వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)

ఆహా! ఆవ కాయ.. అదీ టమాటో ఆవకాయ!

తయారు చేసింది..ఇంకెవరు మనమే.. మనమే అంటే మీకు ఎట్లా తెలుస్తుంది నేనేమన్నా సిఎం నా పిఎం నా! అదేనండి లక్ష్మీ మదన్ ను..

ఎన్ని వంటకాలు తిన్నా మామూలే.కానీ ఇలాంటి ఆవకాయలు పచ్చళ్ళు చూస్తేనే నోరూరుతుంది కదా! అబ్బ! రాస్తుంటేనే వెళ్లి తినాలి అనిపిస్తుంది.

మనము ఏదైనా టూర్ వెళ్లి వచ్చామనుకోండి. ఇంటికి రాగానే ఎప్పుడెప్పుడు కొంచెం అన్నం వండుకొని అందులో ఆవకాయ వేసుకుని తినాలని ఉంటుంది. అంతకుమించి ఇంకేముంటుంది!

సరే విషయానికి వస్తాను.

ఇప్పుడు టమాటాలు చాలా చవక. పాపం రైతులైతే గిట్టుబాటు లేక రోడ్లమీద పడేసి కూడా వెళుతుంటారు. రైతుకు భరోసా కల్పించాలి.

టమాటాలను కడిగి తడి లేకుండా తుడిచి లేదా ఆరబెట్టి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.

ఒక దళసరి బాణీలో కొద్దిగా నూనె వేసి ఈ టమాటా ముక్కలు వేసి అందులో కొంచెం చింతపండు వేసి మూత పెట్టి బాగా ఉడికించాలి.

అవి ఉడుకుతుంటే మీరు మొబైల్ చూడటం టీవీ చూడటం చేయకండి. పని ఉంది చెప్తాను.

రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల జీలకర్ర నాలుగు స్పూన్ల ఆవాలను చక్కగా వేయించండి. వీటిని పొడి చేసి పక్కన పెట్టండి.

ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో టమాటాలను బట్టి కారాన్ని తీసుకోండి. ఉప్పు కారం సమానం కొలతలు. ఇప్పుడు పొడి చేసుకున్న పదార్థాన్ని అందులోనే కలపండి.

ఈ టమాటాలు బాగా మగ్గిన తర్వాత నీరంతా పోవాలి. అప్పుడు చల్లార్చండి. అవసరం అనుకుంటే మిక్సీలో వేసుకోండి నేనైతే వేయలేదు. ఇప్పుడు ఆ కారం మిశ్రమంలో టమాటా గుజ్జు కలపండి.

ఆ తర్వాతే ఏంటి చక్కగా పోపు వేయండి. వెల్లుల్లి తినేవాళ్లు వెల్లుల్లితో వేసు కొండి. ఇంగువతో కావాలనుకుంటే ఇంగువ వేయండి. నేను ఇంగువ పోపు వేశాను. నూనె మీ ఇష్టం..

ఇది ఊరాల్సిన అవసరం కూడా లేదు. అయిన వెంటనే అన్నంలో కలుపుకొని తినేయవచ్చు. అసలు వేరే కూర అవసరమే లేదు. పెట్టిన రోజు మనకు అలా అనిపిస్తుంది.

మరి ఆవకాయ అన్నం తిందామా?

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆణిముత్యాలు

ఆడపిల్ల