అనుబంధం

కథ

‘హలో…..హలో….దిస్ ఈజ్ తేజ….హూ ఈజ్ దిస్ ..’

‘హలో……బుచ్చన్నా …..’  అటు నుండి ఆదుర్దాతో నిండిన అక్క  కంఠం….

అమ్మావాళ్ళకి తప్ప ఎవరికీ తెలియని తన అసలు పేరు …. ఇండియా నుండి …. దెబ్బకు నిద్రమత్తు వదిలింది…. బెడ్ పై నుండే కాల్ లిఫ్ట్ చేసినవాడినల్లా  దిగ్గున లేచాను …. ఇంత అర్ద రాత్రి .

‘అక్కా…. ఏమైంది …..’ వద్దనుకున్నా ఎదో భయం తొంగి చూసింది  నా కంఠం లో .

‘…. నాన్న కు కొంచెం ఆరోగ్యం బాలేక పొతే హాస్పిటల్ లో జాయిన్ చేసాను… నిన్నే కలవరిస్తున్నాడు …అమ్మ,  నాన్న దగ్గర హాస్పిటల్ లో ఉంది … తొందరగా రా…..’  అక్క అంది.

‘నాన్న …నాన్నకు ….ఇప్పుడెలా ఉందక్కా .. ప్రాబ్లం ఏమీ లేదు కదా….అమ్మతో నైనా మాట్లాడించ కూడదూ … నేను వెంటనే బయల్దేరుతాగాని …’

‘బానే ఉంది …హాస్పిటల్ లో సిగ్నల్స్ లేవు గాని …నువ్వు రారా ……’పెట్టేసింది ..

   ఇక నిద్ర పట్టలేదు…. ఎంతో అత్యవసర మైతే తప్ప అక్క రమ్మనదు . ఏమైంది నాన్న కి…

మనసెందుకో కీడు శంకించింది.

పక్కన సునీల, పిల్లలిద్దరూ  హాయిగా నిద్ర పోతున్నారు. తను ఒక్కడే వెళ్ళాలా …అందరు వెళ్ళాలా… ఇంత హడావుడిగా అంటే…. అయినా ఫర్లేదు… అందరు వెళ్ళడమే మంచిది.. అమ్మ ఎన్నో సార్లు అడిగింది అందరూ రమ్మని… దాదాపు ఆరేళ్ళవుతోంది పిల్లలతో వెళ్లి … పిల్లలతో ఏంటి… చిన్న పాప పుట్టిన దగ్గర నుండి కూడా అమ్మ,నాన్న  చూళ్ళేదు…స్కైప్  లో చూడడమే తప్ప ….  అందరితో కల్సే వెలితే  సరి ..

అర్జెంట్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసాను ….  ఆఫీస్ కి లీవ్  అరేంజ్ మెంట్స్ చేసుకున్నాను .

      విషయం చెప్పి అర్జెంట్ గా సునీలని పిల్లలని బయల్దేరదీసాను … ప్రతీ చోట సమయానికే తప్ప డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా , ఫ్లైట్ తర్వాత కూడా టాక్సీ , కాబ్ బుక్ చేసుకుని ఫోన్ లో అక్క, బావ లతో టచ్ లో ఉంటూ తమ ఊరిలోకి అడుగు పెట్టాడు.

      మట్టి రోడ్డు పోయి సిమెంట్ రోడ్డు వచ్చింది. గుడిసె లలాంటి ఇంటి ముందర ఉండే ఆవులు, గడ్డి వాములు పోయి చిన్న చిన్న డాబా ఇళ్లయ్యాయి… పెంకుటింటి ముందు, డాబా ఇళ్ళ ముందు ఇంతక ముందు అందరూ కూర్చుని  మాట్లాడుకునే అరుగులు పోయి , గోడలు గేట్లు వెలిసాయి.  గడప పై పసుపు పూసి బొట్లు పెట్టి, గడప చుట్టూ ఎర్రమట్టి తో అలికి , వాకిట్లో పచ్చని పేడతో కల్లాపి చల్లి , తెల్లని ముగ్గు వేసే  సంస్కృతి  పోయి  సిమెంట్ వాకిళ్ళ పై కలర్లతో ముగ్గువేసే సంస్కృతి  వచ్చింది.  ఇపుడిపుడే నాగరికత సంతరించుకుంటున్న ఊరు … అప్పటి పాత ఆనవాళ్ళు లేకుండా చేసుకోవడానికి వ్యర్ద ప్రయత్నాలు చేస్తోంది.

