చరిత్ర కెక్కని శతగ్నులు

భరతమాత దాస్యశృంఖలాలను త్రెంచడానికి తమ జీవితాలను ఫణంగా పెట్టిన ఎంతోమంది వీరులు, యోధుల చరిత్రలు మనకు తెలిసినవే. అది ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామమే కావచ్చు , సిపాయిల తిరుగుబాటే కావచ్చు , మరింకేదైనా అయి ఉండవచ్చు. కానీ అంతిమంగా వారందరి లక్ష్యం ఒక్కటే. స్వాతంత్ర్య సముపార్జన. ఎన్నో త్యాగాల ఫలితంగా వారు మన కందించిన స్వేచ్ఛా వాయువులకు సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారీ మనం అభిమానం చాటుకుంటూనే ఉన్నాం. అంజలి ఘటిస్తూనే ఉన్నాం. కానీ లెక్కకు మిక్కిలిగా ఉన్న ఈ చరిత్ర కెక్కని శతగ్నులపై ఓ ఆరాధనా వీచిక.

వీరమంగై కుయిలీ :

పరాయి పాలనను అంతమొందించడానికి తన్నుతాను ఆహుతి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి ఆత్మార్పణ యోధురాలు. శివగంగై (తమిళనాడు) రాజ్యపు వీరమంగై కుయిలీ.

పెరియముతాన్ – రాకు దంపతులకు జన్మించిన 17వ శతాబ్దపు దళిత యువతి. పంట పొలాలను నాశనం చేస్తున్న ఒక అడవి ఎద్దును ఎదుర్కొనే ప్రయత్నంలో హతమైన సాహస వంతురాలి రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఈ కుయిలీ. భార్య మరణంతో కలత చెంది, కూతురిని తీసుకుని తానున్న చోటు నుండి శివగంగై రాజ్యానికి వెళ్ళిపోతాడు ఈమె తండ్రి. తండ్రి ద్వారా తన తల్లి యొక్క వీరోచిత గాథల్ని తెలుసుకొని, స్ఫూర్తి పొంది తల్లిని మించిన తనయగా రూపుదాలుస్తుంది. తండ్రి మార్గదర్శకత్వంలో యుద్ధ విద్యలన్నిటిలోనూ అంతులేని నైపుణ్యాన్ని సంపాదిస్తుంది.

1780 లో జరిగిన మొట్టమొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ వలసదారులపై తిరగబడిన మొట్టమొదటి భారతీయ పాలకురాలు రాణి వేలునాచియార్. బ్రిటిష్ వారితో సలిపిన పోరులో తన భర్త అమరుడవడంతో, అజ్ఞాతంలోకి వెళ్లిన రాణీగారి సైన్యంలో గూఢచారిగా ఇతను (కుయిలీ తండ్రి) నియమింపబడుతాడు. అతనిలోని అంకితభావం, నిబద్దతల కారణంగా రాణీగారికి అత్యంత విశ్వాసపాత్రుడిగా మారుతాడు. అతని ద్వారా అతని కూతురులోని ధైర్యసాహసాలను తెలుసుకున్న రాణీగారు ఆమెను తన అంతరంగికురాలిగా నియమించుకుంటారు. తల్లి రక్తపుజాడలు, తండ్రి దిశా నిర్దేశంతో రాణీగారిని కంటికి రెప్పలా కాపాడుతూ, బ్రిటిష్ వారు 2,3 సార్లు ఆమెపై చేసిన హత్యా యత్నాలను అత్యంత చాకచక్యంతో తిప్పికొడుతుంది. ఈ ప్రయత్నంలో తీవ్రంగా గాయపడుతుంది. రక్త మోడుతున్న ఆమె గాయాలకు కట్టుగట్టే నిమిత్తం రాణీగారు తృటిలో తన చీరకొంగును చింపారంటే, వారి హృదయంలో ఆమె ఎంతటి స్థానాన్ని సంపాదించుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరో సందర్భంలో తన సిలంబం(ఆయుధ ఆధారిత యుద్ధ కళ) గురువును రాణీ గారిని హతమార్చడానికి నియమింపబడిన శత్రుపక్షపు గూఢచారిగా పసిగట్టి, అతన్ని అక్కడికక్కడే హతమారుస్తుంది. దీంతో రాణీగారు ఆమెను తన సైన్యంలోని మహిళా విభాగానికి సైన్యాధ్యక్షురాలిగా నియమిస్తారు.

