అదృష్టానికి దురదృష్టానికి వెంట్రుక వాసి దూరం మాత్రమే! రెప్పపాటు కాలం అందలమైనా ఎక్కించగలదు లేదా అధఃపాతాళానికైనా తొక్కేయగలదు. వైద్యం కొత్త పుంతలు తొక్కి, ఔషధం ఎల్లలు దాటి సేదదీరుస్తున్నా ! ఎక్కడో ఒకచోట అపశృతి విలయతాండవం చేస్తూనే ఉంటుంది. అందమైన జీవితాల్లో కల్లోలం సృష్టిస్తూనే ఉంటుంది. అలా ఓ భావి జీవితాన్ని నిర్దయగా కబళించి, నిస్తేజంలోకి నెట్టిన
సంఘటన.వివరాల్లోకి వెళ్తే… వైకల్యాన్ని తన మనోబలమనే ఉక్కు పాదంతో తొక్కి పెట్టి,
పడి లేచిన కడలితరంగమై, నింగి కెగసిన తారాజువ్వలా దూసుకుపోతున్న ఈ ఆత్మవిశ్వాసం పేరే బాలలత మల్లవరపు.
సివిల్ సర్వీస్ అభ్యర్థుల ఆరాధ్య దైవం, ఆమె మార్గ నిర్దేశం కోసం ఎంతోమంది తహతహలాడుతూ ఉంటారు. తనకు ప్రాంతీయ భేదాలు లేవని తాను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన
వ్యక్తినంటూ చెప్పే వీరు గుంటూరు వాస్తవ్యులైన శ్రీ శౌరయ్య, విజయ దంపతుల కుమార్తె. ఈమెకు సంవత్సరంలోపే పోలియో చుక్కలు వికటించి రెండు కాళ్లు పని చేయకపోవడంతో డాక్టర్ల చుట్టూ తిరిగినా ప్రయోజనం కనిపించలేదట. ఆటపాటలతో, చదువుసంధ్యలతో హాయిగా సాగాల్సిన బాల్యంలో
ఆ చిన్ని మనసు ఎన్ని అలజడలకు లోనై ఉంటుందో కదా! ‘వైకల్యం అపహాస్యం చేసినా చివరికి సంకల్పబలం ముందు తలవాల్చింది’ .ఆత్మస్థైర్యంతో చదువు కొనసాగిస్తూ న్యాయ శాస్త్రంలో పట్టా పొందినా, సమాజం వికలాంగురాలిగా గుర్తించడం బాధించిందంటారు. డాక్టర్ల చుట్టూ తిరిగినప్పుడు లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది ఇలాంటి వ్యక్తుల్లో అని వారు అన్నప్పుడు, నేను ఎక్కువ రోజులు బతికి చూపెట్టాలని దృఢంగా నిర్ణయించుకున్నానని కానీ ఎన్ని రోజులు బతికామన్నది కాదు, ఎంత సాధించాం ,సమాజానికి ఏం చేశామన్నది మాత్రమే ముఖ్యం అంటారామె .
బాల్యం నుండి అవహేళనలతో బాధకు గురైన సందర్భాలెన్నో గుర్తొస్తాయంటారు. నన్ను నేను నిరూపించుకోవాలనుకుని , డిగ్రీ సెకండ్ ఇయర్లో ఐ.ఏ.ఎస్ . కోచింగ్ కోసం ఒక కోచింగ్ సెంటర్ కి వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ ‘ఆసి రెడ్డి ‘గారు మాట్లాడుతూ గ్రూపు 2. లాంటి పరీక్షలు రాయమ్మా, రెండు సంవత్సరాల తర్వాత తిరిగి ప్రయత్నించు కావాలంటే స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇస్తానంటూ అనునయించి పంపారని గుర్తు చేసుకుంటారు. వారికి తాను ‘ఏకలవ్య శిష్యురాలి’నని పేర్కొంటారు.