     కారు నెమ్మదిగా పోతోంది… సునీల పిల్లలు దూర ప్రయాణం వల్ల అలసిపోయి నిద్రపోతున్నారు.. పక్కనున్న పచ్చని పోలాలనుంది చాలా స్వచ్చమైన పైరగాలి వస్తోంది. అది ఎంత ఆహ్లాద పరుస్తున్నా, తెలియని ఆందోళన మనస్సును మెలిపెడుతోంది. రాత్రి నుండి నిద్ర లేదు. విమానం లో కూడా ఎంత కళ్ళు మూసుకున్నా ఆలోచనలే తప్ప నిద్ర రాలేదు.. ఎన్నెన్నో  జ్ఞాపకాలు, మధుర స్మృతులు …

. నాన్న ఆజంజాహి మిల్ లో కార్మికుడు. ముగ్గురు  అన్నయ్యలు , ఒక అక్క  తర్వాత  తను పుట్టాడు. తను పుట్టక ముందు అనారోగ్యం చేసి అన్నయ్య లిద్దరూ పొద్దున్న ఒకరు,  సాయంత్రం ఒకరు చనిపోయారట.  అంతకు ముందే ఒక అన్నయ్య చనిపోయాడట. అమ్మ గుండెలవిసేలా ఏడ్చిందట.  అందుకే తను బతకాలని  పుట్టగానే ముక్కు కుట్టించి బిక్షపతి అని పేరు పెట్టారట. చిన్నప్పటి నుండి ఇంట్లో అమ్మ, నాన్న,అక్క అందరూ బుచ్చన్నా అనే పిలుస్తారు. వాళ్ళు , మేనమామ  తప్ప ఎవరైనా ఆ  పేరు పెట్టి పిలవరు. తన పెళ్ళికి ముందు ఎంగేజ్ మెంట్ లో  సునీల ముందు వాళ్ళు బుచ్చాన్నా అని పిలుస్తుంటే , ఆమె ఎవర్నో అనుకుందట. నాన్న కూడా స్కూల్లో చేర్పించేప్పుడు ప్రత్యక్ష దైవం సూర్యుడు కాబట్టి ,తన ఇంటికి దేవుడిలా పుట్టాడని సూర్య తేజ అని పేరు పెట్టాడు…

      మిల్లు సైరన్ పొద్దున్న నాలుగు గంటలకే మోగేది. అప్పుడు నిద్ర లేసి  , అరగంట లో

తయారై వెళ్ళిపోయేవాడునాన్న. అమ్మ నాన్నకు టిఫిన్ ఇచ్చి రమ్మని తనను,  అక్కను పంపేది. అప్పుడు మూడు నాలుగు గిన్నెలతో ఇంత పొడుగు టిఫిన్ బాక్స్ ఉండేది. అందులో  ఒక దాంట్లో గడక (జొన్నన్నం), ఒక దాంట్లో పెరుగు, ఒకదాంట్లో మామిడి కాయ పచ్చడి లేదా కూర , ఒక దాంట్లో పెరుగు ఉండేవి… ఆ టిఫిన్  బాక్స్, చెంబులో నీళ్ళు పట్టుకుని తను ,అక్క  అడ్డదారి గుండా మిల్లు లో ఉన్న నాన్నకు సద్ది తీసుకెళ్ళే వాళ్ళు. నీళ్ళు తాగడానికి కాదు. చెప్పులు లేని తమ కాళ్ళకు ఎండలో బొబ్బలు రాకుండా . అక్కా, తనూ పరుగెడుతూ కాళ్ళపై నీళ్ళు పోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. స్కూల్ కి కూడా అక్క, తను  చెప్పుల్లేని కాళ్ళ తోనే వెళ్ళేవాళ్ళు.  మిల్లు లోని కాంటిన్ లో  గళ్ళ లకు గళ్ళ ల్లా ఉండే బూంది నాన్నకు పది పైసలకే వచ్చేది. రోజూ నాన్న రాగానే లోపలనుండి పరుగెత్తుకుని వెళ్ళేవాళ్ళు  తను, అక్క… నాన్న ఇద్దరికీ బూంది ఇస్తూ చెరో ముద్దు ఇచ్చేవాడు.

