తెలంగాణా రైతాంగ పోరాటం, స్వాతంత్ర్య సమరాలలో క్రియాశీల పాత్ర పోషించిన రావి సీతాదేవి గారు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా సూర్యాపేటలో భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, స్వాతంత్ర సమరయోధులైన శ్రీ రావి నారాయణరెడ్డి గారి సహధర్మచారిణి. వారితో పాటు తెలంగాణ రైతాంగ పోరాటం, స్వాతంత్ర్య సమరాలలో ప్రత్యక్షంగా పాల్గొని తన సంపూర్ణ సహాయ సహకారాల్ని అందించిన ధీరవనిత. భర్త నెలల తరబడి అజ్ఞాతంలో ఉన్నా ఏమాత్రం చింతపడకుండా అతనికి చేదోడై నిలిచిన ధీశాలి.
నిజాం నిరంకుశ పాలనపై పోరాటం సాగించే కమ్యూనిస్టులను నిజాం పోలీసుల ,రజాకార్ల డేగ కళ్ళ నుంచి కాపాడేందుకు తన నివాసాన్నే ఆంతరంగిక మందిరంగా చేసి విప్లవకారులకు ఆశ్రయాన్నిచ్చి వారికి వెన్నుదన్నై నిలిచిన వీర వనిత.
