ధనుర్మాస విశిష్టత – మార్గళి – తిరుప్పావై – 1 వ భాగం

ధనుర్మాసం అంటే ధనస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించడం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది . సూర్యుడు నెల రోజులు ఒక మాసంలో ఒకే రాశిలో ఉంటాడు. కాబట్టి ఆ నెలకు ఏ రాశిలో సూర్యుడు ఉంటాడో ఆ రాశి పేరుతో ఆ మాసం , ఆ నెల పేరు ఉంటుంది. ధనుర్మాసం  భగవంతుడైన విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం. ఈ నెలలోనే గోదాదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నది.  గోదా అమ్మవారు   తిరుప్పావై పాటలను  పారవశ్యంతో పాడి , శ్రీ రంగనాయక స్వామిని మేల్కొల్పి ప్రసన్నం చేసుకుని ఆయనను పెళ్లి చేసుకున్నది. ఆ తరువాత శ్రీరంగ నాయకునిలోనే ఐక్యమయింది గోదాదేవి.

      తిరుప్పావై అంటే 30 స్తొత్రాలు, పాటలు . విష్ణుమూర్తిని కీర్తిస్తూ పాడిన ఈ పాటలను తిరుప్పావై అంటారు. ఈ మాసం లో ఉండే ఈ 30 రోజులు 30 పాటలను పాడుతూ చేసే పూజా విధానాన్ని మార్గళి అంటారు.

ధనుర్మాసం వచ్చిందంటే ప్రతి వైష్ణవ దేవాలయాల్లో విశేషంగా తెల్లవారుజాముననే స్వామివారిని మేల్కొలిపి భక్తులందరితో కూడి తిరుప్పావై పారాయణం చేస్తారు.  పెరుమాళ్ళు అంటే దేవుడు. పెరుమాళ్ళకు ఇచ్చే ప్రసాదాల్లో  “కట్టె పొంగళి”ని  అంటే బియ్యం,పెసరపప్పు, మిరియాలు, నెయ్యి కలిపి వండే  కట్టె పొంగళి పదార్థాన్ని భగవంతుడికి  ఆరగింపు చేస్తారు. ఆరిగింపు అంటే నైవేద్యం పెట్టడం. ఈ కట్టె పొంగళితో పాటు పుళిహోర, దధ్యోజనం ( దధి + ఓదనం =  దధ్యోదనం. దధి అంటె పెరుగు  , ఓదనం అంటే అన్నం, వాడుక భాషలో దధ్యోజనం అంటారు) చక్కెర పొంగళి మొదలైన పదార్థాలను కూడా దేవుని కి ఆరగింపు చేసి, వచ్చిన భక్తులందరికీ పంచుతారు.

ఈ ధనుర్మాస వేళల్లో పెళ్లి కావలసిన అమ్మాయిలు, అబ్బాయిలు ప్రత్యేకంగా జరుపవలసిన పూజ మార్గళి పూజ. ఎందుకంటే గోదా అమ్మవారు చాలా చిన్న వయసులోనే భక్తి పారవశ్యంతో తిరుప్పావై 30 రోజులు 30 పాటలు పాడింది , ఆ పెరుమాళ్ళ అనుగ్రహం వల్ల వారిని భర్తగా పొందగలిగింది . అలాంటి  సుగుణాలు ఉన్న భర్త దొరకాలని అమ్మాయిలు, అలాంటి సుగుణవంతులైన భార్య దొరకాలని అబ్బాయిలు

ఈ పూజ చేస్తే ఫలితం ఉంటుంది. ఇదొక్కటే కాకుండా భక్తితో సేవించి భగవంతుణ్ణి  అంతా మంచి జరగాలని కోరుకుంటే ఏదైనా తీర్చగలడు అనే నమ్మకం గోదాదేవి నిరూపించింది కాబట్టి అందరూ తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఈ పూజ చేయాలి. చక్కగా ఇంటి ముందు ముగ్గులు పెట్టి అలంకరించాలి తాము అలంకరించుకోవాలి. అలంకరణ మనకే కాదు భగవంతుడికి చేయాలి.  ఇంట్లో ఉన్న దేవుడి విగ్రహాలకు కూడా రంగురంగుల పట్టు వస్త్రాలను ధరింపజేసి, మంచి సువాసన గల అందమైన పూలతో అలంకరించి, భక్తితో ఈ 30 పాశురాలు పాడి, పొంగళిని ఆరగింపు చేసి, దేవాలయాలకు వెళ్లి భక్త బృందమంతా కలిసి పెరమాళ్ళను  భక్తితో ఈ తిరుప్పావై పారాయణం చేసి ప్రసాదాలను స్వీకరించాలి.

