రవికాంత్కి ఏడవ తరగతి పరీక్ష పూర్తయి,సెలవులు ఇచ్చేశారు.సెలవుల్లో అతనికి స్నేహితులతో క్రికెట్ ఆడటం,తండ్రి మనోజ్ని చదరంగంలో ఓడించడం అంటే చాలా ఇష్టం.కానీ వాటన్నిటికన్నా తల్లి మీనా చెప్పే ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు వినడం ఇష్టం.అవి చందమామ కథలా,ప్రతిసారీ వినూత్నంగా ఉంటాయి.కానీ ఇంటికి బంధువులు రావడం తో మూడు రోజులుగా తల్లికి తీరిక లేదు.ఆ రోజు బంధువులు వెళ్ళిపోవడంతో,రాత్రి భోజనం అయ్యాక తల్లి వద్దకు వెళ్లి “అమ్మా! చుట్టాలు వెళ్ళిపోయారు కదా,ఈ రోజైనా నీ చిన్ననాటి విషయాలు చెబుతావా?”అని అడిగాడు రవి.
మీనా రవికాంత్ తల నిమిరి,”రవీ,వంటింట్లో పని పూర్తి చేసుకుని ఈవేళ నీ పక్కనే పడుకుని కొత్త విషయాలు చెబుతాను. సరేనా?”అని ప్రేమగా అనడంతో రవి సంతోషంతో “హుర్రే!” అంటూ ఒక్క గంతు వేశాడు.
రాత్రి పది గంటలకు మీనా గదిలోకి రావడం చూసిన రవికాంత్ ఉత్సాహంగా మంచంపై కొంచెం పక్కకు జరిగి, తల్లి పడుకోవడానికి కొంత స్థలం ఇచ్చి,‘ఇక చెప్పు’ అన్నట్లు ఆమె వైపు చూశాడు. మీనా రవికాంత్ కి దుప్పటి కప్పుతూ,“అది సరే కానీ,నువ్వు నాన్నతో పెద్దయ్యాక బాగా చదువుకుని లాయర్ అవుతానన్నావట?నిజమేనా?”అన్నది కుతూహలంగా.
“అవునమ్మా, నేను బాగా చదువుకుని, నీ నరసింహ తాతగారిలా మంచి లాయర్నవుతాను.ఆయన ఫోటో నీ పెళ్ళి ఆల్బమ్లో చూశాను.ఆయనలాగే ఓ మంచి న్యాయవాదినై,బీదలకు న్యాయం ఇప్పిస్తాను,” అన్నాడు గర్వంగా. మీనా వాడికి బీదల పట్ల ఉన్న జాలి, దయ చూసి సంతోషపడి,”సరేలే, ఇంకా నువ్వు పదవ తరగతి పాస్ అవడానికి సమయం ఉంది, అప్పుడు ఆలోచిద్దాం. ఇవాళ మా తాతగారిని గుర్తు చేశావు కదా, నీకు మా నరసింహం తాతగారు,అమ్మమ్మ లక్ష్మమ్మ గురించి, వారు ఉండే పల్లె గురించి చెబుతాను, సరేనా?” అని చెప్పడం మొదలుపెట్టింది.
“నేను, నా తమ్ముడు కలిసి ప్రతి వేసవి సెలవులనూ సరదాగా తాతగారి ఇంట్లోనే గడిపేవాళ్ళం.మేము ఉండే విజయనగరం నుండి వారు ఉండే బొబ్బిలి దగ్గర గొల్లపల్లికి బస్సులో రెండు గంటల ప్రయాణం.గొల్లపల్లి చిన్న పల్లెటూరే కానీ అక్కడ తయారయ్యే వీణ ఆ పల్లెకి ప్రసిద్ధి సంపాదించి పెట్టింది.అక్కడ వీణను సరస్వతి వీణ, బొబ్బిలి వీణ, తేలికగా ఉండే పనస చెట్టు కాండంతో తయారుచేస్తారు కాబట్టి ఏకాండ వీణ అని కూడా అంటారు.నా దగ్గర ఉన్న వీణ కూడా అక్కడిదే.వీణ తయారీకి సుమారు ఒక నెల రోజులు సమయం పడుతుంది తెలుసా,” అని మీనా అనడంతో,“బాబోయ్! అంత కష్టపడి చేస్తారా?అందుకే నువ్వు ఆ వీణ వాయిస్తుంటే అంత మధురంగా ఉంటుంది,” అన్నాడు రవి.