ఎనిమిదేళ్ల అజ్ఞాతవాసంలో మారుతుపాండ్యార్లు, టిప్పు సుల్తాన్, హైదర్అలీ వంటి రాజకీయ దిగ్గజాలతో కూటమి నేర్పరచుకున్న రాణీగారు పటిష్టమైన సైన్యంతో తన రాజ్యాన్ని తిరిగి పొందడానికి బ్రిటిష్ వారిపై సమరశంఖం పూరిస్తారు. ఈ ప్రయత్నంలో వారిపై పలుమార్లు విజయం సాధించినప్పటికీ, అత్యంత శక్తిమంతమైన వారి ఆయుధ సంపత్తి తమ విజయానికి అవరోధం అనే ఆలోచనలో పడతారు వేలునాచియార్.

నాచియార్ నీడైన కుయిలీకి పరిష్కారమార్గం రెండు రూపాల్లో కనిపిస్తుంది. మొదటిది వారి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం లేని పక్షంలో వాటిని సమూలంగా నాశనం చేయడం. దీనికి కోసం పథకం రచించడం మొదలు పెడుతుంది.

శరన్నవరాత్రుల పరిసమాప్తి సందర్భంగా పదవ రోజు కోటలోని రాజరాజేశ్వరి అమ్మన్ దర్శనార్థం మహిళలను లోనికి అనుమతించారన్న వార్తను తెలుసుకుంటుంది. తలవని తలంపుగా అందిన ఈ అవకాశాన్ని తన పథకం అమలుకు దొరికిన సువర్ణావకాశం గా భావిస్తుంది.

తన అధ్యక్షతలోని మహిళా (40,000 మందితో కూడిన) సైన్యాన్ని సాధారణ పౌరుల వలె కోట చుట్టూ మోహరింపజేస్తుంది. పువ్వులు, పండ్ల బుట్టల లోపల ఆయుధాలను దాచిపెట్టి మరి కొంతమంది మహిళలు కోటలోనికి ప్రవేశిస్తారు. వీరిని అంచనా వేయడంలో బ్రిటిష్ వారు దారుణంగా విఫలమౌతారు. దీపాలు వెలిగించడానికి వెంట తెచ్చుకున్న నెయ్యిని (పథకంలో భాగంగా) మహిళలు మూకుమ్మడిగా ఆమెపై గుమ్మరించడం, ఆమె స్వయంగాన్ని నిప్పంటించుకుని, జ్వలించే అగ్నిగోళమై ఆయుధాగారంలోకి దూసుకెళ్తుంది. ఈ హఠాత్పరిణామానికి నివ్వెరపో యిన బ్రిటిష్ వారు తీరుకునేలోపే జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఈ అవకాశాన్ని అస్త్రంగా చేసుకొని వేలునాచియార్ వారిపై గెలుపు సాధించి రాజ్యాన్ని కైవసం చేసుకుంటుంది.

తమిళ భాషలో ‘వీరమంగై’ అంటే వీరనారి అని అర్థం. తమిళనాడు ప్రభుత్వం ఎట్టకేలకు వీరి స్మారక స్థూపాన్ని తమిళనాడులోని శివగంగ జిల్లాలో స్థాపించింది.

హాడీరాణి(సహల్ కన్వర్):

హాడీరాణి అంటే ‘హడా’ వంశానికి చెందిన స్త్రీ అని అర్థం. ఈ విధంగా పిలువబడటం వారి వంశాచారం.శౌర్యప్రతాపాలకు మారుపేరైన వీరు యుద్ధ ప్రియులు. రాజపుత్రులు పరిపాలించిన రాజ్యం కనుక ఈ ప్రాంతం ‘ రాజస్థాన్ ‘
అని పేరొందింది. పలు వీరగాథ లతో నిండిన సాహిత్యం, చరిత్రలను బట్టి వీరి పరాక్రమాలను అంచనా వేయవచ్చు. యుద్ధానికి వెళ్లే రాజులకు వారి జీవిత భాగస్వాములైన రాణులు వీర తిలకం దిద్ది పంపించడం మనం చరిత్రలో చాలాసార్లు చదువుకున్నాం. కానీ యుద్ధభూమిలోని భర్తకు ఒక అసాధారణమైన కానుకను పంపించిన క్షత్రియకాంతనే ఈ హాడీరాణి. రాజ్య శ్రేయస్సు కోసం ఆమె చేసిన త్యాగమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