ఎంతసేపు చదివామన్న దానికంటే ఎంత మనసు పెట్టి చదివామన్నదే ముఖ్యం. గడచిన క్షణాలు తిరిగి రావు కాబట్టి జీవితాన్ని ‘పాషన్’తో ఉత్సాహంగా గడపాలంటారు. సివిల్స్ పై దృష్టి పెట్టి ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా తొలి ప్రయత్నంలోనే 2004లో ,399 ర్యాంక్ సాధించి, రక్షణ మంత్రిత్వ శాఖలో అకౌంట్స్ సర్వీసెస్ కు ఎంపిక కావడం తనలో ఆత్మవిశ్వాసాన్ని అధికం చేసిందంటారు. తన విజయం వెనుక నాన్న కృషి వెలకట్టలేనిదని , విలేకరిగా వారి అనుభవాలు సమాజాన్ని చూపించిన తీరు తనకు ఎంతో కలిసి వచ్చిన అంశాలుగా పేర్కొంటారు. నాన్న బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చినప్పుడు పుస్తకాలు కావాలంటూ తెప్పించుకుని చదివేదాన్నని రెండు సంవత్సరాలు ఇంటికే పరిమితమయ్యానంటారు. ఐ.ఏ.యస్.గా పేపర్లో ఫోటో చూసుకోవడమే తన ధ్యేయంగా దాదాపు 12 – 15 గంటలు చేసిన కృషికి దక్కిన ఫలితంగా పేర్కొంటారు.
సివిల్స్ ఆస్పిరెంట్స్ యన్.సి.ఇ.ఆర్.టి. పుస్తకాలు 6 నుండి 12వ తరగతి వరకు చదివి జ్ఞానం సంపాదించాలంటారు .
ఉద్యోగరీత్యా చెన్నైలో ఉన్నప్పుడు ఎంతోమంది సివిల్స్ అభ్యర్థులు తన సలహాల కోసం రావడం మొదలుపెట్టారని మెంటార్ గా ఎంతోమందికి ర్యాంకులు రావడంలో సహాయసహకారాలు అందించానంటారు .అప్పుడే తనలో ‘నేర్పాలనే’ ఆలోచనకు బీజం పడిందంటారు. ఆరు సంవత్సరాల క్రితం సి .యస్.బి.
ఐఏఎస్ అకాడమీ. సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ పెట్టాలని నిర్ణయించుకున్నపుడు ముందుగా తనపై తానే ప్రయోగం చేసుకోవాలనుకుని తిరిగి 2016లో సివిల్ సర్వీసెస్ కు అప్లై చేసి 167వ ర్యాంకు పొందినపుడు తన నిర్ణయం సరైనదేనని భావించారట.
మెంటర్ గా ఎంతోమంది కి శిక్షణ ఇస్తూ , వ్యక్తిత్వ వికాస నిపుణురాలిగా విద్యార్థుల్లో మనోధైర్యం నింపుతూ సమాజానికి చక్కటి యువతను, అధికారులను అందిస్తూ ప్రభంజనమై సాగుతున్న వీరి జీవిత భాగస్వామి శ్రీ సురేష్ బాబు ‘ గ్రూప్ వన్’ ఆఫీసర్ కాగా, పదేళ్ల కుమారుడు కూడా ఉన్నారు.
తల్లిదండ్రులు తమ ఆశయాలకు అనుగుణంగా కాకుండా నిర్ణయాధికారం పిల్లలకే వదిలేసి వారికి నచ్చిన రంగాల వైపు నడిపించాలంటారు.
ఒక ఐఏఎస్ అధికారిణిగా ఉండడంలోని తృప్తి కంటే ఎంతో మందికి శిక్షణనిస్తూ మార్గదర్శిగా, స్ఫూర్తిదాయకంగా ఉండటంలోనే తనకు ఆత్మసంతృప్తి లభించిందంటారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనిస్తున్న వీరు భారతదేశంలో స్త్రీలు మరియు దివ్యాంగులపై ఉన్న అభిప్రాయాన్ని మార్చాలన్నదే తన తపన అంటారు. దాంట్లో విజయం సాధిస్తేనే తన లక్ష్యం నెరవేరినట్లు అంటారామె.
జీవితం ప్రశాంతంగా ఉండాలంటే తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగాలనే వీరు, సివిల్స్అభ్యర్థులు ప్రారంభం నుండే టెస్టులు రాస్తూ ఉండాలని ,సిలబస్ అయ్యాక రాయడం మంచిది కాదంటారు. రివర్స్’ ఇంజనీరింగ్ మెథడ్ ‘ఫాలో అవ్వాలని సూచిస్తారు.