మీనా వస్తున్న నిద్రను ఆపుకునే ప్రయత్నం చేస్తూ, “గోల్లపల్లిలో తాతగారిది వంద సంవత్సరాల నాటి పాత ఇల్లు.తాతగారికి ఒక ప్రత్యేకమైన ఆఫీసు గది ఉండేది. ఆ గదిలో రెండు బీరువాలు నిండా చట్టానికి సంబంధించిన పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, దేశ విదేశాల రచయితల రచనలు ఉండేవి. ఒక పక్క చెక్క బల్ల, దాని ఎదురుగా రెండు కుర్చీలు ఉండేవి. గదికి ఒక మూలన పాత టేబుల్ ఫ్యాన్, దానికి ఎదురుగా ఒక మడత కుర్చీ ఉండేవి. రాత్రి భోజనం తర్వాత ఆయన ఆ కుర్చీలోనే చారబడి మాకు కథలు చెప్పేవారు” అని చెప్తున్న మీనా కి అకస్మాత్తుగా ఏదో గుర్తుకు వచ్చి, “రవీ! నీకు అక్కడ ఒక అపురూపమైన వస్తువు గురించి చెప్పడం మర్చిపోయాను,” అనడంతో వెంటనే రవి కళ్ళలో మెరుపుతో, “ఏంటమ్మా అది? ప్లీడర్ తాతగారు వాడే వస్తువా?” అని ఆసక్తిగా అడిగాడు.
“అది నువ్వెన్నడూ చూడని ‘బోనె పెట్టె’ ” అంది మీనా.
“పెట్టె అంటే బాక్స్, మరి ‘బోనె పెట్టెఅంటే ఏమిటమ్మా?” రవి ఆశ్చర్యంతో కళ్ళప్పగించి అడిగాడు.
“బోనె పెట్టె అంటే సుమారు ఆరు అడుగులు పొడవు, నాలుగు అడుగులు ఎత్తు, వెడల్పు ఉండే ఒక పెద్ద కర్ర పెట్టె. కొందరు దానిని ‘భోషాణం పెట్టె’ అని కూడా పిలిచేవారు,”అంది మీనా జాగ్రత్తగా వింటున్న రవితో.
“మా అమ్మమ్మ పెళ్ళికి ఆమె తండ్రి స్వయంగా చేయించి, అందులో ఆమె సారె సామానులు పెట్టి పంపారట,” అని మీనా చెప్పగానే, “అది ఇప్పటికీ అక్కడే ఉందా?” అని అడిగాడు ఆత్రుతగా రవి.
“అవునురా, ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. మంచి టేకు కర్ర మీద అందంగా చెక్కబడి, తాళం వేసుకోవడానికి ఒక పెద్ద ఇత్తడి గొళ్ళెం కూడా ఉండేది.” అని మీనా వివరించింది.
“మరి లోపల ఎలా ఉంటుంది అమ్మా, ఏమి పెట్టేవారు దానిలో?” అని రవి కుతూహలంతో అడిగాడు.
“పెట్టి లోపల చాలా అరలుండేవి.వాడని ఇత్తడి, వెండి సామాన్లు, పాత ఫోటోలు, దేవుడి విగ్రహాలు, అలాగే బొంతలు, తలగడలు లాంటివి కూడా అమ్మమ్మ చక్కగా అరలో సర్దేది. దసరాకి ‘బొమ్మల కొలువు’ కి వాడే బొమ్మలన్నీ అమ్మమ్మ జాగ్రత్తగా పాత బట్టలలో చుట్టి బోనె పెట్టెలో ఉంచేది. ఒక్కటేంటి, లెక్కలేనన్ని వస్తువులు ఉండేవి ఆ పెట్టెలో. ఇంట్లో ఏది కనపడకపోయినా, మొదట ఆ పెట్టెలో వెతికేవారు.