 నాన్నకు ఆయుర్వేద వైద్యం తో పాటు , ఆధ్యాత్మికత, భజనలు ,పాటలు చాలా ఇష్టం. దాశరధిశతకం లోని ‘ముప్పున కాల కింకరులు ముంగిట నిల్చిన వేళ…. కఫము కుత్తుక జొచ్చిన వేళ..రామా… నీ నామ స్మరణ కలుగునో కలగదో …నాటి కిప్పుడే నేను జేసెద నీ నామ స్మరణ   దాశరధీ దయాపయోనిదీ ….’ పద్యం ,  ‘శ్రీమనోహర సురార్చిత సింధు గంభీర భక్త వత్సల కోటి భానుతేజ ….  కంజ నేత్ర హిరణ్య కశ్య నాశక సూర సాధురక్షణ శంఖ చక్రహస్త ….ప్రహ్లాద వరద పాపద్వంస సర్వేశ కృష్ణ సాగర శయన కృష్ణ వర్ణా …పక్షి వాహన లసత్బ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మ యుగళా… చారుశ్రీ చందనాగరు చర్చితాంగ కుంద కుట్మల వైకుంట ధామ భూషణ వికాస శ్రీ ధర్మ పుర నివాస …దుష్ట సంహార నరసింహ దురిత దూరా….’ అంటూ నరసింహ శతకం లోని పద్యాలు రాగ యుక్తంగా ఎంత చక్కగా పాడేవారో… తనకూ అందుకే కంఠతా అయిపోయాయి. ఇవి మాత్రమేనా …. ‘జై జై మహాత్మా గాంధీ …. నీదే స్వాతంత్రా దీక్షా ….’ అంటూ గాంధీ గురించిన దేశ భక్తీ గేయాలు, పక్కనే ముస్లిం వాళ్ళు ఉండటాన ఉర్దూ లో గేయాలు పాడేవాడు. దూదేకుల వాళ్ళ ఇల్లు, దర్జీ పని చేసే ఖాజుద్దిన్ వాళ్ళిల్లు అన్నీ పక్క పక్కనే ఉండటం వల్ల హిందీ కూడా తెలుగంత స్పష్టం గా మాట్లాడే వాడు. తనూ వహీదక్క, జునీదన్న అని గోడ పక్కనే ఉన్న  వాళ్ళింట్లో ఎప్పటికీ ఆడుకుంటూ ఉండేవాడు. ఇక సాయంత్రం అయితే చాలు ఏడు గంటల వరకే అంతా భోజనాలు చేసి తమ ఇంటి ముందున్న అరుగు మీదకు చేరేవారు..సరిగ్గా వీధి లైట్  తమ ఇంటి ముందే ఉండేసరికి అంతా అక్కడికే చేరే వారు.  ఇక అక్కడ నాటకాలు, పద్యాలు, భజనలు, జోకులు, కష్ట సుఖాలు సకలం పంచుకునే వారు. మగవాళ్ళు నాటకాలు వేస్తూ , పద్యాలు పాడుతుంటే ఆడవాళ్ళు అంతా ఒక పక్కన మిగతా అరుగుల పైన కూర్చుని చూసేవారు. పిల్లలు అమ్మా నాన్నలతో పాటు చిరతలు, తబలా లాంటివి వాయిస్తూ తమ తోటి పిల్లలతో ఆడుతూ ఎంజాయ్ చేసేవారు.  అసలు ఆ సమావేశం ఎంత  లైవ్ లీ గా ఉండేదంటే అందరూ  రోజూ పోద్దటి నుండి చేసిన శ్రమ నంతా అక్కడ మర్చి పోయేవారు. ఆ సాయంత్రం కోసం ఎదురు చూసేవారు.