హడా చౌహాన్(చౌహాన్ అనేది ఉత్తర భారత దేశంలోని రాజపుత్ర తెగకు చెందిన వారి ఇంటి పేరు. ‘రాజు’ మరియు ‘ధర్మానికి అధిపతి’ అని దీని అర్థం. అగ్నిగుండం నుండి ఉద్భవించిన వారు అని ఒక నమ్మకం. వీరిని అగ్ని వంశీయులు అని కూడా అంటారు) రాజ్ పుత్ సంగ్రామ్ సింగ్ కుమార్తె సహల్ కన్వర్ (హాడీ రాణి). మేవాడ్ లోని సలుంబర్ ప్రాంతానికి చెందిన రతన్ సింగ్ చుండవత్ అనే వ్యక్తిని వివాహమాడుతుంది. మేవాడ్ పాలకుడైన రాణా రాజ్ సింగ్ సైన్యంలో ఇతను సైన్యాధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తూ ఉంటాడు.
మొఘల్ చక్రవర్తి ఐన ఔరంగజేబు తన సైన్యంతో మేవాడ్ రాజ్యాన్ని చుట్టుముట్టడంతో, సైన్యాధ్యక్షుడిగా యుద్ధభూమికి వెళ్లవలిసిందిగా రాజుగారు ఆజ్ఞను జారీ చేస్తారు.

అప్పటికి అతనికి వివాహమై కేవలం రెండు రోజులు మాత్రమే అవుతుంది. సౌందర్యంతో వెలిగిపోతున్న నవవధువును (అర్ధాంగిని) వదిలి యుద్ధభూమికి వెళ్ళడానికి అతని మనసు అంగీకరించదు. కర్తవ్య పాలనలో భాగంగా యుద్ధానికి వెళతాడే కానీ అతని మనసు ఆమె చుట్టే తిరుగుతూ ఉంటుంది.

పగలంతా శత్రువులతో పోరాడిన అతను, యుద్ధ విరామ సమయంలో ఒక సైనికుడిని ఆమె వద్దకు పంపించి, ఆమె క్షేమ సమాచారాన్ని తెలుసుకొని, ఆమెకు ప్రతిగా ఆమె నుండి ఏదైనా కానుకను తీసుకొని రమ్మని పంపిస్తూ ఉండేవాడు. వరుసగా నాలుగు రోజులు ఇదే తతంగం నడవడంతో ఆమె ఆలోచనలో
పడుతుంది. తనపై ఉన్న మోహం కారణంగా అతడు యుద్దంపై మనసు లగ్నం చేయలేక పోతున్నాడనీ,ఇదే పరిస్థితి కొనసాగితే రాజ్యం శత్రువుల వశమై పోతుందనీ, అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వకూడదని ఒక బలమైన నిర్ణయానికి వస్తుంది.

శత్రువుపై గెలవడానికి యుద్ధభూమిలో వారు (యోధులు) ఎంత వీరోచితంగా పోరాడుతారో, అంతఃపుర కాంతలు అదే స్థాయిలో వారికి మానసిక బలాన్ని అందిస్తారనే చారిత్రక సత్యం పలుమార్లు రుజువైనదే.

మోహానికి లొంగడం వీరుడి లక్షణం కాదనీ, తనపై నుండి మనసు మరల్చుకోకపోతే, శత్రువుపై విజయం సాధించడం అసంభవమనీ, తాను అతని వెంటనే ఉన్నాననే భావనతో రణరంగంలో విజృంభించాలనీ, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాననీ ఉత్తరం వ్రాసి, మరసటి రోజు సైనికుడి రాగానే అతనికి విషయాన్ని తెలియపరచి, తన తలను ఖడ్గంతో నరికేసుకుని, అతనికి కానుకగా పంపిస్తుంది. దానిపై ఒక తెల్లని వస్త్రాన్ని కప్పి ఆమె చెప్పిన ప్రకారంగా అతను (సైనికుడు) వెళ్లి, ఆమె భర్తకు అందజేస్తాడు. విషయం తెలుసుకున్న అతని మనసు తీవ్రమైన దుఃఖానికి లోనైనప్పటికీ ఆమె చేసిన త్యాగం అతనిలోని వీరుడిని మేల్కొల్పుతుంది. తలకు వేలాడుతున్న ఆమె జడతో తన మెడలో ముడి వేసుకొని,అరివీర భయంకరుడై శత్రుసైన్యాన్ని ఆవలిగట్టుకు తరిమికొడతాడు. కానీ ఆమె వియోగాన్ని భరించలేక అదే యుద్ధభూమిలో మోకాళ్ళపై కూర్చుని ఖడ్గంతో తన తలను నరుక్కుని, ఆమె జాడ వెతుక్కుంటూ స్వర్గానికి చేరుతాడు.