“అమ్మమ్మ దానిలో నాఫ్తలీన్ బాల్స్ వేసి పురుగు పట్టకుండా చూసేది. ఆ పెట్టెను సులభంగా జరపడానికి వీలుగా, కింద చిన్న చక్రాలు కూడా ఉండేవి. ఏడాదికి ఒక్కసారి దానిని జరిపి, కింద, లోపల కూడా పనివాడి చేత శుభ్రం చేయించేవారు,” అని చెప్పడం ఆపి, “రవి! మా తాతగారి ఇంటి విశేషాలు ఒక రోజులో చెబితే అయిపోయేవి కావురా. ఇప్పటికే చాలా రాత్రి అయింది, నీకు నిద్ర వస్తుందీ. పడుకుందాం,” అంటు రవికి ఇంకా అక్కడ సంగతులు తెలుసుకోవాలని ఉన్నా, మీనా లైట్ ఆఫ్ చేసి నిద్రలోకి జారుకుంది.
రవికాంత్ కి రాత్రి అంతా గొల్లపల్లి ఇల్లు, బోనె పెట్టె కలలతో సరిగ్గా నిద్ర పట్టలేదు.ప్రొద్దున్నే లేచి వంటగదిలో టిఫిన్ చేస్తున్న మీనా వద్దకు వెళ్లి, ” అమ్మా, మనం వేసవి సెలవులకు గొల్లపల్లి వెళ్దామా?”అన్నాడు విన్నపంగా.
“రవి, మొన్నటి వరకు షిమ్లా వెళ్దాం అని మారాం చేసినవాడివి, ఇప్పుడు గొల్లపల్లి వెళ్దాం అంటున్నావు” అంది చిన్నగా నవ్వి.
“అమ్మా, నువ్వు నిన్న రాత్రి గొల్లపల్లి సంగతులు చెప్పినప్పటినుండి నాకు ఆ ఇల్లు, ఆ బోనె పెట్టె చూడాలని ఉంది. మన పల్లెలోనే ఇంత ఇంటరెస్టింగ్ వస్తువులు ఉంటే, ఇక షిమ్లా వెళ్ళడం ఎందుకు?” అన్నాడు రవి.
“సరేలే, మీ నాన్నకి చెప్పి అక్కడికి వెళ్ళడానికి ఏర్పాటు చేయిస్తాను. నీకు ఇష్టమని పెసరట్టు వేశాను. పద, టిఫిన్ చేద్దాం,” అని టిఫిన్ ప్లేట్ అందించింది మీనా.
అనుకున్న విధంగానే వేసవి సెలవుల్లో తల్లి, కొడుకు కలిసి గొల్లపల్లికి చేరుకున్నారు. మనవరాలిని, మునిమనవడిని చూసిన లక్ష్మమ్మగారి ఆనందం అవధులు దాటింది. అక్కడికి చేరుకునేసరికి రాత్రి అవ్వడంతో అలసటతో నిద్రపోయాడు రవి. తెల్లవారగానే లేచి, ముఖం కడుక్కుని, ఇల్లంతా తిరిగి చూశాడు. ఇప్పటికి కూడా తల్లి చెప్పినట్లే అన్నీ అమర్చబడి ఉన్నాయి. నరసింహ తాతగారి గదిలో అన్నీ చూసి, చివరికి తల్లితో కలిసి బోనె పెట్టె ఉన్న గది వైపు వెళ్ళాడు. తల్లి చెప్పినట్లే, బోనె పెట్టె చాలా అందంగా నగిషీ చేయబడి ఉంది. రవి, తల్లి సహాయంతో మెల్లగా బోనె పెట్టె మూత తెరవగానే, దాని నిండా రకరకాల వస్తువులు చక్కగా సర్దబడి ఉండటం చూసి రవి చాలా సంతోషించాడు.
‘అమ్మా, బోనె పెట్టె ఎంత సదుపాయంగా ఉందో కదా, నువ్వు చెప్పినట్లే అటు ఇటు జరపడానికి సులువుగా కింద చక్రాలు కూడా ఉన్నాయి చూడు” అంటూ కొంచెం జరపడానికి చూసేసరికి “మ్యావ్” “మ్యావ్” అంటూ దాని కింద నుంచి రెండు తెల్ల పిల్లి పిల్లలు బయటికి వచ్చాయి.
అప్పటికే అక్కడికి వచ్చిన లక్ష్మమ్మగారు వాటిని ప్రేమగా చూసి, “రాము, శ్యాము లేచిపోయారా! ఉండండి, తెస్తాను” అంటూ త్వరగా వెళ్లి ఒక ప్లేటులో పాలు, అన్నం కలిపి పెట్టారు వాటికి.
రవి వాటిని చూసి, “భలే, భలే రాము, శ్యాము! చాలా ముద్దుగా ఉన్నాయి, జేజమ్మా,” అంటూ వాటిని ప్రేమగా నిమిరాడు. మరోసారి బోనె పెట్టెను తృప్తిగా చూసి, తాళం వేసి, లక్ష్మమ్మగారికి ఇచ్చి, “థాంక్యూ జేజమ్మా, బోన్ పెట్టె చూపించినందుకు,” అని ఆమెకు ముద్దుపెట్టాడు.
దానికి లక్ష్మమ్మగారు మురిసిపోయి “నా తండ్రే! నేనంటే నీకెంత ప్రేమ రా!” అంటూ కొంగున ముడి వేసిన ఓ 500 రూపాయల నోటును చేతిలో పెట్టి, “నాన్నా, రవీ ఈ డబ్బుతో అమ్మతో బొబ్బిలి వెళ్ళినప్పుడు నీకు నచ్చింది కొనుక్కో,” అని రవి చేతిలో ఆ నోటును ఉంచారు.
మారునాడు రవి, తల్లితో కలిసి పల్లె అంతా చూసి, బొబ్బిలి వీణలు తయారుచేసే సర్వాసిద్ధి వంశానికి చెందిన వారిని కలిసి, వీణల తయారీని చూసి, అక్కడ గుర్తుగా వారు తయారుచేస్తున్న ఒక చిన్న వీణను కొనుక్కున్నాడు. అక్కడి నుండి బొబ్బిలిలో ప్రధాన ఆకర్షణ అయిన రాయడప్ప కట్టించిన కోట మరియు రాజభవనాన్ని సందర్శించారు. ఆ ప్రాంతంలోనే ఉన్న దర్బార్ హాల్, రాజా కుటుంబం నివసించే భవనాలు, చారిత్రక కళాఖండాలను ప్రదర్శించే చిన్న మ్యూజియంను కూడా చూశారు. కోట ప్రాంగణంలోనే ఉన్న, బొబ్బిలి రాజుల వంశంచే ఆరాధించబడే వారి కులదైవమైన వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.
అక్కడ ఉన్నన్ని రోజులు రవి, రోజుకి రెండు మూడు మాటలైనా బోనె పెట్టెను, దాని క్రిందనున్న పిల్లి పిల్లలను చూసి ఆనందించేవాడు. రోజంతా జేజమ్మ వెంటే ఉంటూ ఆమెను వదిలేవాడు కాదు. లక్షమ్మగారు కూడా అతనికి ఆమె చిన్ననాటి సంగతులు చెబుతూ, మధ్యాహ్నం వేళ ఆమె చిన్నప్పుడు ఆడే మేక-పులి, వైకుంఠపాళి, అష్టాచెమ్మా వంటి ఆటలు రవికి నేర్పించి, ఆడేవారు. సాయంత్రాలు నరసింహం తాతాగారు మడత కుర్చీలో కూర్చొని రవికి కథలు చెప్పేవారు. పది రోజులు ఇట్టే గడిచిపోయాయి. మరునాడు ప్రయాణం అనగా, ఆ సాయంత్రం కథ చెబుతున్నప్పుడు, లక్షమ్మగారు రవి పరధ్యానంగా ఉండడం చూసి ప్రేమగా అడిగారు, “ఏమైంది నాన్న? గొల్లపల్లిని వదిలి వెళ్లాలని లేదా? లేక నీ జేజమ్మాను వదిలి వెళ్లాలని లేదా?” అని అనడంతో రవి కళ్ళలో నీళ్లు తిరిగాయి.
