట్టలు పెట్టి, కాళ్ళకి దణ్ణం పెట్టి ఆశీసులు తీసుకున్నారు.
పరoధామయ్య కొంత డబ్బు తండ్రి చొక్కా జేబులో పెట్టి, “ఏవైనా ఖర్చులకి ఉంటాయి ” చెప్పాడు.
“ఎందుకురా నాదగ్గర ఉన్నాయిలే “తండ్రి తియ్యబోతుంటే,”మీ దగ్గర లేవని కాదు, ఏదో నాతృప్తి కోసం ” తండ్రి చేతి మీద చెయ్యి వేసి ఆపాడు.
వాళ్లిద్దరూ ప్రయాణమై వెడుతుంటే పరంధామయ్య, సుభద్ర కళ్ళనీళ్ల పర్యంతం అయ్యారు. స్టేషన్ కి వెళ్ళి ట్రైన్ ఎక్కించి, ట్రైన్ కదిలే వరకు ఉండి వచ్చారు…..”తలుపు చప్పుడు అవుతుంటే
ఆలోచనలనుంచి తేరుకొని తలుపు తెరిచింది సుభద్రమ్మ.
కోడలు మనవడుని తీసుకుని వచ్చింది.
ఆమె కాళ్లు కడుక్కుని డ్రెస్ మార్చుకుని వచ్చే వరకూ ఆగి,”అమ్మాయ్! మేము బయలుదేరుతున్నాం అబ్బాయి వచ్చాక చెప్పు.”బేగ్ తీసుకుని చెప్పారు.
” అదేంటీ, పది రోజులు ఉంటారని చెప్పాడు సుధా,…” మనసులో సంతోషంగా ఉన్నా, అయోమయం నటించిందికమల.
“మరోసారి వస్తాం లేమ్మా,అయినా పిల్లాడికి సెలవులిచ్చినప్పుడు మీరే రండి. మేమిక్కడుంటే మీకూ ఇబ్బంది, మేమూ తిని కూర్చోవడం. అక్కడైతే గుడి, గోపురం, తెలిసినా వాళ్ళు రావడం, పోవడం . ఏదో కాలక్షేపం అయిపోతూo టుంది .”అన్నాడు పరoధామయ్య.
కమల సెల్ తీసుకుని “సుధా!మీ అమ్మ, నాన్న వెళ్ళిపోతామంటున్నారు…” చెప్పింది.
” అప్పుడేనా? అదేంటి.. నిన్ననే కదా వచ్చారు, ఉదయం నాతో ఏమి చెప్పలేదు.
ఉండమని చెప్పకపోయావా? ” ”
“… చెప్పాను వెళ్లాలట…..”
“సరే! నాకు ఇప్పుడే రావడానికి కుదరదు.. దారిఖర్చులకి డబ్బులున్నాయో లేదో ? వెయ్యో, రెండూవేలో ఇచ్చి పంపించు ” చెప్పాడు.
వెయ్యి రూపాయలు తెచ్చి వారి చేతిలో పెట్టి, వాళ్ళు బయటికి రాగానే తలుపులు మూసుకుంది.
ఇద్దరూ ఆటోలో బస్ స్టాండ్ కి వెళ్ళి తమ ఊరు వెళ్లే బసు ఎక్కి కూర్చున్నాక,మనసు స్థిమిత పడినట్లు అయింది. హాయిగా ఊపిరి పీల్చుకుని వెనక్కి జార్లబడి కూర్చున్నారు.
“గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్ ” భారతoలో నన్నయ రాసిన పద్య పాదం గుర్తుకొచ్చింది పరoధామయ్యకి.