రాజస్థాన్ సైన్యంలోని ఒక బెటాలియన్ కు ఈమె పేరును పెట్టారు. డానీ సోలంకి అనే రచయిత ఈమె పేరు మీదుగా ‘ హాడీ రాణి ‘ అనే కవితా సంకలనాన్ని ప్రచురించారు. ఈమె సాహసం రాజస్థాన్ లోని పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చబడింది. అక్కడి జానపదులు ఈమె సాహసంపై బాణీ కట్టి ఆమెపై తమకున్న గౌరవాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ ఉంటారు.

ఓనకే ఓబవ్వ:

కన్నడ చరిత్రలో ప్రఖ్యాతిగాంచిన 17 వ. శతాబ్దపు ధీరవనిత. హోలయ తెగకు చెందిన ఒక సాధారణ స్త్రీ. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ కోట పేరు వినపడగానే చరిత్రకారులకు ఈమె సాహసం జ్ఞాపకం రాక మానదు.

చిత్రదుర్గంలోని రాతికోటకు కాపలాదారుడైన కాహళే ముద్ద హనుమ భార్య. శత్రువులు కోటను చుట్టుముట్టినప్పుడు సైనికులను అప్రమత్తపరచడం అతని విధి.
కానీ ఒకరోజు అతను భోజనానికి వెళ్లిన సమయంలో హైదర్ అలీ (మైసూర్ పాలకుడు మరియు టిప్పు సుల్తాన్ తండ్రి) సేనలు చిత్రదుర్గ కోటపై దాడిలో భాగంగా కోటలోని చిన్న రంధ్రం ద్వారా లోపలికి రావడాన్ని గమనిస్తుంది. పక్కనే ఉన్న రోకలి బండను తీసుకొని వాళ్ల తలలపై బాదుతూ ముందుకు వెళ్లకుండా ఆపగలుగుతుంది. ఆమె దాడిలో చాలామంది శత్రు సైనికులు హతమౌతారు. భోజనానికి వెళ్లిన ఆమె భర్త తిరిగి వచ్చేసరికి ఆమె చేతిలో రోకలిబండతో ఒళ్లంతా రక్తమోడుతూ కనిపిస్తుంది. విషయం అర్థం చేసుకున్న అతను శంఖం ఊది సైనికులను అప్రమత్తం చేయడంతో, శత్రువుల బారి నుండి వారు కోటను రక్షిస్తారు. కానీ శత్రువర్గంలోని ఒక సైనికుడు హఠాత్తుగా ఆమెపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తుంది.

కన్నడ భాషలోని ‘ ఓనకే ‘ అనే పదానికి తెలుగులో రోకలిబండ అని అర్థం. రోకలి బండతో శత్రువుల నెదుర్కొన్నందు వలన ‘ఓనకే ఓబవ్వ ‘ అని చరిత్రలో స్థిరపడింది.

ఎటువంటి అత్యాధునిక ఆయుధాలు లేకుండా ఒక సాధారణమైన పనిముట్టుతో బలవంతమైన శత్రుసైన్యాన్ని ఎదుర్కొన్న ఆమె ధైర్యం స్త్రీ శక్తికి నిదర్శనంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. యుద్ధ విద్యల్లో నైపుణ్యం,ఆయుధాల వినియోగంపై అవగాహన కంటే కూడా బుద్ధి కుశలత, సమయస్ఫూర్తి యుద్ధభూమిలో కీలకమైన పాత్ర పోషిస్తాయనీ, ఒక సాధారణ స్త్రీని సైతం అసాధారణ శక్తిగా నిలుపగలవని నిరూపించింది.

కర్ణాటక ప్రభుత్వం 2021 వ. సంవత్సరం నుండి నవంబర్ 11 వ. తేదీని ‘ఓనకే ఓబక్క జయంతి’ గా అధికారికంగా నిర్వహిస్తోంది.

జీవన గమనంలోని మరే పార్శ్వాన్నీ పట్టించుకోకుండా, బంధాలు, అనుబంధాలకు లొంగకుండా కేవలం స్వాతంత్ర్య ఫలాలను పండించడమే లక్ష్యంగా కదిలిన ఈ దేశభక్తులకు చరిత్రలో సముచిత స్థానం దక్కలేదన్నది మేధావుల భావన. ఇటువంటి మహోన్నతుల విజయగాథలు తెలుసుకోవడం, నలుగురికి తెలియపరచడం (చంద్రునికో నూలుపోగులా) మనం వారికి సమర్పించే నివాళి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దేవుడిచ్చిన గొప్ప వరం – అమ్మ

జ్వలిత చేతనం : బాలలత మల్లవరపు