     అలా పది వరకు ఆడుతూ పాడుతూ చదివిన తను ఇంటర్ లో తప్పని సరై దగ్గరలోని పట్టణం లో హాస్టల్ లో చేరాడు. అమ్మానాన్నలను వదిలి అలా ఉండడం అదే మొదటి సారి కావడంతో చాలా కష్టమయ్యేది. అమ్మానాన్న లకు కూడా అంతే… వారానికి ఒక్క రోజు ఇంటికి వచ్చే తన కోసం కళ్ళు కాయలు కాస్తూ ఎదురు చూసేవారు.

     నాన్నకు తానంటే చాలా ప్రాణం. ఒక సారి అమ్మ ఇంట్లో బోడ కాకరకాయ కూర వండింది.

నాన్న తో పాటు అందరూ శాఖాహారులే.  అదే చాలా మంచిది అనేవాడు.   తనకు బోడ కాకరకాయ కూరంటే చాలా ఇష్టం. కాబట్టి నాన్న ఆరోజు, ‘ ఆకూర నా కొడుక్కు ఇచ్చి వస్తాను ….బాక్స్ లో పెట్టి ఇవ్వు’ అన్నాట్ట…. దానికి అమ్మ, ‘ బస్ లో వెళితే రాను పోనూ డబ్బులు ఖర్చు అవుతాయి…ఎలాగూ వాడు మరో రెండు రోజుల్లో ఆదివారానికి వస్తాడు కదా… ఏమొద్దు’ అందిట. దానికి నాన్న, ‘ ఈ కూర వాడికి బాగా ఇష్టం ..ఇవ్వాళ ఎలాగైనా వాడిని చూడాల్సిందే … నా చేత్తో వాడికి ఈ కూర పెట్టాల్సిందే….  బస్ కి డబ్బులు అంటున్నావు కాబట్టి నా సైకిల్ పై వెళతాను…’ అన్నాట్ట. అమ్మ , ‘ రాను పోను నలభై కిలో మీటర్లు ఎలా తోక్కుతావయ్యా … వద్దులే..’ అన్నా వినకుండా  బాక్స్ లో పెట్టమన్నా డ ట. కొంచెం కూర ఇంట్లో ఉంచి మిగతాది వేసిస్తే, ‘  వద్దు..మనకు లేకున్నా ఫర్వాలేదు…వాడి ఫ్రెండ్స్ కూడా ఉంటారుగా… నీ చేయివంట అందరికీ ఇష్టమే.. మొత్తం వేయి ..అంటూ గిన్నె మొత్తం ఊర్పించి బాక్స్ లో పెట్టి సైకిల్ పై బయల్దేరాడట… అయితే అదే రోజు తనకు నాన్నను చూడాలని పించడం తో , కాలేజీ హాస్టల్ లో పర్మిషన్ తీసుకుని బయల్దేరాడు. అప్పుడు ఫోన్ లు లేవు కాబట్టి నాన్న సైకిల్ పై అటు, తాను  బస్ పై  ఇటు వచ్చామట… నాన్న తన ఫ్రెండ్స్ కి ఆ కూర ఇచ్చి , ఉసూరు మంటూ మళ్ళీ సైకిల్ పై వచ్చేసరికి చాలా రాత్రయి పోయింది. నాన్న రాగానే తనను దగ్గరకు తీసుకుని ఈ విషయం చెబుతుంటే, అమ్మ, ‘ ఇంట్లో కొంచెం కూడా వాడికి దక్కనియ్యక మొత్తం కూర తీసుకుని, వాడిని తినకుండా చేస్తివి’ అంటూ ముద్దుగా విసుక్కున్నా..అందరం తెగ నవ్వుకున్నాం.   ఆ రోజు తన కిష్టమైన కూర తినకున్నా నాన్న కోసం తాము ఎప్పటిలా  తినకుండా ఎదురు చూసి వచ్చాక పచ్చడి మెతుకులు తిన్నా , ఆ ఆనందమే వేరు…