జనం ఎవరేమన్నా పట్టించుకోకు శత్రువుల్ని గెలవాలంటే లక్ష్యం మాత్రమే మన మనసులో మెదులుతూ ఉండాలని, ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మాత్రమే విజయం నీకు దాసోహం ఔతుందంటారు . మన ఆలోచనలే మనల్ని డిసైడ్ చేస్తాయి థాట్స్ ని సీరియస్గా తీసుకోకూడదంటారు “ఐయామ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్” అన్న భావన బలీయంగా ఉండాలంటారు. మన జీవితం మనకు మాత్రమే సొంతం. గతాన్ని తలుచుకుంటూ కూర్చోకుండా అనుభవాలనే జీవిత పాఠాలుగా మలుచుకోవాలని ,ప్రతి విషయానికి టెన్షన్ పడుతూ, నిర్ణయాల్ని వాయిదా వేసి, ఆలోచనాశక్తిని కోల్పోకుండా తట్టుకుంటూ ముందుకు సాగా లంటారు. సమాజంలో అందరూ మంచివాళ్లే ఉంటారనుకుని భ్రమ పడక, జాగ్రత్తగా అడుగులు వెయ మంటూ దారి చూపుతారు. నిన్ను నువ్వు గౌరవించుకున్నప్పుడే సమాజం నిన్ను గౌరవిస్తుందనే
వీరి దృష్టిలో,’ మనోబలమే నిజమైన శక్తి ‘.
జీవితం రైలుబండి లాంటిది ఎంతోమంది తారసపడుతుంటారు. బంధాలు బాంధవ్యాలు దూరం అయినప్పుడు డిప్రెషన్ లోకి వెళ్తుంటారు .అశాశ్వతమైన బంధాల కోసం జీవితాన్ని నాశనం చేసుకోవడం సరికాదు అంటూ యువతకు హితోపదేశం చేస్తారు .మన అనుభవాల్ని జీవిత పాఠాలుగా మలుచుకొని ముందుకు సాగాలంటూ ధైర్య వచనాల్ని స్వానుభవంతో చెప్పారు .గతాన్ని వదిలేసి భవిష్యత్తును ఊహిస్తూ ఆలోచనల్లో ఊగిసలాడడం సరికాదంటూ సలహా ఇస్తారు.
తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని వెన్ను తట్టి చెబుతారు. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానమార్గం
ఎంతో అనుకూలమైందంటూ సూచిస్తారు.
సమయం ఎవరికోసం ఆగదు తెలివిగా సమయాన్ని ఒడిసిపడితేనే విజయం నీదౌతుందంటూ
వెన్ను తడతారు.మన కోసం మనం జీవించాలి. అనునిత్యం ఆత్మ పరిశీలన అవసరం , కలల్ని కంటూ సాకారం చేసుకోవాలనే వీరు నిర్ణయాన్ని వాయిదా వేయడం ఎంత మాత్రం సరికాదంటారు.
సామాజికాంశాల్ని ఎప్పటి కప్పుడు తెలియజేసే వీరు, కీర్తిశేషులు. శ్రీమతి సుష్మా స్వరాజ్ గారిని తన స్ఫూర్తి ప్రదాతగా పేర్కొంటారు.
వ్యవస్థ ,మనుషుల్లో అంత త్వరగా మార్పు కనిపించిందని, యువతను మార్చడమే తన ఆశయమని.’ వేచి చూస్తేనే విజయం వరిస్తుంది ‘పోరాడి గెలిచిన వాడే రియల్ హీరో ‘అంటూ, సవాలును స్వీకరిస్తూ మంచి ఆశయాలతో ముందుకు సాగాలంటారు. మనిషి కష్టంగా కాకుండా ఇష్టంగా పనిచేసే రోజులు రావాలంటూ ఆకాంక్షిస్తారు . ఆత్మ న్యూనతకు లోనైతే ఏది సాధించలేరంటూ , ‘భయపడడం తప్పు కాదు, భయాన్ని జయించలేకపోవడమే పెద్ద తప్పు’ అంటారు. భయాన్ని వీడితే నిన్ను ఏ శక్తి ఆపలేదంటూ ధైర్యం నూరిపోస్తారు.ఎంచుకున్న మార్గం స్పష్టంగా ఉన్నప్పుడు ప్రయత్నం నల్లేరుపై నడకలా సాగిపోతుందని, ప్రతి నిమిషం చాలా విలువైనదని, గెలుపోటములు పక్కన పెట్టి వర్తమానంలో జీవిస్తేనే ప్రశాంతత దొరుకుతుందంటారు.
ఓపిక ,పట్టుదల గెలుపుకు రెండు మెట్లలాంటివని మనల్ని మనం అభిమానించుకుంటేనే ఎన్నో విజయాలను అందుకోగలం ఇతరుల గురించి ఆలోచించడం, అసూయాద్వేషాల మధ్య కొట్టు మిట్టాడితే నీ లక్ష్యాన్ని మరిచిపోతావంటారీమె .