ఈ పూజ ఇప్పుడెందుకు చేయాలంటే ? : –

ఈ కాలం పిల్లలకు  చాలా అవసరం. ఛందోబద్ధంగా ఉండే ఈ శ్లోకాల , ఈ కీర్తనల పారాయణం వలన వాక్కు స్పష్టత పెరుగుతుంది.  జ్ఞాపక శక్తి పెరుగుతుంది కాబట్టి ఉపయుక్తమైన పూజ ఇది. శీతాకాలం మజ్జుతనం ఉంటుంది . అంటే సోమరితనం తో ఉంటారు. గోదాదేవి భగవంతునిలో లీనం కావడానికి కారణం ఆమె ఏకాగ్రత వల్లనే. అంటే మనం చేసే పని పట్ల శ్రద్ధ కలుగుతుంది, విజయాన్ని సాధిస్తాము అని చెప్పడానికి ఈ పూజను నిర్వహించుకుంటాం. ఇది కేవలం మహిళలు మాత్రమే చేసే పూజ కాదు. పిల్లలు పెద్దలు అందరూ చేయవలసిన పూజ.

ఇలా ఈ స్తోత్రాలను చిత్తశుద్ధితో చదవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.  బుద్ధి చాంచల్యం తొలగిపోతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి , బద్ధకం పోతుంది. ఒక మంచి సంకల్పంతో స్పష్టంగా స్వచ్ఛమైన మనసుతో భగవంతుడి ముందు కూర్చుని గానం చేయడం వలన మెదడు చురుకుగా ఆలోచిస్తుంది . ఈ పూజ తరువాత శాస్త్ర సాంకేతిక విద్యలలో కానీ, వాళ్ళు చదవాలి అనుకునే ఏ విషయం పైననైనా, ఏ ఉద్యోగం లోనైనా చేయాల్సిన పనుపై ఏకాగ్రత పెరిగి, తాము సాధించాలనుకునే  ఫలితాలలో  సఫలీకృతులు అవుతారు.

ఈ పూజ ఒక్కరు మన ఇంట్లో కూర్చొని చేసేది కాదు. ఎందుకంటే గోదమ్మ ప్రతి పాశురంలో ఆ రంగనాయకులను మేల్కొల్పటానికి గోపికలందరితో కలిసి వెళ్లినట్లు ఉంటుంది కాబట్టి, భక్త బృందంతో కలిసి ఈ పూజ చేస్తే విశేష ఫలితం ఉంటుందని గోదమ్మ తను ఆచరించి మనకు నేర్పించింది. అంటే ఇందులో కూడా ఒక సామాజిక ప్రయోజనం కూడా ఉన్నది. నలుగురితో కలిసి మంచిగా మాట్లాడడం కలిసి ఉండడం అనే సంఘటిత శక్తికి ఉదాహరణ గా ఈ ధనుర్మాస క్రతువును చెప్పవచ్చు.

ఈ కథ వివరణ :-

ఈ గోదమ్మ  ఎవరు?  ఈ కథ ఎలా వచ్చింది?  అని మీకు సందేహం రావడం సహజం!  తమిళనాడులోని విల్లిపుత్తూర్ అనే ఊరిలో విష్ణుచిత్తులు అనే పరమ భక్తుడు ఉండేవాడు. అతను ఒక తులసి వనాన్ని పెంచుతూ అందులోని తులసి దళాలతో మాలలు కట్టి పెరుమాళ్ళకు అలంకరించేవాడు. ఇట్లా రోజూ చేస్తూ ఉండగా ఒక రోజు ఒక పాప ఆ తులసి వనంలో దొరికింది విష్ణు చిత్తుల  వారికి సంతానం లేకపోవడం వల్ల భగవంతుడే నాకు ఈ పాపను అనుగ్రహించాడని అనుకొని ఆ పాపకు కోదై (గోదా) అని నామకరణం చేసి అల్లారం ముద్దుగా పెంచుకున్నారు.

     తండ్రి భగవంతునికి చేసే నిత్య సేవను శ్రద్ధగా గమనిస్తూ గోదాదేవికి కూడా ఆ పెరుమాళ్ళ మీద అనంతమైన, అచంచలమైన భక్తి ఏర్పడింది. ఆ పాప కొద్దిగా పెరిగాక తను తండ్రితో తులసి వనానికి వెళ్ళేది. అక్కడ తండ్రి అల్లిన మాలను తను మొదలు ధరించి అవి ఎలా ఉన్నాయో బావిలోని నీళ్లలో చూసుకొని అదే మాలని పెరుమాళ్లకు సమర్పించేందుకు ఇచ్చేది. ప్రతిరోజు అలా చేస్తుండగా ఆమె తండ్రి  విష్ణుచిత్తులవారికి ఒకరోజు ఆ మాలలో వెంట్రుకలు కనిపించాయి. వెంటనే చాలా పెద్ద అపచారం జరిగిందని మాలలను తీసివేయబోతే పెరుమాళ్లు, నాకు ఇలాగే ఇష్టం. నాకు ఇవే వేయాలి అని చెప్పాడట!  దీంతో  భగవంతుని కీ భక్తులకూ ఉండే అవినాభావ సంబంధం తెలుస్తుంది. ఏవిధమైన క్రోధ,మోహ,లోభాలు లేని ఓ సమర్పణ భావం చేసే పూజ దీన్ని గ్రహించాలి. గోదాదేవిలోని అమాయకమైన ప్రేమతో కూడిన భక్తిని గమనించాడా భగవంతుడు.

అలా దినదినాభివృద్ధిగా గోదాదేవి ఆ పెరుమాళ్ళ పట్ల విడదీయలేని ప్రేమను పెంచుకొని తన తండ్రితో ఆ పెరుమాళ్లే నాకు భర్తగా కావాలని కోరిందట. అప్పుడు తండ్రి ఆమెకు ఎంతో నచ్చ చెప్పటానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందంట. గోదమ్మ కచ్చితంగా నిర్ధారించుకొని ఆ రంగనాయకులనే భర్తగా పొందాలన్న  ఆశయంతో, భక్తితో ధనుర్మాసంలో ఈ 30 పాశురాలు అంటే ఈ 30 పాటలను రోజుకొకటి చొప్పున పాడి చివరికి పెరుమాళ్ల అనుగ్రహం పొందింది. విగ్రహ రూపంలో ఉన్న రంగనాయకులు బయటికి కదలి వచ్చి గోదాదేవిని వివాహమాడి తనతో ఆలయంలోకి తీసుకువెళ్లాడట. గోదమ్మ తో సహా అక్కడ అంతర్ధానమయ్యారట .  అప్పుడు ఆ విష్ణుచిత్తుడు, నా బిడ్డ ఏది? అని రోధించగా పెరుమాండ్లు పలుకుతూ నాతో కళ్యాణ జరిపించావు కదా? అందుకే నాతో తీసుకువెళ్లానని చెప్పారట. అయితే విష్ణుచిత్తుడు తన కూతురు కోసం ప్రార్థించగా నువ్వు ముందు నీ ఊరు  వెళ్లి మాకు ఉండడానికి ఏర్పాటు చెయ్యి మేము వస్తామని చెప్పి పంపినందుకు  ఇచ్చిన మాట ప్రకారం రంగనాయకులు గోదా సమేతంగా  శ్రీరంగనాథుని గా విల్లపుత్తూరుకు ఇల్లరికం అల్లుడుగా వచ్చారు, ఇప్పటికీ  ఉన్నారు. విల్లిపుత్తూరులో ఆండాళు కోయల్ గా  విరాజిల్లుతున్నది మనం ప్రత్యక్షంగా వెళ్లి చూడవచ్చు సర్వం కృష్ణార్పణమస్తు!!

       నిర్మల అక్కినేపల్లి

Written by Akkinenipalli Nirmala

నేను నిర్మల దేవులపల్లి/అక్కినేపల్లి. M.Sc,B.Ed . నేను పుట్టి పెరిగింది, నా చదువు అంతా భాగ్యనగరం లోనే !
మాడపాటి హనుమంతరావు పాఠశాలలో K.G నుండి 10వ తరగతి వరకు, Intermediate to B.Sc Degree వరకు వనిత మహావిద్యాలయం లో , M.Sc zoology Koti Women's collage లో చదుకున్నాను.పెళ్లి prof.Raghuramrao గారితో జరిగింది. వెంటనే B.Ed వరంగల్ కాకతీయ కళాశాలలో చదువుకున్నాను. మాకు ఇద్దరు ఆణిముత్యాలు అమ్మాయిలు
పుట్టారు. పెద్దమ్మాయి వైష్ణవి B.tech చదివింది . భార్గవ కొండపల్లి B.tech,M.S తో పెళ్లి జరిగి అమెరికాలో ఉంటున్నారు. చిన్నమ్మాయి Vainika Doctor M.B.B.S, D.N.B Psychiatry.
ఇక్కడ నా గురించి కొంత చెప్పుకోవాలి. నాకు చిన్నప్పటి నుండి ఆటలంటే మక్కువ ఉండేది. చిన్నప్పటి నుండి vollyball ఆడేదానిని ఆ ఆటను మన రాష్ట్రానికి 10సార్లు ఆడాను.
నేను మొదట ఒక స్కూల్ ప్రధానోపాధ్యాయురాలుగా , కొంత కాలం ఒక స్కూల్ లో high school టీచర్ గా పిల్లలకి చదువు చెప్పాను. మరి కొంతకాలం ఒక కాలేజ్ లో డిగ్రీ పిల్లలకు బోధించాను.ఆ తరువాత మా పిల్లలు పెరుగుతుంటే వాళ్లకు కూచిపూడి నృత్యం, సంగీతం నేర్పించాలి అని నా ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా వాళ్లకు చదువుతో పాటు వారి ఈ క్లాసెస్ కు తీసుకెళ్లడం, వాళ్ళ ప్రోగ్రామ్స్ కు వాళ్ళతో తిరగడం వల్ల నా కెరీర్ గురించి ఆలోచించడం మానేసి వాళ్లను తీర్చిదిద్దడం లోనే ఆనందం పొందాను. దానివల్ల నా పెద్దబిడ్డను ఇంజనీర్ ను చేయడమే కాక మంచి కూచిపూడి నృత్యం లో ప్రావీణ్యత సంపాదించడమే కాక ఇప్పుడు అమెరికా లో కూచిపూడి నృత్యాన్ని నేర్పించే గురువుగా ఎదిగింది.
మా చిన్నమ్మాయి మొదట సంగీతం నేర్చుకుంది కానీ తన అక్కను చూసి తను డాన్స్ నేర్చుకుంది.మెడిసిన్ లో చేరిన తర్వాత సమయం సరిపోక తన కోరికను కొంత కాలం ఆపేసింది. P.G పూర్తి అయ్యాక ఉద్యోగం చేస్తూ మళ్ళీ సంగీతం నేర్చుకుంది.
నేను ఇప్పుడు తరుణి పత్రిక , మయూఖ పత్రిక ఎడిటర్ కొండపల్లి నీహారిణి గారి ప్రోద్బలం తో వ్రాయడం మొదలు పెట్టాను. చదవడం అంటే ఇష్టం. తరుణి పత్రిక స్త్రీ ల సాధికారత దిశగా ప్రయత్నం చేస్తున్నది . నా రచనలు తరుణి పత్రిక లో ప్రచురితమవడం సంతోషదాయకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చాయ గిన్నె కష్టాలు

ధనుర్మాస విశిష్టత – మార్గళి- తిరుప్పావై పాశురాలు – అర్థ వివరణ – 2 వ భాగం