  అలాగే నాన్నకు చలి అస్సలు పడేది కాదు . చిన్న చిరు చలి కైనా వణికి పోతూ రగ్గు కప్పుకునే వాడు . తల చుట్టూ నల్లని మఫ్లర్  కట్టుకునేవాడు. అమ్మ, అక్క వెక్కిరిస్తుంటే తను నాన్న జట్టుండి నాన్నకు ఇంకా వెచ్చగా కప్పేవాడు. మిల్లుకు చలికాలం  చలి లో నాన్న వెళ్ళడానికి చాలా కష్ట పడేవాడు. ఒక్కోసారి షిఫ్ట్ మార్చుకునేవాడు. అయినా అలా అయితే మధ్యాన్నం వెళ్ళినా రాత్రి పది గంటలకు చలి ఉండేది. కాబట్టి తను నాన్నకు తెలీకుండా తమ ఇంటికి వచ్చిన మామయ్యలు , చుట్టాలు ఇచ్చిన డబ్బులు,  తన పుట్టిన రోజుకు బట్టలు వద్దు …గల్లాలో దాచుకుంటా అంటే అమ్మానాన్న ఇచ్చిన డబ్బులతో ఒక స్వెట్టర్,   మంకీ కాప్ కొన్నాడు నాన్నకి. దానికి నాన్న ఎంత సంతోష పడ్డాడో… ఎంత మందికి చూపించి , నా కొడుకు ఇచ్చాడని గర్వంగా చెప్పాడో…. ఇప్పటికీ తను అమెరికా నుండి పంపించిన మంచి మంచి స్వెట్టర్ లు ఉన్నా నాన్న దాన్నే ఇష్టపడతాడు. అలా చెప్పుకుంటూ పొతే ఎన్నెన్ని జ్ఞాపకాలో….

        మొన్న నాన్న మాట్లాడేప్పుడు, ‘ తమ ఇంటికి ముందున్న ఖాళీ స్థలం లో ఒక వేదిక,  హాల్ కట్టిస్తే , నాట్యం, సంగీతం , నాటిక ,పెళ్లి, సంబరాలు అలా ఆ ఊరిలోని ఎ వేడుక కైనా అది వేదిక అవుతుంది, కళలను పోషించినట్లు, పేదవాళ్ళని ఆదు కున్నట్లు అవుతుంది రా… అలాగే అమ్మ కి గుడి అంటే ఇష్టం. ఎప్పటికి నేను అన్నివేళలా ఉండను కదా తనను తీసుకెళ్ళడానికి, అందుకే చిన్న గుడి కట్టిస్తే బావుండు… ఖాళీ సమయాల్లో అక్కడ అమ్మ , నేను చిన్న పిల్లలకి, భగవత్గీత , సుమతి, వేమన, నరసింహ శతకాల లోని పద్యాలు చెప్పొచ్చు.’ అన్నాడు. ‘సరే…చూద్దాం నాన్నా.’ అన్నాడు.ఆ విషయం కూడా మాట్లాడాలి.

     చిన్న కుదుపుతో కారు ఆగేసరికి  ఆలోచనల నుండి బయటకు వచ్చాను. ఆ కుదుపు తో సునీల కూడా లేచి చుట్టూ చూస్తోంది. బయటకు చూసాను. టెంట్ వేసిన ఎదో ఇంటి ముందు కారు ఆగింది. ఇది మా ఇల్లు కాదంటూ కార్ డ్రైవర్ కి చెప్పబోతూ ఆగిపోయా…. ఎందుకంటే ఆ అరుగుల మీద ఉన్న బావ, మామయ్యా, ఇతర బంధువులు కారు ను చూసి లేచి కారు దగ్గరకు వస్తున్నారు. ఉలిక్కి పడి  తీక్షణంగా చూసా… మా ఇల్లే… ఇంటి ముందు కాలుతున్న కట్టెలు …