‘లాయిడ్ గ్రూప్ ‘సంస్థల అధిపతి శ్రీ విక్రమ్ నారాయణ గారి ఉదారత, సేవానిరతి తననెంతో ప్రభావితం చేశాయని వారు’ ధనిక్ భారత్ మిషన్ ‘విద్యా సంస్థలను ప్రారంభించడానికి ముందు నన్ను సంప్రదించినప్పుడు ‘ సర్ , మీరు నా స్పీడును అందుకోగలరా !అంటూ ప్రశ్నించిన ఆమె ఆత్మ స్థైర్యానికి ఆశ్చర్యపోకుండా ఉండడం అసాధ్యమని నా భావన. దాదాపు ఒక లక్షా యాభైవేల మంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అయినప్పుడు వారి అభిప్రాయాలు విన్న తర్వాత ఆ పదహారేళ్ల వయసు పిల్లల్లో తప్పకుండా మార్పు తీసుకు రాగల సత్తా నాకుందనిపించి ఈ విద్యాసంస్థల డైరెక్టర్ గా ఉండడానికి నిశ్చయించుకున్నానని ,
‘ధనిక్ భారత్’ విద్యాసంస్థల పేరిట 16 బ్రాంచీలతో ‘ఇంటర్ మీడియట్’ కాలేజీ’లు ప్రారంభించబోతున్నామంటూ, తమ కళాశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకం ఉండదంటూ స్పష్టం చేశారు. యువతకు సరైన దిశా నిర్దేశం చేస్తూ జీవితంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని సరైన మార్గం చూపించగలమని గట్టిగా చెప్పగలనన్నారు. సాధారణ విద్యార్థినినైన నేను ,నాపై నాకు నమ్మకం లేకున్నా మొండి ధైర్యంతో ముందుకు నడిచి గెలుపు సాధించాను ,అలాగే అంగవైకల్యం ఉన్న పిల్లలకి కోచింగ్ ఇస్తున్నప్పుడు వారిలో నన్ను నేను చూసుకుంటాను అంటూ చెప్పే వీరు గెలుపు కోసం ఐదు సూత్రాలను పాటించాలంటారు .
ఒకటి . డిసిప్లిన్ ,
రెండు . క్లారిటీ అఫ్ థాట్
మూడు. ప్లానింగ్
నాలుగు. డిజైన్
ఐదు. పర్పస్ ఆఫ్ లైఫ్
సరైన ప్రణాళిక ,అవగాహన ఉత్సాహం ఉంటే రెండు సంవత్సరాల్లో సులభంగా సివిల్స్ లో విజయం సాధించవచ్చు అంటూనే ,ఒకవేళ ఓటమి ఎదురైనా ఆ అనుభవంతో జీవితంలో ఏదో ఒక రకంగా ఉన్నతంగా జీవించగలరని ధీమాగా చెప్తారు. భావోద్వేగంతో కూడిన జీవనశైలి అంటే తనకు ఎంతో ఇష్టమని, ” తన జీవిత పుస్తకంలో ప్రతి పేజీ కొట్టివేతలు లేకుండా అందంగా మలుచుకోవాలనే తపన ఆరాటం తనలో అనుక్షణం ఉంటుందంటూ ‘ చెప్పే వీరు,
చిన్ననాడు ‘వడ్డాణం ‘కొని పెడతానన్న తాతయ్య మురిపెపు మాటలకు బంధువులు చేసిన అవహేళనలు తనను ఇప్పటికీ బాధించే సంఘటనైననా “నా పేరే నాకు ఆభరణం”లా మారిందంటూ ఆత్మవిశ్వాసంతో ,ఒకింత ఆనందంతో చెప్తారు . విద్యార్థుల్ని తీర్చిదిద్దడంలో తన జీవితాన్ని అంకితం చేస్తానంటూ దానికోసం కుటుంబానికి కూడా దూరంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు, వారి భాగస్వామి మమ్మల్ని వదిలేసావన్నమాట అంటూ నవ్వుతూ అన్న మాటల్ని గుర్తు చేస్తూ, మంచి భర్తకు సరైన నిర్వచనం మావారంటూ కితాబిస్తారు.
తొణకని ఆత్మవిశ్వాసం, ప్రవాహం లాంటి మాట తీరు ,ఎంతోమంది పిల్లల్ని ఐ.య్యే.యస్ .లుగా చేయాలన్న మీ తపన అభినందనీయం . విద్యార్థుల్ని గైడ్ చేస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతున్న మీరు మరెందరికో రోల్ మోడల్ గా మారి మునుముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ.