శాంతి ఓటమి కాదు!మానవజాతి విజయం!!

మన పూర్వీకులు ఏదైనా మంచి ఆలోచన లేదా కొత్త పనిని మొదలు పెట్టాలనుకుంటే ఉగాది మరుసటి రోజు ఈ రోజునుండి దీన్ని ఆచరిస్తాను అని గట్టి నిర్ణయం తీసుకునే వారు.(Resolution) వలె… ఆ పని మీదే ధ్యాస పెట్టి మరీ చేసేవారు.
అలా మనం కూడా ప్రపంచ శాంతి కోరుకుంటూ ఆ దిశగా ఒకరికొకరం చెప్పుకుంటూనో? ఆచరిస్తూనో సాగుదాము.
ప్రపంచ శాంతి అనే గొప్ప సంస్కారం మనకు మహాభారతం నుండి హిరోషిమా వరకు ఒక హెచ్చరిక చేసింది.
ఈ విశాల భూమండలంలో మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు.కానీ అదే మనిషి, తన అహంకారంతో, తన కోపంతో, తన స్వార్థంతో…
ప్రపంచాన్ని ఎన్నోసార్లు నాశనం అంచుల వరకు తీసుకెళ్లాడు. ఇది చరిత్ర సాక్షిగా జరిగిన సత్యం.
శాంతి అనేది ఒక పదం కాదు!అది మానవ జాతి నిలబెట్టే మూల స్తంభం.
మన దేశ చరిత్ర లోని సంఘటనలు మనకెన్నో పాఠాలు చెప్పాయి….
మహాభారతం ఇతిహాసమే తీసుకుంటే…..ఆ యుద్ధం ముందు వచ్చిన శాంతి కోసం ప్రయత్నాలెన్నో… అవకాశాలు అన్నన్ని…( కృష్ణ- సంజయ- రాయబారాలు; ధౌమ్య- వ్యాస-విదుర హితోక్తులు, మునుల సందేషాలు) అందుకే మహాభారతం ఒక గొప్ప అద్దంవంటిది.
శ్రీకృష్ణుడు స్వయంగా శాంతి దూతగా కౌరవుల దగ్గరకు వెళ్లి, పాండవులకు వారి కుటుంబాలను పోషించుకోవడానికి “ఐదు గ్రామాలు ఇవ్వండి” అని హితవు పలికాడు…రాయబారం నడిపాడు.కానీ దుర్యోధనుడు అహంకారంతో….
సూది మొన ఆనేంతైనా భూమి ఇవ్వను” అన్నాడు.
ఆ ఒక్క మాట —
లక్షల ప్రాణాలను బలి తీసుకున్న యుద్ధానికి నాంది పలికింది.యుద్ధం ముగిసిన తర్వాత: ఏమైంది?
గెలిచిన పాండవులు కూడా ఆనందించలేదు! కృష్ణుడికి గాంధారి శాపంతో బాధ మిగిలింది!
కుటుంబాలు, రాజ్యాలు చిద్రమయ్యాయి
మహాభారతం చెబుతున్నది స్పష్టంగా ఇదే:
యుద్ధం గెలిచినా, జీవితం ఓడిపోతుంది.

మరో ఉదాహరణ కూడా మనందరికీ తెలిసిందే!

హిరోషిమా..సంఘటన ఎప్పుడో యుగాల కింద జరగలేదు! నిన్నా-మొన్నా ఆధునిక యుద్ధపు భయానక చిత్రం ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది…పీడకలవలె ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపిన తరం నాకు చెప్పిన విషయాలు ఎన్నటికీ మరువలేను.ఇది కేవలం పురాణ కథ కాదు!మన ఆధునిక చరిత్ర కూడా ఇదే నిజాన్ని చెబుతోంది.
1945లో, జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు పడింది.ఒక క్షణంలోలక్షల మంది ప్రాణాలు కోల్పోయారు;నగరం బూడిద కుప్ప అయింది. మరణించగా మిగిలినజీవించిన వారు జీవితాంతం బాధలు అనుభవించారు.చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు —అందరూ యుద్ధానికి బలయ్యారు.ఆ రోజు ప్రపంచం తెలుసుకున్నది…
యుద్ధం అనేది శత్రువును కాదు, మానవత్వాన్ని నాశనం చేస్తుంది. అని…ఎంత నిజం.. కానీ ఏం లాభం? సమాజ హితైషులు అన్ని రంగాలలోని వారు గగ్గోలు పెట్టారు.శాంతి కావాలని, ఎవరికైనా మనదేశంలో జరగడం లేదు కదా? అనిపించవచ్చు! మనది వేద భూమి- కర్మభూమి.మన వేదం చెప్పిన విషయం వసుధైకకుటుంబకం అనే భావనలో జీవించాం! జీవిస్తున్నాం…ఇకముందు తరాలు కూడా జీవించేలా నేర్పాలి.
ఐనా పక్కిల్లు కాలిపోతుంటే మన ఇంట్లో సుఖంగా ఉండగలమా? ఆ మంటల తాలూకు సెగలు మనకు సోకవా? పసిపిల్లల రోదనలు – అమాయక ప్రజల ఆక్రందనలు మనకు కూడుతిననిస్తాయా? కునుకు పట్ట నిస్తుందా ? ఆ వ్యర్ధాలతో వాయు- జల – వాతావరణ కాలుష్య మేర్పడదా? మన ఆరోగాయాలమీద ఆ మిసైళ్ళ తాలూకు- బాంబుల రసాయనాలు శారీరక- మానసిక రుగ్మతలు తెచ్చిపెట్టవా?
ముందు మానవత్వం తో పక్కవాడి మేలు కోరుకుందాము! తర్వాత మనను మనం ప్రేమించుకుందాము! అందుకే దేశిధి నేతలు
యుద్ధం – లాభనష్టాల బేరీజు వేసికొని,
ప్రపంచ దేశాలు ఒకసారి ఆలోచించాలి!
యుద్ధం వల్ల లాభం ఏమిటి? వస్తే కొంత భూభాగం వస్తుందేమో? లేదా ఆధిపత్యం వస్తే వస్తుంది కావచ్చు.అది కూడా తాత్కాలిక ఆధిపత్యమే!
కానీ నష్టం ఏమిటి?
అనేక ప్రాణాలు పోతాయి, అదికూడా అన్నెంపున్నెం ఎరుగని పౌరులు, పసివారు, ఆడవాళ్ళు…వీరికీ ఆ యుద్ధానికి సంబంధమే ఉండదు.ఐనా బలౌతారు…అనాధలౌతారు…ఒక తరం వెనుక బడుతుంది.ఆర్థిక వ్యవస్థలు కూలిపోతాయి…సంవత్సరాల కొద్దీ నిర్మించుకొన్న భవనాలు కూలిపోతాయి, చారిత్రక సంబంధ ఆనవాళ్ళు పోయే అవకాశం ఉంటుంది. అలా జరిగితే ఆ దేశ – ప్రాంత అస్థిత్వమే కోల్పోతుంది
ఆ జాతి. అదెంత నష్టమో ఆలోచించరా?
భవిష్యత్ తరాలపై చెడు ప్రభావం ఆరోగ్య పరంగానూ, ఆ చేదు విషాదంతో మానసికంగానూ ఎంతగానో పడుతుంది.మనుషులు మృదుత్వం కోల్పోయి హృదయాలు కరుడుకట్టుతాయి . దాంతోమానవ విలువల పతనం ఔతుంది…కనుక
యుద్ధం వల్ల లాభం తక్కువ నష్టం అంతులే నంత! అదే ప్రపంచంలో శాంతి ఉంటే:దేశాలు అభివృద్ధి చెందుతాయి;విద్య, వైద్యం, విజ్ఞానం పెరుగుతాయి!మనుషుల మధ్య ప్రేమ పెరుగుతుంది. మన ప్రాచీన మహర్షులు చెప్పినట్లు:

అహింసా పరమో ధర్మః”

హింసను విడిచి శాంతిని ఆచరించడమే పరమ ధర్మం.
చుట్టుపక్కల జరుగుతున్న భీకర యుద్ధ బీభత్సం చూసే పాలకులకు- ప్రభువులకు చీమ కుట్టినట్టైనా లేదా?

మహాభారతం మనను హెచ్చరిస్తోంది…
హిరోషిమా మనకు గుర్తుచేస్తోంది…

యుద్ధం అనేది పరిష్కారం కాదు!
శాంతి మాత్రమే శాశ్వత మార్గం! అని….

కాబట్టి మనం, ఆ యా దేశాలు, వాటి నాయకులు
అందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి:
అస్త్రాల కంటే ఆలోచనలు గొప్పవి”
యుద్ధాల కంటే సంభాషణలు శ్రేష్ఠమైనవి.”
ప్రపంచ ప్రజలంతా కలసి అనుకోవాలి! సమాజ హితైషులంతా కలిసి అహింసా- శాంతి నినాదాన్ని యుద్ధకాముకులదాకా చేరవేయాలి…
దుష్టులను శిక్షించండి! కాదనము! కానీ శిష్టులను రక్షించే మరో కృష్ణులు కమ్మని మాత్రమే కోరుకుంటూ… ఎలుక చొచ్చిందని ఇల్లు తగుల బెట్టుకోనవసరం లేదుకదా? ఎలుకలను ఏరిపారేయండి! ఏమీ తెలియని అమాయకులను బలిచేయకండి!

“ప్రపంచం యుద్ధ రహితంగా ఉండాలి*…
శాంతి పతాకం ఎల్లప్పుడూ ఎగరాలి!”

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మహిళా దినోత్సవం నాడు స్నేహ వనం లో మేము….

ఆణిముత్యాలు