 అంటే….. మస్తిష్కం మొద్దు బారింది.. రెండు రోజుల ముందు,’కన్నా…  మన ఊళ్ళో గుడో, బడో కట్టించాలని ఉందిరా ….దేశం గాని దేశం లో ఉన్నావ్..జాగ్రత్త .. ‘ అంటూ తనకు జాగ్రత్తలు చెప్పిన నాన్న  తన జాగ్రత్త చూసుకోలేక పోయాడు… తను ఇంకా తన కోసం తన కిష్టమైన కూర నాన్న వండించి తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనుకున్నాడు… ఇంత హటాత్తుగా…కారు దిగిన తనను బావ, మామయ్య హత్తుకున్నారు  విలపిస్తూ…  మానసికంగా నిర్వీర్య మైన తన దేహాన్ని  ఇద్దరూ  అతి కష్టం పైన నడిపిస్తూ లోనకు తీసుకెళ్ళారు. లోపల హాల్లో నాన్న  వాలు కుర్చీ పక్కన మంచు ముక్కల పైన నాన్న దేహం నిర్జీవంగా …పూలదండలతో ….

    చలికి వణికి పోయే నాన్న దేహం ఇప్పుడు మంచు ముక్కలపై…అన్ని గంటలు… నా కోసం…

ఆ దేహం పై చిన్నప్పుడు నేను కొనిచ్చిన స్వెట్టర్… భరించ లేక పోయా…. నాన్న పాదాల పక్కన రేగిన జుట్టు , ఉబ్బిన కళ్ళతో  శోక దేవత లా అమ్మ, పక్కనే  నిలువెల్లా నీరైన అక్క.

   నన్ను, సునీలను, పిల్లలను చూడగానే ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి…  అమ్మ ఒళ్లో వాలుతూ  చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాను.  నాన్న పాదాలను కన్నీటి తో కడిగాను..

     ఇక తర్వాత తతంగం అంతా కలలోలా జరిగి పోయింది. చిన్ననాటి నేస్తాలంతా ఎంతో ఆప్యాయంగా హత్తుకుని ఓదార్చారు.  చిన్ననాటి ఊసులెన్నో మాట్లాడు కున్నాం..నాన్న  బూడిద, అస్తికలు అన్నీ కాశీ, కాళేశ్వరం  అన్ని పుణ్య క్షేత్రాలలో కలిపాం.

అయిదవ రోజు అక్క, బావ , ‘అమ్మ ఇక పై ఎక్కడ ఉంటుంది’  అన్న విషయం లేవదీసారు .

‘నాన్న లేని ఈ ఇంట్లో ఇక అమ్మ ఉండదు.ఉంటె పదే పదే నాన్న జ్ఞాపకాలతో ఆరోగ్యం ఖరాబవుతుంది… కాబట్టి నేను తీసుకెలతాను… లేదంటే నేను అక్కడ రిజైన్ చేసి ఇక్కడికే వచ్చేయమన్నా వస్తాను…  అమ్మకు ఏది ఇష్టమైతే అలాగే చేద్దాం..’  అన్నాను.

‘అమ్మ గురించి నువ్వు నీ సెటిల్ అయిన జీవితాన్ని ఈ వయసులో వదిలి ఎందుకు బాధ పడటం.. అమ్మ నే తీసుకెళ్ళు.. అమ్మకీ స్థల మార్పిడి అయి కొంచెం ఆరోగ్యం కుదుట పడుతుంది’ అన్నారు బావ.

  ‘అలా  అయితే ఈ ఇళ్లెం  చేసేది… తాళం వేస్తె వట్టిగా బూజులతో పాడు పడి పోతుంది….