“అవును జేజమ్మా, నిన్ను, ఆ బోనె పెట్టెను వదిలి వెళ్ళాలని లేదు. నువ్వు నాకు ఎన్నో మంచి మంచి కథలు చెబుతావు, నాతో ఆడతావు, ఎన్నో సంగతులు నేర్పిస్తావు. మరి బోనె పెట్టె కూడా నాకు చాలా నచ్చింది. నాన్నకు చెప్పి మిమ్మల్ని హైదరాబాద్కి తీసుకెళ్ళిపోతాను. ప్లీజ్, నాతో రావా,” అని బతిమాలాడు.
లక్ష్మమ్మగారు రవిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఇలా అన్నారు, “రవి, ఒక చిన్న ప్రశ్న, నీళ్లు లేకుండా చేప బ్రతకగలదా?” దానికి రవి ‘కాదు’ అని తల ఊపాడు. “అలాగే నేను కూడా డెబ్బై ఏళ్ల కింద మీ ప్లీడర్ తాతాగారితో పెళ్లి అయి ఈ ఇంటికి వచ్చాను. అప్పటినుండి ఈ ఇల్లే నాకు సర్వస్వం. ఈ ఇంటిని విడిచి నేను ఎక్కడా ఉండలేను. మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి విజయనగరం వెళ్ళినా రెండు రోజుల కన్నా ఉండను. బోనె పెట్టె కూడా అంతే. దానిని నా తో పాటు పుట్టింటి నుండి తీసుకొచ్చాను. నువ్వు దానిని హైదరాబాద్లో మీ చిన్న ఫ్లాట్ లో ఎక్కడ పెడతావు?దానిని ద్వారం నుండి లోపలికి తీసుకొని వెళ్ళడమే కష్టం. నేను నా బోన్ పెట్టెతో ఇక్కడే, ఈ మట్టిలో కలిసిపోవాలి. నీకు నన్ను కానీ, బోన్ పెట్టెను కానీ చూడాలనిపిస్తే ఇక్కడికి వచ్చేసేయి. బాధ పడకు, సరేనా,” అంటూ రవికి ప్రేమగా బోధపరిచారు.
ప్రొద్దున్నే విశాఖపట్నం ఎయిర్పోర్టు వెళ్ళడానికి మీనా బుక్ చేసిన కారు రావడంతో, మీనా సామాను కారులో పెట్టింది. రవి చివరిసారి బోనె పెట్టె ఉన్న గదిలోకి వెళ్లి, పెట్టెను ప్రేమగా నిమిరి, దాని కింద అప్పుడే నిద్రలేస్తున్న పిల్లి పిల్లను ఎత్తుకొని,” రాము, శ్యాము, జేజమ్మాని అల్లరి పెట్టకండి, జాగ్రత్తగా చూసుకోండి. నేను మళ్ళా వచ్చేసరికి మీరు పెద్ద అయిపోతారు కదా, అప్పుడు చాలా ఆడుకుందాం” అంటూ ముద్దు చేశాడు.
లక్ష్మమ్మ గారు రవిని దగ్గరకు తీసుకొని, “నాన్నా, ఈ ముసలిదానిని మరచిపోవు కదా, మళ్ళా వస్తావు కదా” అని ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. రవి ఆమె కళ్ళు తుడిచి, ” జేజమ్మా, నేను రోజు నీతో ఫోన్ చేసి మాట్లాడతాను. మళ్ళా సెలవులు రాగానే ఈసారి నాన్నని కూడా తీసుకొని వచ్చి బోనె పెట్టెను చుపిస్తాను” అన్నట్లు ఆమెకు ముద్దుపెట్టి కారెక్కాడు. లక్ష్మమ్మగారు బోనె పెట్టెలో జాగ్రత్తగా సామాను సర్దినట్లు,రవి కూడా తన మనసు అనే బోనె పెట్టెలో పల్లెలో గడిపిన జ్ఞాపకాలను భద్రంగా దాచుకున్నాడు.***