ఆ తర్వాత అయినా నువ్వేమయినా ఇక్కడికి వచ్చి ఉండేది ఉందా….. ఈ ఊరు సర్పంచ్,  ఇల్లు అమ్మితే కొంటా నంటున్నాడు… ఈ సమయం లో ఇది అడగడం తప్పే అయినా నువ్వు మళ్ళీ అమెరికా వెళితే కష్టం కాబట్టి అడగమన్నాడు ‘ అన్నాడు మామయ్యా…

‘మీ ఇష్టం మీరెలా అంటే అలాగే…..’ అన్నాను.

  ఆ సాయంత్రం మల్లె చెట్టు పందిరి కింద మంచం లో అమ్మ  పక్కనే కూర్చున్నా…. జాజి, మల్లె , మరువం,లిల్లి రకరకాల పూల చెట్ల నుండి పరిమళం హాయిగా ఉన్నా మనస్సంతా ఎదో ఆందోళన… ఇదమిద్దంగా ఇది అని చెప్పలేని బాధ…. అమ్మానాన్న ఈ ఇంటి కోసంఎన్నో కష్టాలు పడ్డారు … నాన్నకు చలి పడదని , తను గోడలకు నీళ్ళు పట్టేవాడు.పుస్తకాల అర, బట్టలు పెట్టుకునే అరలు అక్క, తను కొట్లాడి తమ కిలా ఉండాలని ఎదో రారాజుల్లా తమ కిష్ట మైనట్లు కట్టించు కున్నారు. వాటిలో పుస్తకాలే కాదు ,,వాటి మధ్యలో వెలుతురు  చూడని నెమలీకలు, అమ్మ రాత్రితన వంతుకు  ఇచ్చే సర్వ పిండి చెక్కలను, చింతగింజలను , డబ్బులు దాచుకునే గల్లాను ఇలా  సకలం పెట్టుకునేవాడు. ఆ అర పక్క గోడ పై దేవుడి బొమ్మలు, రోజు వారి టైం టేబుల్ అంటించు కునేవాడు. అమ్మ కూడా స్టౌ పెట్టడానికి గట్టు, పక్క గిన్నెలు పెట్టడానికి, అటక పైన తమకు అందకుండా పిండి వంటలు పెట్టడానికి అరలు అలా చేయించింది. ఇక దేవుడి గది అయితే దీపావళికి నోము కుండ లకు అమ్మ పెట్టె బొట్లతో, దీపాలతో వెలిగి పోయేది . ఆ ఇంట్లోని ప్రతీ వస్తువుతో, ప్రతీ చోటుతో తనకెంతో మధురమైన మరపురాని అనుబంధం ఉంది. తనకే ఇలా ఉంటె తన కన్నా ఎక్కువ ఏళ్ళు నాన్నతో ఇదే ఇంట్లో గడిపిన అమ్మకెన్ని ఉండాలి. అసలు అమ్మను ఒక్క మాట అడక్కుండా అమ్మేద్దాం అనేసాడు…

  ‘అమ్మా… ఇల్లు అమ్మేయడం నీకు ఇష్టమేనా….’ అన్నాను… మాటివ్వడం, ఒప్పందం అన్నీ అయిపోయాక అడుగుతున్నందుకు గిల్టీగా ఫీలవుతూ… అమ్మ మాట్లాడ లేదు. కాని అమ్మ కంటి నుండి వచ్చిన నీళ్ళు ఎన్నో అర్దాలు చెప్పాయి.

    తెల్లవారి పదవ రోజు .. ‘ఇప్పటి వరకేప్పుడూ ఎ పక్షీ తొందరగా ముట్టడం లేదు… నాన్న కోరికేదైనా  ఉందేమో … సరిగ్గా మొక్కుకో రా బుచ్చన్నా..’ అక్క గద్గద కంఠం తో అంది. ఇవన్నీ నమ్మక పోయినా నాన్నను తల్చుకుని , ఒక కోరిక చెప్పుకున్నా… అంతే….

‘అరె..ఏమనుకున్నావురా, ఇప్పటివరకూ లేనిది ..అదిగో రకరకాల పక్షులన్నీ ఎలా గుంపుగా వచ్చి ముడుతున్నాయో’ సంభామాశ్చర్యాలతో అక్క, బావ అంటున్నారు. కళ్ళు తెరిచాను. నిజమే…

  ఇంటి కొచ్చాక  అందరి ముందు ,’ అక్కా… అమ్మా…. అందరికీ చెబుతున్నాను… నేను ఇంతకూ ముందు కోరుకున్న కోరిక, నాన్నకు నచ్చిన కోరిక చెబుతున్నాను. ఈ ఇల్లు అమ్మ బోవడం లేదు. ఇక్కడి మనుషులతో, ఈ నేలతో నాకున్న అనుబంధం మరపురానిది, మరవలేనిది. ఏనాటికైనా  ఇక్కడికి వచ్చినప్పుడు నాకూ ఈ ఊరితో గానీ, ఈ ఇంటి తోగాని, ఇక్కడి ఆత్మీయులతో గాని  ఎ సంబంధం లేదన్నది నేను ఊహామాత్రంగా నైనా భరించలేను. అందుకే ఇంటి ముందున్న విశాలమైన ఖాళీ ప్రదేశం లో చిన్న గుడి, దాని పక్కనే లైబ్రరీ ని, సకల కళలు ప్రదర్శించడానికి వేదిక, హాలు  ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. అలాగే అమ్మ నుదుటి సింధూరం లో నాన్న కనపడతాడు. గాజుల గలగలల్లో నాన్న వినపడతాడు. చిన్నప్పటి నుండే  వచ్చిన కుంకుమ,పసుపు, పూలు తీసే హక్కు ఎవరికీ లేదు .  ఒక్క అమ్మ విషయం లోనే కాదు , మహిళలను ఏంతో  మానసిక వేదనలకు గురి చేసే ఆ తంతు,  భర్త పోయిన ఎ మహిళ కూ జరగకుండా చూస్తానన్నది ’  నాన్న కిచ్చిన మాట …’ నామాటలింకా ముగిసాయో లేదో, అందరి చప్పట్ల మధ్య అమ్మ నుదుటి పై ముద్దిచ్చి , అమాంతం  నన్ను అక్కున చేర్చుకుంది. అది నాన్న భరోసాలా, అమ్మ అనురాగంలా హాయిగా ఉంది .

Written by Namani Sujanadevi

పూర్తి పేరు- నామని సుజనాదేవి

ఫోన్ నెంబర్ : 7799305575

స్వ స్థలం- హన్మకొండ ,వరంగల్.

.ఉద్యోగం/ వృత్తి- భారతీయ జీవితబీమా సంస్థ లో లీగల్ మేనేజర్

ఇప్పటి వరకు దాదాపు 250 పైగా కథలు అన్నీ ప్రముఖ మాగజీన్లలో , పత్రికల్లో, వెబ్ సైట్ లలో ప్రచురించబడ్డాయి.

వెలువరించిన పుస్తకాలు.. 2 కవితా సంపుటాలు, 6 కథా సంపుటీలు, ఒక నవల.
ప్రధానమంత్రి గారు, 75 వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆన్లైన్లో దేశంలోని అన్ని జిల్లాలకు పెట్టిన లోరీ పోటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా నుండి ప్రథమ బహుమతి.
ఇటీవల స్వాతి వారి అనిల్ అవార్డు, ఎక్స్రే వారి ప్రధాన కవిత పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ కథ రచయిత్రి పురస్కారం అందుకున్నాను.

ఇప్పటివరకు దాదాపు 50 కి పైగా బహుమతులు పొందిన కథలు, కవితలు. ప్రతిలిపి వెబ్సైటు లో ఆరు లక్షల పై చిలుకు అభిమానులు.

కొన్ని కథలు కన్నడం లోకి, ఆంగ్లం లోకి అనువదించ బడ్డాయి. కొన్ని కథలు ఆకాశవాణిలో ప్రసారం చేయబడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మహిళా సమస్యలపై నవ’తరాన’ -మిస్సెస్ ఫలాన

సామాన్యుల పంచాంగం